సహకార రైతులకు ‘తెలంగాణ దశాబ్ది డిపాజిట్’ పథకం
ABN, First Publish Date - 2023-06-02T23:44:06+05:30
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సహకార రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు తెలంగాణ దశాబ్ది డిపాజిట్ పథకాన్ని ప్రారంభించినట్లు డీసీసీబీ చైర్మన గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు.
డీసీసీబీ చైర్మన గొంగిడి మహేందర్రెడ్డి
నల్లగొండ, జూన 2: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సహకార రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు తెలంగాణ దశాబ్ది డిపాజిట్ పథకాన్ని ప్రారంభించినట్లు డీసీసీబీ చైర్మన గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో డిపాజిట్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి, కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది డిపాజిట్ పథకానికి మూడేళ్లకు 7.75శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు తెలిపారు. రూ.10లక్షలు ఆపైన డిపాజిట్లపై అదనంగా 0.25శాతం వడ్డీ, రూ.20లక్షలు ఆపైన డిపాజిట్లపై అదనంగా 0.50శాతం వడ్డీ చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ పథకానికి ఈ నెల 22వ తేదీ వరకు వర్తింపజేయడం జరుగుతుందని, రైతులు, ఖాతాదారులు ఈ డిపాజిట్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైన సందర్భంగా ఈ పథకాన్ని ప్రత్యేకంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రారంభించామన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దశాబ్ది ఉత్సవాలను ఈ నెల 22వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు వివరించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు వేదికల వద్ద నిర్వహించే కార్యక్రమాల్లో 600 నుంచి 1000 మంది రైతులు పాల్గొనేలా చేసి ప్రభుత్వ పథకాలను వారికి వివరించాలని పండుగ వాతావరణంలో ఈ ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ సీఈవో కె. మధనమోహన, జీఎం వసంతరావు, డీజీఎం అశోక్, ఏజీఎం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-02T23:44:06+05:30 IST