అన్నదాతకు మద్దతు
ABN, First Publish Date - 2023-09-22T00:41:18+05:30
పంటలకు మద్దతు ధర పెంపు అన్నదాతలకు కొంత ఊరటనిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంటల మద్దతు ధర సెప్టెంబరు 6 నుంచి అమల్లోకి వచ్చింది. 2023-2024 వానాకాలం సీజన్లోని వివిధ పంటలకు మద్దతు ధర వర్తించనుంది.
- ధాన్యం రైతులకు రూ.50.05 కోట్ల లబ్ధి
- పంటల ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం
- ఈ నెల నుంచే అమల్లోకి
- వరి ఏ-గ్రేడ్కు క్వింటాల్కు రూ.2203
- బీ-గ్రేడ్కు రూ.2180
- పత్తి ఏ-గ్రేడ్కు క్వింటాల్కు రూ.7020
- బీ-గ్రేడ్కు రూ.6620
- జిల్లాలో వానాకాలం సీజన్లో 2.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు
- వరి 1.43 లక్షల ఎకరాలు, పత్తి 52,266 ఎకరాలు
(ఆంరఽధజ్యోతి సిరిసిల్ల)
పంటలకు మద్దతు ధర పెంపు అన్నదాతలకు కొంత ఊరటనిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంటల మద్దతు ధర సెప్టెంబరు 6 నుంచి అమల్లోకి వచ్చింది. 2023-2024 వానాకాలం సీజన్లోని వివిధ పంటలకు మద్దతు ధర వర్తించనుంది. వరి, పత్తితో పాటు ఇతర పంటల మద్దతు ధరలు పెరగడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్లో 4.14 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో పౌరసరఫరాల శాఖ 3.50 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్కు పెంచిన రూ.143తో జిల్లా రైతులకు ఈసారి అదనంగా రూ. 50 కోట్ల 5 లక్షల లబ్ధి చేకూరనుంది. జిల్లాలో రైతులు ప్రస్తుత వానాకాలం 2.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేసుకున్నారు. ఇందులో ప్రధానంగా వరి 1,43,600 ఎకరాలు, పత్తి 52,266 ఎకరాలు, మొక్కజొన్న 456 ఎకరాలు, కందులు 764 ఎకరాల్లో వేశారు. జూలైలో కురిసిన అధిక వర్షాలకు వరి పొలాల్లో ఇసుక మేటలు వేసింది. రైతులు భారీగా నష్టపోయారు. పంటలు చేతికి వస్తాయో లేదోనని ఆందోళనకు గురయ్యారు. మరోవైపు వానలు కూడా క్రమబద్ధంగా లేకపోవడంతో పంటలు వాడిపోవడం, కలుపు పెరిగిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. జూన్లో వర్షాలు లేకపోవడంతో నాట్లు మందకొడిగా సాగాయి. జూలైలో నాట్లు వేసుకున్నా వర్షాలు కురవని పరిస్థితి మొదట్లో ఏర్పడింది. తర్వాత అల్పపీడనంతో ఇబ్బందులు పడ్డారు. ఆగస్టులో 20 రోజులపాటు వర్షాలు లేకుండా పోయాయి. నెల చివరిలో కొంత వర్షాలు ఊరటను ఇచ్చాయి. జూన్ 7న పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పీ పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించగా ఈ నెల నుంచి అమల్లోకి వచ్చింది.
మద్దతు ధర ఇలా..
2023-24 సంవత్సరానికి వివిధ పంటలకు ప్రకటించిన మద్దతు ధరల్లో పత్తి క్వింటాల్కు రూ.540 నుంచి రూ.640 వరకు, వరిపై రూ.143, మొక్కజొన్న రూ.123 వరకు పెరిగింది. క్వింటాల్ వరి ఏ-గ్రేడ్ గత సంవత్సరం 2060 ఉండగా ఈ సంవత్సరం రూ .2203, వరి బీ-గ్రేడ్ రకం రూ.2040 నుంచి రూ. 2183కు పెరిగింది. పత్తి ఏ-గ్రేడ్ క్వింటాల్కు రూ. 6380 నుంచి రూ.7023కు పెంచారు. జొన్నలు రూ .2970 నుంచి రూ.3180, సజ్జలు రూ.2350 నుంచి రూ.2500, రాగులు రూ.3578 నుంచి రూ.3846, మొక్కజొన్న రూ.1962 నుంచి రూ.2090, కందులు రూ.6600 నుంచి రూ.7000, పెసర్లు రూ.7755 నుంచి రూ.8558, మినుములు రూ.6600 నుంచి రూ.6950, వేరుశేనగ రూ.5850 నుంచి రూ.6370, సోయాబీన్ రూ.4300 నుంచి రూ.4600, నువ్వులు రూ.7830 నుంచి రూ.8635, పొద్దు తిరుగుడు రూ.6400 నుంచి రూ.6760 వరకు పెరిగింది.
ధాన్యం కొనుగోళ్లకు సర్వం సన్నద్ధం
జిల్లాలో వానకాలం సాగులో రైతులు 1.74 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దిగుబడి 4.14 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనాలు వేసింది. ఇందులో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. నవంబరు మొదటి వారంలో కొనుగోళ్లను ప్రారంభించి 97,500 మెట్రిక్ టన్నులు, డిసెంబరులో 1.85 లక్షల మెట్రిక్ టన్నులు, 2024 జనవరిలో 67,500 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా 258 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఐకేపీ ద్వారా 46 కేంద్రాలు, సింగిల్ విండోల ద్వారా 196 కేంద్రాలు, డీసీఎంఎస్ ద్వారా 12 కేంద్రాలు, మెప్మా ద్వారా 4 కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు.
Updated Date - 2023-09-22T00:41:18+05:30 IST