మాటల ప్రభుత్వాన్ని సాగనంపాలి
ABN, First Publish Date - 2023-09-04T00:08:01+05:30
సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను ప్రతిసారి మోసం చేస్తున్న ఈ మాటల ప్రభుత్వాన్ని సాగనంపాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు.
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్గౌడ్
అక్కన్నపేట, సెప్టెంబరు3: సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను ప్రతిసారి మోసం చేస్తున్న ఈ మాటల ప్రభుత్వాన్ని సాగనంపాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. ఆదివారం అక్కన్నపేట మండలం చౌటపల్లిలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డితో కలిసి నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెరవేర్చబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఏ గ్రామంలో చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు కనిపిస్తున్నాయని, ఈ ప్రభుత్వం ఇస్తామన్న డబుల్ బెడ్రూంలు ఎక్కడా కూడా కనపడడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసి 75 శాతం పనులు పూర్తి చేసిందని, తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ మిగిలిన పనులను పూర్తిచేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలు పూర్తి చేసి రైతుల పొలాలకు నీళ్లు అందిస్తుందని, ఆ బాధ్యత తమదేనని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు రూ.4వేల పెన్షన్, రూ.5లక్షల వరకు అందిస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి, ఏకకాలంలో రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, సొంతస్థలంలో ఇల్లు కుట్టుకునే వారికి రూ.5లక్షలు ఇస్తామన్నారు. వారి వెంట టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి, సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మండల అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య, సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి, తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-09-04T00:08:01+05:30 IST