ఆలయ నిర్మాణంపై రాజకీయ వేడి
ABN, First Publish Date - 2023-06-01T00:53:51+05:30
మండలంలోని కరక్కాయలగూడెంలో వందేళ్ల చరిత్ర కలిగిన సీతారామచంద్రస్వామి దేవాలయ పునర్నిర్మాణంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు నిలయంగా మారింది.
కరక్కాయలగూడెంలో వందేళ్ల కిందటి రామాలయం
పునర్నిర్మాణంపై రాజకీయ వివాదం
బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం
హుజూర్నగర్, మే 31: మండలంలోని కరక్కాయలగూడెంలో వందేళ్ల చరిత్ర కలిగిన సీతారామచంద్రస్వామి దేవాలయ పునర్నిర్మాణంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు నిలయంగా మారింది. దీంతో ఇరువర్గాల మధ్య ఏం జరుగుతుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గత నెల 29న ఆలయం నిర్మించాలని బీఆర్ఎస్కు చెందిన నేతలు వెళ్లి పాత రామాలయాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల నాయకులు కూడా ఆలయ నిర్మాణంపై జరిపిన చర్చలు ఫలించలేదు. పట్టణంలోని పోలీస్స్టేషన్లో సోమవారం రాత్రి వరకు చర్చలు జరిపినా ఫలించకపోగా బుధవారం గ్రామంలో పోలీసుల సమక్షంలోనే పాత దేవాలయాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారనే సమాచారంతో కాంగ్రెస్ శ్రేణులు మాజీ సర్పంచ్ దొంగరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, అరుణ నాయకత్వంలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవాలయం వద్దనే కూర్చున్నారు. కాగా అధికార పార్టీ నాయకులు దేవాలయం వైపు రాలేదు. దేవాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ నాయకులు కావాలనే అడ్డుకుంటున్నారని అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ జయమ్మధనమూర్తి నాయకత్వంలో సుమారు వందమంది నాయకులు ఆలయ పునర్నిర్మాణంపై సమాచలోచనలు చేశారు. దీంతో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరక్కాయలగూడెంలోని 50గజాల స్థలంలో వందేళ్ల చరిత్ర కలిగిన రామాలయం ఉంది. ఆ స్థలం పక్కనే అదే గ్రామానికి చెందిన పిల్లుట్ల వెంకయ్య, దుర్గయ్య, హనుమంతు, నాగయ్య 170గజాల స్థలాన్ని గతంలోనే కొనుగోలు చేసి దేవాలయానికి అందజేశారు. గ్రామానికి చెందిన అంకతి వెంకటేశ్వర్లు దేవాలయ నిర్మాణానికి రూ.23లక్షల విరాళం ఇస్తానని వాగ్దానం చేశారు. ఆ నిధులతో పాటు గ్రామంలోని అన్ని వర్గాల నుంచి విరాళాలు సేకరించి సుమారు రూ.50లక్షలతో ఆలయ పునర్నిర్మాణం చేయాలని గ్రామస్థులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, పెద్దలు నిర్ణయించారు. కాగా ఈ విషయమై సంవత్సరంగా చర్చలు జరుగుతున్నాయి. ఉన్నట్టుండి అధికార పార్టీ నాయకులు మే 29న ఆలయ పునర్నిర్మాణం పేరుతో ప్రస్తుతం ఉన్న దేవాలయాన్ని కూలగొట్టేందుకు గడ్డపారలు తీసుకుని వచ్చారు. దీంతో కాంగ్రెస్ నాయకులు, అడ్డుకున్నారు.
అసలు వివాదం
ఆలయ పునర్నిర్మాణం సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. సర్పంచ్ కీతా జయమ్మధనమూర్తి, కీతా కృష్ణమోహన్, చింతకుంట్ల శ్రీనివాస్, సుధాకర్ ఈ నెల 8వ తేదీన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్లు దొంగరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ ఆలయంలో సంప్రోక్షణ చేయకుండా, విగ్రహాలు తొలగించకుండా ముహూర్తం చూడకుండా, శంకుస్థాపన తేదీ ప్రకటించకుండా, గ్రామ పెద్దలకు సమాచారం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మంచి ముహూర్తాలు లేవని, శ్రావణమాసం, లేదా కార్తీక మాసంలో ముహూర్తాలు చూసి రామాలయ నిర్మాణంతో పాటు బొడ్రాయి ప్రతిష్ఠ కూడా చేయాల్సి ఉందన్నారు. రెండు పండగలు ఒకేసారి చేయడం వల్ల ఆర్థికంగా ప్రజలకు కూడా ఇబ్బంది ఉండదన్నారు.
కరక్కాయలగూడెంలో కాంగ్రెస్ నాయకులు రాజకీయంగా ఉనికిని కోల్పోతున్నారన్న ఉద్ధేశంతోనే రామాలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని సర్పంచ్ కీతా జయమ్మధనమూర్తి వర్గీయులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి గతంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలకు తెలియజేశామని, సంవత్సర కాలంగా చర్చలు జరుగుతున్నాయన్నారు. కార్తీక మాసం లేదా శ్రావణమాసంలో ఆలయ నిర్మాణం చేయాలంటే గ్రామంలో వ్యవసాయ పనులు ఉంటాయన్నారు. ఎవరెన్ని చెప్పినా జూన్ 8, లేదా 14న ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని స్పష్టంచేశారు. గ్రామస్తుల నిర్ణయం మేరకు తేదీ ప్రకటించామన్నారు. కాంగ్రెస్ నాయకులు కలిసివస్తే అందరితో కమిటీ వేసి పనులు మొదలు పెడతామన్నారు.
Updated Date - 2023-06-01T00:53:51+05:30 IST