సంకల్ప సభతో బీజేపీలో జోష్
ABN, First Publish Date - 2023-06-26T03:57:58+05:30
బీజేపీ నవ సంకల్ప సభకు భారీ సంఖ్యలో యువత తరలిరావడంతో పార్టీకి కొత్త జోష్ వచ్చింది. ఖమ్మంలో ఈ నెల 15న జరగాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యటన చివరి నిమిషంలో రద్దు కావడంతో బీజేపీ శ్రేణులు నిరాశ చెందాయి....
కార్యక్రమం విజయవంతమైందని నడ్డా హర్షం..
‘బండీ.. బహుత్ మెహనత్ కియా’ అని ప్రశంస
హైదరాబాద్/సిటీ/బంజారాహిల్స్/నార్సింగ్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నవ సంకల్ప సభకు భారీ సంఖ్యలో యువత తరలిరావడంతో పార్టీకి కొత్త జోష్ వచ్చింది. ఖమ్మంలో ఈ నెల 15న జరగాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యటన చివరి నిమిషంలో రద్దు కావడంతో బీజేపీ శ్రేణులు నిరాశ చెందాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నాగర్కర్నూలులో జరిగిన సభ సక్సెస్ కావడం పార్టీకి కొత్త ఊపిరినిచ్చిందని కమలనాథులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నవ సంకల్ప సభ ప్రాంగణం బయట కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉండిపోయారు. నడ్డా ప్రసంగం కొనసాగుతున్నంతసేపూ మోదీ.. మోదీ.. నడ్డా.. నడ్డా.. అంటూ యువకులు నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని మోదీకి విదేశాల్లో బ్రహ్మరథం పడుతున్నారంటూ నడ్డా చెప్పినప్పుడు.. వేదికపై ఉన్న నాయకులు, కింద ఉన్న కార్యకర్తలు లేచి నిలబడి పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. సభ అనంతరం హెలీప్యాడ్ వద్దకు వెళుతూ నడ్డా సంతోషం వ్యక్తం చేశారని బీజేపీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. సభ విజయవంతం కోసం కష్టపడ్డారంటూ స్థానిక పార్టీ నాయకత్వాన్ని అభినందించారని చెప్పారు. నవ సంకల్ప సభను ఘనంగా నిర్వహించినందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని నడ్డా ప్రత్యేకంగా అభినందించారు. బండీ.. బహుత్ మెహనత్ కియా.. అంటూ ప్రశంసించారు. ‘షాన్దార్ మీటింగ్.. బాగా కష్టపడుతున్నావ్.. గో అహెడ్..’ అని మరోసారి ప్రశంసించారని పార్టీ వర్గాలు తెలిపాయి.
నడ్డాతో రఘునందన్, వివేక్ భేటీ
ఆదివారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో కలిసి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న నడ్డాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే రఘునందన్రావు, విజయశాంతి, వివేక్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్రావు తదితరులు ఘనస్వాగతం పలికారు. నోవాటెల్ హోటల్లో రఘునందన్రావు, విజయశాంతి, వివేక్లతో నడ్డా విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర పార్టీలో కొనసాగుతున్న పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, బీఆర్ఎస్ పట్ల ఉదాసీన వైఖ రి వద్దని సూచించినట్లు సమాచారం. కాగా, నడ్డా ఆదివారం సాయంత్రం ప్రొఫెసర్ నాగేశ్వర్ను కలిశారు. షేక్పేట్లోని నాగేశ్వర్ ఇంటికి వెళ్లి.. దాదాపు ఇరవై నిమిషాల పాటు ఆయనతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ మీడియాతో మాట్లాడారు. సంపర్క్ సే సమర్థన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా వివిధ వ్యక్తుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారని.. అందులో భాగంగా నడ్డా తనను కలిశారని చెప్పారు. అలాగే ప్రముఖ నృత్య కళాకారిణి ఆనంద్ శంకర్ జయంత్ను ఫిల్మ్నగర్లోని ఆమె నివాసంలో నడ్డా కలిశారు. ఆమెతో దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రధాని మోదీ హయాంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమెకు వివరించారు. కళాకేత్రంలో భారత మాత నృత్యరూపాన్ని నడ్డా కాసేపు తిలకించారని ఆనంద్ శంకర్ జయంత్ చెప్పారు. నడ్డా వెంట కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఉన్నారు.
ఈటల, రాజగోపాల్ దూరం..
జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనకు పార్టీ చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. పార్టీ అధినాయకత్వం పిలుపుమేరకు వీరిద్దరు శనివారం ఢిల్లీ వెళ్లారు. కాగా, ఆదివారం రాత్రి 9 గంటలకు ఈటల హైదరాబాద్ చేరుకున్నారు.
Updated Date - 2023-06-26T03:57:58+05:30 IST