దేశం మెచ్చిన నాయకుడు కేసీఆర్
ABN, First Publish Date - 2023-06-11T00:19:19+05:30
దేశం మెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు.
ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
రామచంద్రాపురం, జూన్ 10 : దేశం మెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలో శనివారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. బీరప్పస్వామి, మల్లికార్జునస్వామి, విశ్వకర్మ ఆలయాల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గొల్ల కురుమల సంక్షేమానికి కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. గొల్ల కురుమ భవనాల నిర్మాణానికి హైదరాబాద్ నగరంలో రూ.500 కోట్ల విలువైన భూమిని కేటాయించారని, త్వరలోనే భవనాల నిర్మాణం ప్రారంభిస్తామని తెలియజేశారు. రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభమైందని తెలిపారు. గొర్రెల పంపిణీ పథకాన్ని దేశవ్యాప్తంగా ఆసక్తిగా గమనిస్తున్నారని చెప్పారు. ఈ పథకం గురించి కర్ణాటక కాంగ్రెస్ మంత్రి కేసీఆర్ను కలిసి వివరాలు తెలుసుకున్నారని చెప్పారు. కార్పొరేట్ సంస్థల రాకతో కులవృత్తులకు ఆదరణ తగ్గిందని, అందుకే విశ్వకర్మ కులాలు, చేతివృత్తులు చేసుకునే వారికి సాయం చేయడానికి ప్రభుత్వం రూ.లక్ష రూపాయులు సాయం అందజేస్తున్నదని పేర్కొన్నారు.
నిజాయితీ గల చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి
రాష్ట్రంలో నంబర్ వన్ మున్సిపాలిటీ తెల్లాపూర్ అని మంత్రి అభినందించారు. ప్రజలకు ఇచ్చిన హామీల కోసం చైర్పర్సన్ మల్లెపల్లి లలితాసోమిరెడ్డి పదవికి రాజీనామ చేయడానికి కూడా వెనుకాడలేదని అన్నారు. రాజీనామా వద్దని చెప్పడానికి తాను ఫోన్ చేసినా ఎత్తలేదని, సమస్యలు పరిష్కరిస్తేనే మాట్లాడతానని తేల్చిచెప్పారని గుర్తుచేశారు. మంత్రి కేటీఆర్, అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించిన అనంతరం దండ, శాలువా తీసుకువచ్చి తనను కలిశారని చెప్పారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ అవసరాల కోసం రూ.100 కోట్ల విలువ చేసే ఆరెకరాల భూమిని కేటాయించినట్టు మంత్రి వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేటకు దీటుగా పటాన్చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఉస్మాన్నగర్లో ఐటీహబ్ కోసం వందల ఎకరాల భూమిని సేకరించామని తెలిపారు. రూ.300 కోట్లతో పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్, మున్సిపల్ చైర్పర్సన్ మల్లెపల్లి లలితాసోమిరెడ్డి, కార్పొరేటర్లు బి.పుష్పనగేష్, వి.సింధూఆదర్శరెడ్డి, వైస్చైర్మన్ రాములుగౌడ్, ఆర్డీవో రవీందర్, తహసీల్దార్ బలరాం, కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు శ్రీశైలంయాదవ్, బాబ్జీ, జ్యోతిశ్రీకాంత్రెడ్డి, నాగరాజు, ఉమేశ్వర్, రవీందర్రెడ్డి, సుచరితకొమురయ్య, శ్రీపాల్రెడ్డి, జయలక్ష్మీనర్సింహ, నాయకులు దేవేందర్యాదవ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నూతన పోలీస్స్టేషన్ ప్రారంభం
మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొల్లూరు పోలీ్సస్టేషన్ను మంత్రి హరిశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెల్లాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని, జనాభా కూడా వేగంగా పెరుగుతున్నదని పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కొల్లూరు పోలీ్సస్టేషన్ను ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ స్టిఫెన్ రవీంద్ర, డీసీపీ శిల్పవల్లి, అడిషనల్ డీసీపీ నర్పింహారెడ్డి, ఏసీపీ నర్సింహారావు, సీఐలు సంజీవ, నరేందర్రెడ్డి, తిరుపతి, గ్యాస్టో తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-11T00:19:19+05:30 IST