కళాశాలల్లో నిర్బంధ వైద్య పరీక్షలు
ABN, First Publish Date - 2023-03-05T00:37:49+05:30
రాష్ట్రంలో అతి చిన్న వయస్సువారు గుండెపోటుతో ఆకస్మికంగా మరణిస్తున్న నేపథ్యంలో జిల్లాలో అలాంటి సంఘటనలు జరుగకుండా ఉండేందుకు ప్రతి కళాశాలలో నిర్బంధ వైద్య పరీక్షలను నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
కరీంనగర్ టౌన్, మార్చి 4: రాష్ట్రంలో అతి చిన్న వయస్సువారు గుండెపోటుతో ఆకస్మికంగా మరణిస్తున్న నేపథ్యంలో జిల్లాలో అలాంటి సంఘటనలు జరుగకుండా ఉండేందుకు ప్రతి కళాశాలలో నిర్బంధ వైద్య పరీక్షలను నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశమందిరంలో వైద్యాధికారులు, కార్డియాలజిస్టులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ జిల్లాలో గుండెపోటు మరణాలను తగ్గించేందుకు ఉచిత వైద్య శిబిరాలు, ఆరోగ్య పరీక్షల కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పారు. జిల్లాలోని అన్ని కళాశాలల్లో విద్యార్థులకు నిర్బంధ గుండె సంబంధిత పరీక్షలను నిర్వహించేందుకు ప్రణాళికలను రూపొందిస్తామన్నారు. ఈ దిశగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, ఐఎంఏ, డయోగ్నోస్టిక్స్ నిర్వాహకులు సహకారాన్ని అందించాలని కోరారు. జిల్లాలో పోలీసు, మున్సిపల్ సిబ్బందికి సీపీఆర్పై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సుబ్బారాయుడు, మేయర్ సునీల్రావు, అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్లాల్, గరిమ అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, ట్రైనీ కలెక్టర్ లెనిన్ పాల్గొన్నారు.
Updated Date - 2023-03-05T00:37:49+05:30 IST