ఎవరికోసం?
ABN, First Publish Date - 2023-01-18T00:35:40+05:30
నగరంలో స్మార్ట్సిటీ పనులు విమర్శల మధ్య సాగుతున్నాయి. స్మార్ట్సిటీలో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్పాత్లు, ఓపెన్ జిమ్స్, పార్కుల నిర్మాణం చేపడుతున్నారు.
- లక్షలు వెచ్చిస్తున్నా ఉపయోగం లేదు
- కొన్ని చోట్ల బస్బే లేక జనం ఇబ్బందులు
కరీంనగర్ టౌన్, జనవరి 17: నగరంలో స్మార్ట్సిటీ పనులు విమర్శల మధ్య సాగుతున్నాయి. స్మార్ట్సిటీలో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్పాత్లు, ఓపెన్ జిమ్స్, పార్కుల నిర్మాణం చేపడుతున్నారు. జనం తక్కువగా ఉండే ప్రాంతాలు, పాదచారులు నడువని ఎల్ఎండీ ఆనకట్ట సమీపంలోని బైపాస్ రోడ్డు వంటి ప్రాంతాల్లో కూడా ఫుట్పాత్లు, రెయిలింగ్ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల నగరంలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ బస్బేలు, స్మార్ట్ బస్షెల్టర్లను చూసి ఎవరి కోసం వీటిని ఏర్పాటు చేస్తున్నారని జనం ప్రశిస్తున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉన్న కరీంనగర్ నలుదిశలా విస్తరించడమే కాకుండా నగరంలో రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరపాలక సంస్థ సౌకర్యాలను కల్పించేందుకు కృషిచేస్తోంది. స్మార్ట్సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరంలోని ప్రధాన రహదారుల్లో ఆకర్షణీయమైన బస్షెల్టర్లు, బస్బేలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి వద్ద ఏర్పాటు చేసే అడ్వర్టయిజ్మెంట్ బోర్డుల ద్వారా నగరపాలక సంస్థకు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అయితే లక్షలు ఖర్చుచేసి ఏర్పాటు చేస్తున్న బస్షెల్టర్లతో ఎంత మేరకు ప్రజలకు ఉపయోగం ఉంటుందని నగరపాలక సంస్థ అధికారులు ఆలోచించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజల అవసరాలే ప్రధానంగా ఆలోచించి డీపీఆర్ను సిద్ధం చేసుకొని ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరంలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన బస్షెల్టర్లు, బస్బేలు ఉపయోగపడటం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండి బస్సుల కోసం, ప్రైవేటు వాహనాల కోసం, ఇతరత్రా అవసరాల కోసం వేచిచూసే ప్రయాణికులు, ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా బస్షెల్టర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాకాకుండా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు, ఆటోల కోసం వేచి చూసే ప్రాంతాల్లో కాకుండా జనం ఉండని ప్రాంతాల్లో బస్షెల్టర్లను, బస్బేలను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో ప్రజలకు ఎలా మేలు జరుగుతుందో అధికారులకే తెలియాలి. ప్రతి రోజు కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులు, దినసరి కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగులు బస్సుల్లో, ఆటోల్లో, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లి వచ్చే వారి కోసం బస్షెల్టర్లు, బస్ బేలు ఉపయోగపడాలి. ప్రస్తుతం కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన బస్షెల్టర్లు అసాంఘిక చర్యలకు, రాత్రి వేళల్లో కుక్కలు, పందులు, పశువులు, మద్యం మత్తులో రోడ్డుపై నిద్రించే వారికి అడ్డాలుగా మారాయి. మరోవైపు బస్సులు, ఆటోలు, ప్రైవేట్ వాహనాల కోసం వేచి చూసే ప్రయాణికులు ఉండే ప్రాంతాల్లో బస్షెల్టర్ లేక పోవడంతో రోడ్డు పక్కన ఎండలో నిలుచొని ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే కోర్టు సమీపం, మంకమ్మతోట లేబర్ అడ్డా, ముకరంపురా చౌరస్తా, కమాన్ చౌరస్తా వంటి ప్రాంతాల్లో బస్సులు నిలిపే చోట బస్షెల్టర్లు లేవు. మరోవైపు అక్కడ బస్సులు, ఆటోలే కాదు చివరకు ద్విచక్రవాహనాలు కూడా నిలుపని ప్రభుత్వ ఓల్డ్ హైస్కూల్ ప్రధాన ద్వారం పక్కన, కమాన్ సమీపంలో రామేశ్వరాలయం పక్కన బస్బేలు ఎందుకు ఏర్పాటు చేశారో తెలియడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. నగరంలో ఇలా అనేక ప్రాంతాల్లో ఎవరికీ ఉపయోగపడని ప్రాంతాల్లో బస్షెల్టర్లు ఏర్పాటు చేయడం ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు సౌకర్యంగా ఉండే ప్రాంతాల్లో బస్బేలు, బస్షెల్టర్లను ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Updated Date - 2023-01-18T00:36:08+05:30 IST