నా పాలమూరు బంగారు తునక
ABN, First Publish Date - 2023-06-07T00:12:39+05:30
‘నా పాలమూరు బంగారు తునక. తెలం గాణ రాష్ట్రమొచ్చాక పాలమూరు కన్నీళ్లు తుడిచినందుకు సంతోషంగా ఉంది. నేను ఏదీ తలపెట్టినా దేవుడు నన్ను ఓడించ లేదు. ఆగస్టులో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజ ర్వాయర్లను నీటితో నింపుతాం. దాదాపు 80 టీఎంసీల నీటితో పాలమూరు సస్యశ్యామలవుతుంది.’ అని ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు.
తొమ్మిదేళ్లలో దేశానికే ఆదర్శంగా నిలిచాం
తెలంగాణకు ముందు మంత్రులుగా ఉన్నవారు ఏం చేశారు?
నాగర్కర్నూల్ సభలో సీఎం కేసీఆర్
కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ కార్యాలయాల ప్రారంభం
మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జూన్ 6 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ‘నా పాలమూరు బంగారు తునక. తెలం గాణ రాష్ట్రమొచ్చాక పాలమూరు కన్నీళ్లు తుడిచినందుకు సంతోషంగా ఉంది. నేను ఏదీ తలపెట్టినా దేవుడు నన్ను ఓడించ లేదు. ఆగస్టులో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజ ర్వాయర్లను నీటితో నింపుతాం. దాదాపు 80 టీఎంసీల నీటితో పాలమూరు సస్యశ్యామలవుతుంది.’ అని ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో కొల్లాపూర్ చౌరస్తా వద్ద రూ.62.20 కోట్లతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయాల సము దాయాన్ని, అక్కడే రూ.38.05 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని, అదేవిధంగా నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవడం వల్లనే నాగర్కర్నూల్ జిల్లా అయ్యిందని, జిల్లా అయ్యింది కాబట్టే ఇంత చక్కటి కలెక్టర్ కార్యాలయం, పోలీ సు హెడ్క్వార్టర్స్ ఇక్కడ ఏర్పాటయ్యా యని చెప్పారు. తన చేతులమీదుగా వీటిని ప్రారంభించుకోవడాన్ని సంతోషిస్తున్నానని అన్నారు. ఇక్కడి ఎస్పీ కార్యాలయం వద్ద లైట్లు ఏర్పాటు చేయడంతో యువకులు సెల్ఫీలు దిగుతున్న వార్తలు తనదాకా వచ్చాయన్నారు. ఇంత మంచి భవనాలు నిర్మించుకోవడం ఆనందకరమన్నారు.
పాలమూరు చరిత్రలో నిలుస్తుంది
ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే నాడు వలసలు, కరువు, పేదరికం కళ్లముందుండేదని, ఈ విషయమై తాను, ప్రొఫెసర్ జయశంకర్ ఎన్నోసార్లు బాధపడ్డామని తెలిపారు. ఉద్యమ సమయంలో తాను పాలమూరులో పోటీ చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు జయశంకర్ను అడిగితే ఆయన పోటీ చేయాలని అన్నారని.. తాను ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్నారని చెప్పారు. తాను ఎంపీగా పోటీ చేస్తే అక్కున చేర్చుకొని గెలిపించారని, పాలమూరు ఎంపీగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, ఆ గొప్పదనం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈతొమ్మిదేళ్లలో ఒక్కో మెట్టు ఎక్కుతూ దేశానికే ఆదర్శవంతంగా నిలిచామని వివరించారు. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో దేశంలో నెంబర్ వన్గా నిలిచామని, రూ.50 వేల కోట్లతో దేశంలో ఏ రాష్ట్రంలోలేని విధంగా సంక్షేమ పథకాలు అమలను చేస్తున్నామని పేర్కొన్నారు.
ఊరూరా ధాన్యం కేంద్రాలు..
ఒకప్పుడు గంజి కేంద్రాల ఏర్పాటుకు పార్టీలు ఈ జిల్లాలో పోటీలు పడేవని, ఊరూరా గంజి కేంద్రా లుంటే, నేడు ఊరూర ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కేసీఆర్ కంటే దొడ్డు, పొడుగున్న ఎందరో.. సీఎంలుగా చేశారని, ఈ జిల్లాను దత్తత కూడా తీసుకుని గుక్కెడు మంచనీళ్లు కూడా ఇవ్వలేకపోయారని నిలదీశారు. నాడు జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేదని, నేడు ఐదు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని వివరించారు. నాగర్కర్నూల్కు మెడికల్ కాలేజీ రావడానికి ఒక చరిత్ర ఉందన్నారు. తొలుత మహబూబ్నగర్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని, తర్వాత వనపర్తికి మంజూరు ఇచ్చామని, అప్పుడు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తుపాకీ గుండులా తనవద్దకు వచ్చారని, తనకు మెడికల్ కాలేజీ ఇచ్చేంతవరకు సీఎం ఇంట్లోనే ఉంటానని మొండికేశారని, దీంతో అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు ఇంత బ్రహ్మాండమైన మెడకల్ కాలేజీని నాగర్కర్నూల్కు ఇచ్చామని వివరించారు. ఇప్పుడు అడ్డం పొడుగు మాట్లాతున్నవారు, తెలంగాణకు ముందు మంత్రులుగా ఉన్నవారు ఏం చేశారని నిలదీశారు.
20 లక్షల ఎకరాలకు సాగునీరు
తెలంగాణకు మునుపు ఇక్కడి చెరువులను ధ్వంసం చేశారని, తెలంగాణ వచ్చాక మిషన్ కాకతీయతో వాటన్నింటినీ తాము పునరిద్ధరించామని చెప్పారు. ఈజిల్లాలోని సప్తసముద్రాలు, పాలెం చెరువు, వడ్డెమాన్ చెరువులు కంపచెట్లతో నిండి ఉండేవని, కేసరి సముద్రం మురికి చెట్లతో నిండి ఉంటే.. నేడుదాన్ని సుందరంగా తీర్చిదిద్దామని, గౌతమబుద్దుని విగహ్రం కూడా ఏర్పాటు చేయడంతో నేడు పర్యాటక స్థలంగా వర్ధిల్లుతోందని వివరించారు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి, 20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామని తెలిపారు. అచ ్చంపేట అప్పర్ప్లాట్కు కూడా రూ.2 కోట్లతో ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం మంజూరు చేశామని తెలిపారు. ధరణిని రద్దు చేసి బంగాళాఖాతంలో కలపుతామంటోన్న కాంగ్రెస్ నాయకుల మాయమాటుల నమ్మి గోసపడవద్దని సీఎం కేసీఆర్ కోరారు. కార్యక్రమాల్లో మంత్రులు మహమూద్అలీ, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ప్రశాంత్రెడ్డి, ఎంపీలు శ్రీనివాస్రెడ్డి, పోతుగంటి రాములు, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరెడ్డి, రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, అబ్రహాం, కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్సీలు దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న, వాణీదేవి, జడ్పీ చైర్పర్సన్ శాంతికుమారి, సరిత, వనజ, లోక్నాథ్రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్ మందా జగన్నాథ్, మాజీ జడ్పీఛైర్మన్ బండారి భాస్కర్ కార్పొరేషన్ల ఛైర్మన్లు ఇంతియాజ్ ఇసాక్, సాయిచంద్ పాల్గొన్నారు.
కేసీఆర్ దేశ నేత కావాలి: మర్రి జనార్దన్రెడ్డి
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన రీతిలో.. దేశాన్ని కూడా ముందుకు తీసుకుళ్లేందుకు సీఎం కేసీఆర్ సమర్థులని, ఆయన దేశనేత కావాలని ఆందరూ కోరుకుంటున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుత విజయాలు సాధించిందని తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీ మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం రాకతో జిల్లా పావనమైంది: గువ్వల
సీఎం కేసీఆర్ రాకతో నాగర్కర్నూల్ జిల్లా పావన మైందని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు అన్నారు. రాష్ట్రం రాకముందు పనికిరాని మాటలు మాట్లాడినవారికి సమాధానంలా తొమ్మి దేళ్ల పాలన సాగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరప రచాలని కుట్రలు చేసినప్పుడు, ఈ జిల్లాకే చెందిన నాయకుడు ఓటుకు నోటు కేసులో దొరికాడని అన్నారు. ఆ సందర్భంలో రాజ కీయ పునరేకీకరణ చేపట్టిన సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారని వివరించారు. అచ్చంపేట నియోజక వర్గానికి ఐదు టీఎంసీలతో రిజర్వాయర్లు మంజూరు చేశామని వివరించారు. ఎమ్మెల్యేలు బీరం హర్షవర్దన్రెడ్డి, గుర్క జైపాల్యాదవ్ కూడా మాట్లాడారు.
సీఎం సభ సక్సెస్
నాగర్కర్నూల్,(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్ నాగర్కర్నూల్ పర్యటన సక్సెస్ అయ్యింది. జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించేందుకు మంగళవారం నాగర్కర్నూల్కు వచ్చిన సీఎంకు ఘన స్వాగతం లభించింది. మధ్యాహ్నం 3:30 గంటలకు నాగర్కర్నూల్కు చేరుకోవాల్సిన సీఎం కేసీఆర్ 4:55 గంటలకు నూతన కలెక్టరేట్లోని హెలిప్యాడ్ వద్ద దిగారు. ఆయనకు మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ప్రభుత్వవిప్ గువ్వల బాలరాజు, ఎంపీ పి.రాములు, ఎమ్మెల్యేలు మర్రిజనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, గుర్క జైపాల్యాదవ్, చిట్టెం నరసింహారెడ్డి, అబ్రహాం, లక్ష్మా రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథ్, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కూచకుళ్ల దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ ఘన స్వాగతం పలికారు. ముం దుగా బీఆర్ఎస్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించిన సీఎం తర్వాత కలెక్టరేట్కు చేరుకున్నారు. సర్వమత ప్రార్థనల మధ్య కలెక్టర్ ఉదయ్కుమార్ను కుర్చీపై కూర్చోబెట్టారు. అనంతరం కలెక్టరేట్ ఉద్యో గులతో ప్రత్యేకంగా మాట్లాడారు. పాలన పారదర్శకంగా ఉండడంపై ప్రత్యేకంగా దృష్టి సారిం చాలని ఉద్యోగులను కోరారు. తర్వాత 6:30 గంటలకు బహిరంగ సభా స్థలికి చేరుకుని, మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర కల సాకారమైన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన అభివృద్ధిని ప్రధానంగా ప్రస్తావించారు. సీఎం సభకు భారీ ఎత్తున జన సమీకరణ జరగడంతో సీఎం ముఖంలో ఆనందం కన్పించింది. ఆయా నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారి వ్యతిరేక శిబిరాలు కూడా కలిసికట్టుగా హాజరు కావడం విశేషం. సీఎం రాకముందు నూతన కలెక్టరేట్లో సమావేశమైన మంత్రులు, ఎమ్మెల్యేలు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలు, పోటీ ఉండే నియోజకవర్గాల్లో శీఘ్రంగా చేపట్టాల్సిన పనులపై మాట్లాడుకున్నారు.
Updated Date - 2023-06-07T00:12:39+05:30 IST