గ్యాస్ సిలిండర్ పేలి ఒకరి దుర్మరణం
ABN, First Publish Date - 2023-02-07T00:50:00+05:30
కొత్తపల్లి మండలం ఖాజీపూర్లో సోమవారం గ్యాస్ సిలిండర్ పేలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 6: కొత్తపల్లి మండలం ఖాజీపూర్లో సోమవారం గ్యాస్ సిలిండర్ పేలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కొత్తపల్లి ఎస్ఐ ఎల్లయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్కు చెందిన రాంలాల్చౌదరి(64) కొత్తపల్లి మండలం ఖాజీపూర్లో ఎస్ఎంఎస్ రాక్ కటింగ్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నాడు. ఫ్యాక్టరీ కార్యాలయం మొదటి అంతస్థులో నివాసం ఉంటున్నాడు. రాంలాల్ చౌదరి శనివారం సికింద్రాబాద్లో ఉన్న తన భార్య, పిల్లల వద్దకు వెళ్లి సోమవారం ఖాజీపూర్కు తిరిగి వచ్చాడు. ఉదయం 10:30 గంటల సమయంలో రాంలాల్ చౌదరి తనగదిలోకి వెళ్లి విద్యుత్ స్విచ్ వేయగానే గ్యాస్ లీకేజీ కారణంగా సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి గది ధ్వంసమై రాంలాల్ చౌదరి ఎగిరి దూరంగా పడ్డాయి. వంట గది గోడ మొత్తం కూలింది. పేలుడు శబ్ధం విన్న కార్మికులు వచ్చి చూసేసరికే రాంలాల్ చౌదరి మృతి చెందాడు. రాంలాల్ చౌదరి బావమరిది కైలాస్చంద్ర ఫిర్యాదుతో కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-02-07T00:50:02+05:30 IST