ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
ABN, First Publish Date - 2023-02-21T23:57:27+05:30
ఆరోగ్య తెలంగాణ సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి స్మిత సబర్వాల్ అన్నారు.
- సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి స్మిత సబర్వాల్
- భిక్కనూరు పీహెచ్సీ, అంగన్వాడీ కేంద్రాల పరిశీలన
- పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు భారతీ హోలికేళి, శ్వేతా మహంతి
భిక్కనూరు, ఫిబ్రవరి 21: ఆరోగ్య తెలంగాణ సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి స్మిత సబర్వాల్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను వారు పరిశీలించారు. గర్భిణులు, బాలింతలతో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి స్మిత సబర్వాల్ మాట్లాడుతూ గర్భిణులు సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీలకు ప్రయత్నించాలన్నారు. గర్భిణులు ఆరోగ్యంగా ఉండాలన్నారు. అందరి ఆరోగ్యం మాత్రం వారి చేతుల్లో ఉంది.. కానీ వారి ఆరోగ్యం మాత్రం వారి చేతుల్లో లేదన్నారు. గర్భిణులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారికి పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్ను అందజేస్తుందన్నారు. ఇది వరకు ఒక బిడ్డ రెండు, రెండున్నర కిలోలు పుడితే సరిపోయింది, కానీ ఇక నుంచి ప్రస్తుత ఆహారపు అలవాట్లు, లైఫ్స్టైల్కు అనుగుణంగా మరింత ఎక్కువగా బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలన్నారు. మూడు కిలోల లోపు బిడ్డ పుడితే చాలా ఆరోగ్య సమస్యలకు గురవుతారన్నారు. ఇక నుంచి తక్కువ బరువుతో ఏ బిడ్డ జన్మించవద్దని, ప్రతిఒక్కరిలో మార్పు రావాలని అన్నారు. బలహీనత సమస్య అనేది మన తెలంగాణలో ఇక నుంచి ఉండకూడని అన్నారు. ప్రతీ గర్భిణి మంచి పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న న్యూట్రిషియన్ కిట్లోని ప్రతీ దానిని పిల్లలకు, భర్తకు ఇవ్వకుండా తానే తినాలని, తాగాలని సూచించారు. ఇతర రాష్ట్రాలైన కేరళ, తమిళనాడులో తక్కువ బరువుతో, బలహీనంగా ఉండే పిల్లలే ఉండరన్నారు. ఆ రాష్ట్రాల మాదిరిగా మన రాష్ట్రంలోనూ మహిళలు ఆరోగ్యంగా తయారై బిడ్డల బలహీనత, తక్కువ బరువు సమస్యను పూర్తిగా రూపుమాపుదామన్నారు. అందుకు వైద్య సిబ్బంది, గర్భిణులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా సహకరించాలన్నారు. ఆరోగ్య తెలంగాణ సాధించడమే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. అందులో భాగంగానే అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. ఆమె వెంట మహిళా శిశుసంక్షేమ శాఖ అదనపు కమిషనర్ భారతీ హోలికేళి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహాంతి ఉన్నారు.
ఆశాల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తా
భిక్కనూరు పీహెచ్సీని సందర్శించిన సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్కు భిక్కనూరు మండల ఆశా వర్కర్లు వారి సమస్యలను వివరించగా ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆశా వర్కర్లు ప్రభుత్వం నిర్ధేశించిన ప్రతీ పనిని విజయవంతం చేయాలన్నారు. సీఎం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్తానని స్మితా సబర్వాల్ వారికి హామీ ఇచ్చారు.
కంటివెలుగు కార్యక్రమ పరిశీలన
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని భిక్కనూరు మండల కేంద్రంలో వారు పరిశీలించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. అనంతరం లబ్ధిదారులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్సింగ్, డిప్యూటీ డీఎంహెచ్వో చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Updated Date - 2023-02-21T23:57:39+05:30 IST