Madhapur Insofi Employees: మా జీవితాలతో ఆడుకుంటున్నారు
ABN, First Publish Date - 2023-04-20T02:51:52+05:30
‘‘ప్రముఖ అంతర్జాతీయ ఎంఎన్సీ కంపెనీల్లో అవకాశాలు వచ్చినా.. వదులుకున్నాం. ప్రారంభంలోనే మంచి వేతనాలు ఆఫర్ చేయడంతో ఈ కంపెనీలో చేరాం.. ఏడాదిగా జీతాలు ఇవ్వకపోగా.. మాపేర్లతో రుణాలు పొందారు.. ఇప్పుడు అవమానించి తొలగించారు..
ప్రముఖ కంపెనీల ఆఫర్లు వదులుకుని వచ్చాం..
ఏడాదిగా జీతాల్లేవు.. అవమానించి తీసేశారు
మాధాపూర్ డీసీపీతో ఇన్సోఫీ ఉద్యోగుల మొర
కనీసం 6 నెలల జీతాలైనా ఇప్పించాలని విజ్ఞప్తి
బెంగళూరులోనూ ఇన్సోఫీ సంస్థ ఇలాగే రూ.కోట్లు
వసూలుచేసి ఉద్యోగులను తొలగించిందని ఆరోపణ
ఉద్యోగుల పేరిట ఉన్న రుణాలను 15రోజుల్లో తీర్చేస్తాం
45 రోజుల్లోగా బ్యాంకుల నుంచి ఎన్వోసీలు: ఇన్సోఫీ
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రముఖ అంతర్జాతీయ ఎంఎన్సీ కంపెనీల్లో అవకాశాలు వచ్చినా.. వదులుకున్నాం. ప్రారంభంలోనే మంచి వేతనాలు ఆఫర్ చేయడంతో ఈ కంపెనీలో చేరాం.. ఏడాదిగా జీతాలు ఇవ్వకపోగా.. మాపేర్లతో రుణాలు పొందారు.. ఇప్పుడు అవమానించి తొలగించారు.. మాకు న్యాయం చేయండి’’ అంటూ.. మాధాపూర్లో బోర్డు తిప్పేసిన ఇన్సోఫీ సంస్థ ఉద్యోగులు మాధాపూర్ డీసీపీ శిల్పవల్లి వద్ద వాపోయారు. ఏడాదిపాటు పనిచేశామని.. కనీసం 6 నెలల కాలానికైనా జీతాలు ఇప్పించాలని వేడుకున్నారు. ఇన్సోఫీ కంపెనీ.. తమ ఉద్యోగుల్లో 700 మంది పేరిట బ్యాంకుల్లో రూ.31 కోట్ల దాకా రుణాలు తీసుకుని, వారిని అకస్మాత్తుగా తొలగించడంతో వారంతా మంగళవారంనాడు ఆ సంస్థ కార్యాలయంలో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. వారి పేరిట ఐదేళ్ల కాలవ్యవధితో తీసుకున్న రుణాలకు సంబంధించి 10నెలల నెలసరి వాయిదాలను కంపెనీ ఇప్పటిదాకా చెల్లించింది. తమపై కేసులు పెడితే మిగిలిన వాయిదాలను ఉద్యోగులే చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ యాజమాన్యం మంగళవారం రాత్రి అభ్యర్థులను హెచ్చరించింది. దీంతో భయాందోళనలకు గురైన ఉద్యోగులు బుధవారం మాధాపూర్ డీసీపీ శిల్పవల్లిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయంపై ఉద్యోగులు, కంపెనీ యాజమాన్యంతో డీసీసీ గురువారం తన కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. అయితే.. ఈ అంశంపై ఇన్సోఫీ సహవ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్ దక్షిణామూర్తి, యూజీడీఎక్స్ ప్రెసిడెంట్ శ్రీధర్ పప్పు కలిసి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంస్థను మూసివేయట్లేదని.. హైదరాబాద్లో ఉన్న శాఖలో కార్యకలాపాలు, ప్రాజెక్టులపై పెట్టుబడులు కొనసాగుతాయని వారు అందులో వివరించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఏఐ, ఎంఎల్ ప్రోగ్రాములను నిలిపివేశామని.. దీని వల్ల కొన్ని ప్రాజెక్టులు నిలిచిపోవడంతో ఉద్యోగులపై ప్రభావం పడిందని వెల్లడించారు. తాము ఉద్యోగాల నుంచి తొలగించిన ట్రైనీల పేరిట తీసుకున్న రుణాలను 15 రోజుల్లోగా కంపెనీ చెల్లించివేస్తుందని హామీ ఇచ్చారు. వారికి 45 రోజుల్లోగా ఆయా బ్యాంకులు నిరభ్యంతరపత్రాలు ఇస్తాయని తెలిపారు. ఇప్పటిదాకా రుణాలు తిరిగి చెల్లించిన 200 మందికి బ్యాంకులు ఎన్వోసీలు ఇచ్చాయని వెల్లడించారు. లోన్ చెల్లింపుల విషయంలో ఎవరికైనా అనుమానాలు, సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసేందుకు ఫోన్ నంబర్లు, జూమ్, ఈ మెయిల్ ద్వారా అందుబాటులో ఉంటామని తెలిపారు. అయితే.. తమ పేరిట కంపెనీ ఎందుకు లోన్లు తీసుకుందనే విషయంపై వారి ప్రకటనలో ఎలాంటి వివరణా లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోన్ల చెల్లింపు గురించి మాట్లాడుతున్న సంస్థ.. ఏడాదిపాటు పనిచేసిన తమ జీతాల గురించి మాట్లాడకపోవడమేమిటని ఆవేదన వెలిబుచ్చుతున్నారు.
డేటాసైన్స్ కోర్సుల పేరుతో వల..
డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్లో అద్భుత అవకాశాలు చేజిక్కించుకునేలా శిక్షణ అందిస్తామంటూ విద్యార్థులను ఆకర్షించిన ఇన్సోఫీ కంపెనీ.. శిక్షణ పూర్తయ్యాక పనితీరు బాగాలేదంటూ ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి కాదని తెలిసింది. దీనికి దక్షిణమూర్తి వి.కొల్లూరు వ్యవస్థాపకుడిగా ఉన్నారు. హైదరాబాద్తోపాటు బెంగళూరులోని హెచ్ఎ్సఆర్ లేఔట్ సెక్టార్-6లోనూ కార్యాలయం ఉంది. అలాగే ముంబైలోని వర్లీలోనూ కార్యాలయం ఉంది. ఇటీవలే బెంగళూరులోనూ ఇలాగే ఏడాదిగా జీతాలు చెల్లించకుండా పెద్దఎత్తున ఉద్యోగులను తొలగించారని వారు పేర్కొంటున్నారు. ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో తమకు అనుబంధం ఉందని, డేటాసైన్స్, మెషీన్ లెర్నింగ్లో పీజీ, పీహెచ్డీ కోర్సులు అందిస్తామని ఈ కంపెనీ తమ వెబ్సైట్లో ప్రకటించింది. కానీ, ఈ సంస్థకు విదేశీ వర్సిటీలతో ఒప్పందం లేకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కంపెనీ నేపథ్యం, కార్యకలాపాలు, విదేవీ వర్సిటీలతో ఒప్పందాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపితే అనేక విషయాలు బయటికి వస్తాయని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - 2023-04-20T02:51:52+05:30 IST