అమాత్యా.. ఆలకించరూ
ABN, First Publish Date - 2023-01-31T23:17:43+05:30
రాష్ట్రంలోనే రొండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్గా పేరుగాంచిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలని నేడు జిల్లాలో పర్యటించనున్న వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజనరెడ్డిని రైతులు, రైతు సంఘాలు వేడుకుంటున్నారు.
సమస్యల నిలయంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్
అరకొర సిబ్బందితో యార్డుల నిర్వహణ
డబ్బు చెల్లించినా కలగానే ఫైరింజన
మిర్చి కొనుగోళ్లలో ఊసులేని ఈ-నామ్
ఇంకా అందని ‘సద్దిమూట’ 8 నేడు పాలకవర్గం ప్రమాణస్వీకారం
హాజరవుతున్న ఇద్దరు మంత్రులు
ఖమ్మం మార్కెట్ , జనవరి 31: రాష్ట్రంలోనే రొండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్గా పేరుగాంచిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలని నేడు జిల్లాలో పర్యటించనున్న వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజనరెడ్డిని రైతులు, రైతు సంఘాలు వేడుకుంటున్నారు. మార్కెట్ నుంచి ప్రతి ఏటా సుమారు రూ.18కోట్లకు పైగా మార్కెట్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తున్నా అబివృద్ధి విషయంలో ‘ఎక్కడి గొంగళి అక్కడే’ అన్న చందంగా మార్కెట్లో సమస్యలు అలానే ఉన్నాయని, పాలకులు ఎవరూ పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గత పాలకవర్గాలు మార్కెట్లో సమస్యలు పరిష్కరించడానికి కృషి చేసినా రాజకీయ వత్తిళ్లతో అవి పరిష్కారానికి నోచుకోకపోవడంతో సమస్యలు మరింత జఠిలం అవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. బుధవారం ఖమ్మం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో ఈ పాలకవర్గమైనా సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు.
అరకొర సిబ్బందితో యార్డుల నిర్వహణ
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సిబ్బంది కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు యార్డులకు పంటలు తీసుకొచ్చినప్పుడు దొంగల బెడద ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ కమిటీకి వాస్తవంగా 49 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 21మంది మాత్రమే ఉన్నారు. దీంతో వారిపై పని భారం ఎక్కువగా పడుతోంది. పంటల క్రయవిక్రయాల సమయంలో రైతులు, వ్యాపారుల మధ్య సమస్యలు వచ్చినపుడు అందుబాటులో మార్కెట్ సిబ్బంది లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఫైర్ ఇంజన ఎప్పటికి వచ్చేనో..?
ఖమ్మం మార్కెట్కు మిర్చి, పత్తి పంటలు ఎక్కువగా వస్తున్నందున ఫైరింజన అవసరం ఎంతైనా ఉందని గ్రహించిన 2012-13 నాటి మార్కెట్ కమిటీ పాలకవర్గం ఫైరింజన కోసం రూ.కోటికి పైగా అగ్నిమాపక శాఖకు చెల్లించింది. అయినా ఇప్పటికీ మార్కెట్కు ఫైరింజన రాలేదు. మార్కెట్లో ఎదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే స్పందించేందుకు గాను మార్కెట్ వద్దనే రూ.60లక్షలతో ఫైర్స్టేషన సైతం నిర్మించారు. అయినా ఆ ఫైర్స్టేషనలోకి ఇప్పటికీ ఫైరింజన రాలేదు.
అడ్రస్లేని రూ.5 భోజన పథకం
మార్కెట్కు పంటలను తీసుకొచ్చే రైతులకు రూ.5లకే భోజన పెట్టే ‘సద్దిమూట’ పథకం ఇంత వరకూ ఊసేలేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత నాటి తొలి తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ శాఖా మంత్రి తన్నీరు హరీ్షరావు ఖమ్మం మార్కెట్లో ‘సద్దిమూట’ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చినా అది ఇంతవరకు అమలు కాలేదు. రూ.5ల భోజన పథకాన్ని ఈ నూతన మార్కెట్ కమిటీ పాలనలోనైనా అమలులోకి తేవాలని రైతులు కోరుకుంటున్నారు.
మిర్చిలో ఈ-నామ్ అమలేదీ ?
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి, అపరాలలో ప్రస్తుతం అమలవుతున్న ఈ-నామ్ (ఎలక్ర్టానిక్ నేషనల్ అగ్రి మార్కెటింగ్) వ్యవస్థను మిర్చిలో సైతం అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. మిర్చిలో ఈ-నామ్ ఉంటే రైతులకు మరింతగా గిట్టుబాటు ధరలు దక్కడమే కాకుండా రైతులు దళారుల వలలో పడకుండా ఉంటారని రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
నేడు నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం
ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం బుధవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. కార్యక్రమానికి రవాణశాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో పాటు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజనరెడ్డి హాజరుకానున్నారు. నూతన కమిటీ ఛైర్ పర్సనగా నగరంలోని 58వ డివిజన కార్పొరేటర్ దోరేపల్లి శ్వేత, వైస్ ఛైర్మనగా షేక్ అఫ్జల్తో పాటు ఢైరెక్టర్లుగా గుండ్ల ముత్తయ్య, జటోత సుందర్సూర్య, మందా రామక్రిష్ణ, పొట్లపల్లి నాగరాజు, యాసా రామారావు, నున్నా శ్రీనివాసరావు, మందనపు మాధవరావు, కుతుంభాక రమేష్, తోట వెంకటేశ్వర్లు, వంకాయలపాటి వెంకటలచ్చయ్య, పత్తిపాక రమేష్, దేవత అనిల్కుమార్, టేకులపల్లి పీఏసీఎస్ చైర్మన బీరెడ్డి నాగచంద్రారెడ్డి, మున్సిపల్ కార్పొరేషన మేమర్ పునకొల్లు నీరజ, జిల్లా మార్కెటింగ్ శాఖాధికారి కోలాహలం నాగరాజు, వ్యవసాయ శాఖ నుంచి ఒక ఏడీఏ స్థాయి అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు అపరాల యార్డులో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన స్టేజీ ఏర్పాట్లను మార్కెట్ కమిటీ అధికారులు పూర్తి చేశారు.
Updated Date - 2023-01-31T23:17:44+05:30 IST