రైతులకు శాపంగా వారబందీ విధానం
ABN, First Publish Date - 2023-03-13T00:17:29+05:30
వారబందీ విధానం రైతులకు శాపంగా మారింది. వరి పంటలు ఎండిపోవడంతో రైతుల ఆందోళనతో ఉన్నారు.
ఎండుతున్న వరి పొలాలు
ఆందోళనలో రైతులు
అర్వపల్లి, మార్చి 12: వారబందీ విధానం రైతులకు శాపంగా మారింది. వరి పంటలు ఎండిపోవడంతో రైతుల ఆందోళనతో ఉన్నారు. శ్రీరాంసాగర్ ఆయకట్టు కింద ఉన్న 69, 70, 71 డీబీఎం మెయిన్ కాల్వలకు వారబందీ పేరుతో గోదావరి జలాలను రెండు నెలలుగా ఎస్సారెస్పీ అధికా రులు విడుదల చేస్తున్నారు. ఈ జలాలను నమ్ముకుని 69 డీబీఎం కింద 40వేల ఎకరాల్లో రైతులు వరిని సాగు చేసు ్తన్నారు. చివరి భూములకు నీరందనందున వరి పొలాలు ఎండిపోతున్నాయి. 70డీబీఎం కింద 1.44 లక్షల ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది. దాదాపు 90వేల ఎకరాల్లో రైతులు వరిని సాగుచేస్తున్నారు. గోదావరి జలాల వార బందీలో భాగంగా నీరు బంద్ కావడంతో పొట్టదశలో ఉన్న వరి పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారబందీ విధానంతో మూడు రోజులు 1200క్యూసెక్కులు, తర్వాత నాలుగు రోజులు 1800క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేసినా చివరి భూములకు నీరందన రైతులు నిరాశతో ఉన్నారు. వరి పంట పొట్ట దశలో ఉందని, ఈ సమయంలో నీరు అందకపోతే సరైన దిగుబడులు రావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నెల ఆఖరు వరకు వారబందీ లేకుండా నిరంతరం నీటి సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
నిరంతరం నీటిని అందించాలి
గోదావరి జలాలను వారబందీ లేకుండా నిరంతరం నెలరోజుల పాటు నీటిని అందించాలి. పొలాలు పొట్టదశలో ఉన్నందున నెల రోజుల పాటు నీరు అందిస్తే పంటలు మంచి దిగుబడులు వస్తాయి. ఎస్సారెస్పీ అధికారులు స్పందించిన నీటిని విడుదల చేయాలి.
బైరబోయిన భూమయ్య, రైతు, అర్వపల్లి
Updated Date - 2023-03-13T00:17:29+05:30 IST