మున్నేరు తీగల వంతెన టెండర్కు జీవో జారీ
ABN, First Publish Date - 2023-03-10T01:34:39+05:30
సీఎం కేసీఆర్ ఖమ్మం పర్యటనలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం పనులను ప్రారంభించేందుకు కార్యాచరణ చేపట్టింది.
టెండర్ల అనుమతికి కమిటీ నియామకం
సీఎం కేసీఆర్కు మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు
ఖమ్మం, మార్చి 9 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): సీఎం కేసీఆర్ ఖమ్మం పర్యటనలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం పనులను ప్రారంభించేందుకు కార్యాచరణ చేపట్టింది. ఈ క్రమంలో ఖమ్మం నగర సమీపంలో మున్నేరుపై నిజాంకాలంలో నిర్మించిన పాతవంతెన పక్కనే హైదరాబాద్లోని దుర్గంచెరువు తీగల వంతెన తరహాలో కొత్త వంతెన నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఖమ్మం సభలో హామీ ఇచ్చి వెళ్లిన 24గంటల్లోనే రూ.180 కోట్లు కేటాయించారు. అయితే వంతెన నిర్మాణ పనులు చేపట్టేందుకు ఈపీసీ పద్ధతిలో టెండర్లు కోసం ప్రభుత్వం జీవో 90ని విడుదల చేసింది. సర్వే, నిర్మాణ పనులు చేపట్టడం లాంటివన్నీ నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా.. ఈ టెండర్లకు అనుమతిచ్చేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. కన్వీనర్గా ఆర్అండ్బీ ఈఎనసీ పి.రవీందర్రెడ్డి, కో కన్వీనర్గా మరో ఈఎనసీ గణపతిరెడ్డి, సభ్యులుగా చీఫ్ ఇంజనీర్లు పి.సతీష్, పి.మధుసూదనరెడ్డిని నియమించింది. మొత్తం 420 మీటర్ల పొడవున నిర్మించే హైలెవల్ బ్రిడ్జిపై 320మీటర్ల మేర తీగలతోనే నిర్మాణం జరగనుంది. ఖమ్మం మున్నేరుపై తీగల వంతెన నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్న రవాణాశాఖ రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ టెండర్లు పిలిచేందుకు జీవో విడుదల చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - 2023-03-10T01:34:39+05:30 IST