రేషన్ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు
ABN, First Publish Date - 2023-02-18T00:07:28+05:30
అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు తప్పవని తిమ్మాపూర్ సీఐ పర్ష రమేష్ హెచ్చరించారు.
- అలుగునూర్ వద్ద 110 క్వింటాళ్లు పట్టుకున్న పోలీసులు
తిమ్మాపూర్, ఫిబ్రవరి17: అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు తప్పవని తిమ్మాపూర్ సీఐ పర్ష రమేష్ హెచ్చరించారు. శుక్రవారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ వద్ద అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న డీసీఎం వ్యాన్ను కమిషనరేట్ టాస్క్ఫోర్స్ సిబ్బందితో కలిసి తిమ్మాపూర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా సీఐ పర్ష రమేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. బొమ్మకల్ గ్రామానికి చెందిన నేరెళ్ల సాయికుమార్ ఆరెపల్లి, రేకుర్తి గ్రామ శివారులో పలువురు వ్యక్తుల నుంచి రేషన్ బియ్యం కిలోకు 13 రూపాయల చొప్పున కొనుగోలు చేసి వాటిని 14.50 రూపాయల చొప్పున బాకం సంపత్ అనే వ్యక్తికి అమ్మడానికి డీసీఎం వాహనంలో సిద్దిపేటకు తరలిస్తుండగా అలుగునూర్ చౌరస్తాలో వాహనాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. వాహనంలో సుమారు 110క్విటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డీసీఎం వాహనాన్ని, ఇద్దరు నిందితులను పట్టుకొని ఎల్ఎండి పోలీస్స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం సివిల్ సప్లై అధికారులకు తెలియజేయడం జరిగిందని సీఐ పర్ష రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రమోద్రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-02-18T00:07:30+05:30 IST