ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని సాధించాలి
ABN, First Publish Date - 2023-09-22T00:14:35+05:30
జిల్లాలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ డాక్టర్ బి గోపి వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ డాక్టర్ బి గోపి
కరీంనగర్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ డాక్టర్ బి గోపి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎంపీడీవోలు, వ్యవసాయ, ఉద్యానవన, బ్యాంకు అధికారులతో ఆయిల్ఫామ్, ఎరువులు, రుణమాఫీ అంశాలపై కలెక్టర్ గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సరిపడా ఉద్యానవనశాఖ సిబ్బంది లేనందున, ఆయిల్ పామ్ సాగును అభివృద్ధి చేయడంలో ఏఈవోలు తమవంతు సహకారాన్ని అందించాలన్నారు. పంట సాగులో రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి అన్ని గ్రామాల్లో ఎంపీటీసీలు, సర్పంచ్లను సమన్వయ పరుచుకొని అవగాహన సదస్సులను నిర్వహించాలని సూచించారు. 2018 డిసెంబరు 11 నాటికి లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలు పొందిన రైతులందరికీ రుణమాఫీని వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఆధార్, రైతుబంధు ఖాతా, ఇతర బ్యాంకుల్లో అకౌంట్ ఉండడంతోపాటు జిల్లాలో 153 మ్యాచ్ కాని ఖాతాలతో డీపీటీ ఫెయిల్యూర్ జరిగి కొందరు రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. మ్యాచ్ కాని ఖాతాలపై రెండు రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో మండలాల వారిగా రుణమాఫీ పొందిన వారి వివరాలను డీఏవోలకు పంపించామన్నారు. వాటిలో మంజూరైన రుణమాఫీ డ్రా చేశారా, రెన్యూవల్ వంటి వివరాలను ఫోన్ ద్వారా సేకరించి డీఏవోకు సమర్పించాలని, వారి నుంచి తనకు పంపించాలని సూచించారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని, ఐఎఫ్ఎంఎస్, ఫిజికల్ డాటాలో ఉన్నటువంటి తేడాలను సమీక్షించుకోవాలన్నారు. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వారికి షోకాజ్ నోటీసులను జారీ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్, ఎల్డీఎం ఆంజనేయులు, డీపీవో వీరబుచ్చయ్య, డీఆర్డీవో శ్రీలత పాల్గొన్నారు.
Updated Date - 2023-09-22T00:14:35+05:30 IST