86 శాతం ఆస్తిపన్ను వసూలు
ABN, First Publish Date - 2023-04-03T00:49:43+05:30
నగరపాలక సంస్థలో 86 శాతం ఆస్తి పన్ను వసూలైంది. 28 కోట్ల 40 లక్షల ఆదాయం సమకూరింది.
- నేడు వడ్డీ లేకుండా చెల్లించేందుకు అవకాశం
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 2: నగరపాలక సంస్థలో 86 శాతం ఆస్తి పన్ను వసూలైంది. 28 కోట్ల 40 లక్షల ఆదాయం సమకూరింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నగరపాలక సంస్థ పరిధిలోని రెసిడెన్షియల్, కమర్షియల్ గృహాల ద్వారా నగరపాలక సంస్థకు 33.05 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. వంద శాతం పన్నుల వసూళ్ల కోసం కృషి చేశారు. మొండి బకాయిలను వసూలు చేసేందుకు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారి రంగంలోకి దిగారు. పన్నులు చెల్లించని వారి ఆస్తులను జప్తు చేయడం, నల్లాల కనెక్షన్లను తొలగించడం వంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు మార్చి 31 తర్వాత మరింత కఠినమైన చర్యలుంటాయని హెచ్చరించారు. దీనితో 33.05 కోట్ల డిమాండ్లో 28.4 కోట్ల పన్నులు వసూలయ్యాయి. రెండు నెలలుగా ఆదివారంతోపాటు సెలవుదినాల్లో కూడా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడంతోపాటు ఆన్లైన్లో పన్నులను చెల్లించే అవకాశాలు కల్పించారు. ఆర్థిక సంవత్సరం మార్చి 31వ తేదీ దాటినప్పటికీ సోమవారం కూడా ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పన్నులను చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆస్తిపన్నులను చెల్లించాలని, లేకపోతే అపరాధ రుసుం(వడ్డీ)తోపాటు చట్టపరంగా ఇళ్లలోని ఆస్తులను జప్తు చేస్తామని, నల్లా కనెక్షన్లను తొలగిస్తామని రెవెన్యూ అధికారి చింతల ఆంజనేయులు హెచ్చరించారు.
ఫ ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లిస్తే ఐదు శాతం రిబేట్
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నులను ఏప్రిల్ 30లోగా చెల్లిస్తే ప్రభుత్వం ఐదు శాతం రిబేట్ు కల్పిస్తోందని, ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ రెవెన్యూ అధికారి ఆంజనేయులు కోరారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నులను సోమవారం నుంచి ఈ నెలాఖరువరకు చెల్లిస్తే పన్నులో ఐదు శాతం రిబేట్ లభిస్తుందన్నారు. నగరవాసులు ముందస్తుగా ఆస్తిపన్నులు చెల్లించి సహకరించాలని కోరారు.
Updated Date - 2023-04-03T00:49:43+05:30 IST