కారు.. ద్విచక్రవాహనం ఢీ: ఇద్దరు మృతి
ABN, First Publish Date - 2023-06-07T00:48:11+05:30
తుర్కపల్లి- యాదగిరిగుట్ట ఆర్అండ్బీ రోడ్డుపై వెంకటాపూర్ గ్రామ సమీపంలో కారు.. ద్విచక్రవాహనం ఢీ కొనడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే దుర్మరణం చెందగా, తీవ్ర గాయాలకు గురైన మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం హైద్రాబాద్లోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.
పూర్తిగా దగ్ధమైన కారు, మోటార్ సైకిల్
తుర్కపల్లి, జూన్ 6: తుర్కపల్లి- యాదగిరిగుట్ట ఆర్అండ్బీ రోడ్డుపై వెంకటాపూర్ గ్రామ సమీపంలో కారు.. ద్విచక్రవాహనం ఢీ కొనడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే దుర్మరణం చెందగా, తీవ్ర గాయాలకు గురైన మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం హైద్రాబాద్లోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఎర్టికా కారు.. టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్ పూర్తిగా కాలిబూడిద కాగా, కారులో ఉన్న నలుగురు వ్యక్తులు ప్రాణాల నుంచి బయట పడ్డారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. ఎస్ఐ రాఘవేందర్ గౌడ్, స్థానికులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపేట మండలం నెమిలె గ్రామానికి చెందిన భువనగిరి మైసయ్య(55), ఎర్ర శంకరయ్య(50)లు కలిసి టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్పై మండంలోని వెంకటాపూర్ గ్రామంలో మేస్త్రీ (సమాధి నిర్మాణ పనులు) పని చేయడానికి వస్తున్నారు. మేడ్చల్ జిల్లా జవహార్నగర్ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు ఎర్టికా కారులో యాదగిరిగుట్టకు దైవ దర్శనం కోసం వెళ్తున్నారు. వెంకటాపూర్ సమీపంలో ఎదురుగా అతివేగంగా వస్తున్న ఎర్టికా కారు టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మైసయ్యకు మంటలంటుకుని కాలిన గాయాలతోపాటు తల పగిలి అక్కడిక్కడే మృతి చెందగా, ఎర్ర శంకరయ్య వంటిపై వేసుకున్న దుస్తులు, కాళ్లు స్వల్పంగా కాలడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. కాగా కారు సుమారు 10 -15మీటర్ల దూరం వరకు టీవీఎస్ ఎక్సెల్ బండిని రోడ్డుపై నుంచి నెట్టుకు పోవడంతో మోటార్ సైకిల్ పెట్రోల్ మూత ఊడి పోవడంతో రెండు బండ్లు ఢీ కొనగా వచ్చిన మంటల కారణంగా కారు, మోటార్ సైకిల్ పూర్తి కాలి బూడిదయ్యాయి. మంటలంటుకొని కాలిపోతున్న కారులో నుంచి నలుగురు యువకులు బంగారు భానుకుమార్, కారుపల్లి రవివర్మ, యెత్తెం ఆంజనేయులు, సుంకిశాల అజయ్కుమార్ కారులో దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ నలుగురు స్నేహితులు, ఇంటర్నెట్లో ఉద్యోగులుగా పని చేస్తున్నట్లు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు భువనగిరి ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చే లోపే పూర్తిగా కారు, మోటార్ పైకిల్ కాలి బూడిదయ్యాయి. ఎస్ఐ రాఘవేందర్గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ శంకరయ్యను ముందుగా 108 వాహనంలో చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో భువనగిరిలో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే శంకరయ్య మృతి చెందాడు. ఎక్స్కవేటర్ సాయంతో రోడ్డుపై కాలి బూడిదైన కారు, టీవీఎస్ ఎక్సెల్ బండ్లను రోడ్డు పక్కకు తొలగించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు. మైసయ్య మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడు మైసయ్య గ్రామ పంచాయతీ కార్మికుడిగా పని చేస్తూ, పార్ట్టైంలో మేస్త్రీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి భార్య ఇద్దరు కుమారులతో పాటు వివాహిత కూతురు ఉన్నారు. ఎర్ర శంకరయ్యకు భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. మృతుని బంధువుల పిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడు.
నెమిలలో విషాద ఛాయలు
రాజాపేట: తుర్కపల్లి మండలం వెంకటాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజాపేట మండలం నెమిల గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కాగా ఇద్దరు పేద కుటుంబానికి చెందిన వారే.
Updated Date - 2023-06-07T00:48:11+05:30 IST