Drugs : ఇడ్లీ.. దోశ.. డ్రగ్స్!
ABN, First Publish Date - 2023-09-13T03:43:41+05:30
అతడి పేరు ప్రభాకర్ రెడ్డి. పదోతరగతిలోపే చదువు మానేశాడు. ఏపీలోని ప్రకాశం జిల్లాలో రోడ్డుపక్క నాలుగు చక్రాల బండిమీద టిపిన్స్ సెంటర్ పెట్టాడు. ఆ తర్వాత ఎక్కువ సంపాదన కోసం ప్రకాశం నుంచి 2017లో హైదరాబాద్కు వచ్చాడు.
పొద్దున టిఫిన్స్.. రాత్రికి మాదకద్రవ్యాల విక్రయం
వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్ రెడ్డి అరెస్ట్
‘పల్లెటూరి పుల్లట్లు’ యజమాని శివసాయి కూడా
ఎండీఎంఏ మాత్రలు, కొకెయిన్, నగదు స్వాధీనం
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 11(ఆంధ్రజ్యోతి): అతడి పేరు ప్రభాకర్ రెడ్డి. పదోతరగతిలోపే చదువు మానేశాడు. ఏపీలోని ప్రకాశం జిల్లాలో రోడ్డుపక్క నాలుగు చక్రాల బండిమీద టిపిన్స్ సెంటర్ పెట్టాడు. ఆ తర్వాత ఎక్కువ సంపాదన కోసం ప్రకాశం నుంచి 2017లో హైదరాబాద్కు వచ్చాడు. గచ్చిబౌలి పరిధిలోని డీఎల్ఎ్ఫలో చిన్న టిఫిన్ సెంటర్ ప్రారంభించాడు. రుచి, నాణ్యత బాగుండటంతో నగరవాసులు ఆ టిఫిన్ కోసం క్యూ కట్టారు. రాబడి పెరిగేకొద్దీ వ్యాపారాన్ని విస్తరించి.. ‘వరలక్ష్మి టిఫిన్స్’ పేరుతో 10 బ్రాంచీలు ఏర్పాటు చేశాడు. హైదరాబాద్లో ఆ టిఫిన్ సెంటర్లు ఎంత ఫేమస్ అంటే.. ఏ ప్రముఖ ఫుడ్ యాప్లో చూసినా 4.4కిపైగానే రేటింగ్ ఉండేంత పేరొందాయి. దీంతో ఒక్కో టిఫిన్ సెంటర్ నుంచి రోజుకు రూ.3-5 లక్షల ఆదాయం రావడం మొదలైంది. అంటే పది బ్రాంచీల్లో కలిపి రోజుకు రూ.30 నుంచి 50 లక్షల ఆదాయం అన్నమాట. ఇలా ఇబ్బడిముబ్బడిగా డబ్బులు వచ్చిపడుతుండడంతో అతడికి కొత్త విలాసాలు అలవాటయ్యాయి. స్నేహితులతో కలిసి పబ్లకు వెళ్లడం, పార్టీలు చేసుకోవడం ప్రారంభించాడు. క్రమంగా డ్రగ్స్కు, ఇతర వ్యసనాలకు అలవాటు పడ్డాడు. పగలంతా వరలక్ష్మి టిఫిన్స్లో ఇడ్లీ, దోశ, వడ వంటి రుచికరమైన టిఫిన్స్ అమ్మే ప్రభాకర్రెడ్డి.. రాత్రిపూట డ్రగ్స్ దందా చేసే స్థాయికి చేరాడు. తనతో పాటు డ్రగ్స్ తీసుకునే అనూరాధ అనే మహిళను స్మగ్లర్గా మార్చి.. గోవా నుంచి ఆమె ద్వారా నగరానికి డ్రగ్స్ స్మగ్లింగ్ చేయించేవాడు. ఆ డ్రగ్స్ను వారిద్దరూ వినియోగించడమే కాక.. మరో 15 మంది కస్టమర్స్కు విక్రయించేవారు. ఈ దందాలో వారికి పల్లెటూరి పుల్లట్లు టిఫిన్ సెంటర్ యజమాని వెంకట శివసాయికుమార్ సహకరించేవాడు. వీరి గురించి ఉప్పందడంతో సైబరాబాద్ మోకిలా పోలీసులు, రాజేంద్రనగర్ ఎస్వోటీ టీమ్ సంయుక్తంగా దాడిచేసి వారిని అరెస్ట్ చేశారు. వారివద్ద ఎండీఎంఏ పిల్స్, 50 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్, 51.45 గ్రాముల కొకెయిన్, ఐదు మొబైల్ ఫోన్లు, రూ.97,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.
గోవా నుంచి..
ఇటీవల తెలంగాణ పోలీసులు డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నారు. దాంతో ఇతర రాష్ట్రాల నుంచి స్మగ్లర్స్ హైదరాబాద్కు రావడానికి భయపడుతున్నారు. దాంతో ప్రభాకర్రెడ్డి కొత్త ప్లాన్ వేశాడు. అనూరాధను విమానంలో గోవాకు పంపించాడు. అక్కడ జేమ్స్ను కలిసి, వివిధ రకాల డ్రగ్స్ తీసుకొని బస్సు మార్గంలో చాకచక్యంగా నగరానికి చేరుకోవాలని సూచించాడు. అలా గత కొంతకాలంగా గోవాకు వెళ్తున్న అనూరాధ.. గోవా నుంచి వచ్చేటప్పుడు, రెండు మూడు నగరాల్లో బస్సు దిగి, వేరే బస్సులు ఎక్కుతూ చాకచక్యంగా నగరానికి చేరుకునేది. తెచ్చిన డ్రగ్స్ను ప్రభాకర్రెడ్డికి అందజేసేది. అతడి నుంచి 15 మంది డ్రగ్స్ను కొనుగోలు చేసి వినియోగించేవారని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. అనూరాధ, ప్రభాకర్రెడ్డి, వెంకట శివసాయిని కస్టడీకి తీసుకొని విచారిస్తే డ్రగ్స్ దందా గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
ఎంబీఏ చదివి డ్రగ్స్ స్మగ్లింగ్..
ఈ కేసులో ప్రభాకర్రెడ్డితోపాటు పోలీసులు అరెస్టు చేసిన కరీంనగర్వాసి అనూరాధ ఎంబీఏ చదివింది. ఆమె తండ్రి సింగరేణిలో పనిచేస్తుండటంతో కొంతకాలం మంచిర్యాలో ఉంది. పెళ్లయిన తర్వాత భర్తతో కలిసి హైదరాబాద్కు వచ్చింది. ప్రగతి నగర్లో స్నేహితుని ద్వారా అనూరాధ డ్రగ్స్కు, చెడు స్నేహాలు, వ్యసనాలకు బానిసైంది. దాంతో భర్త వదిలేశాడు. విడాకులు తీసుకున్న తర్వాత తన కుమారుణ్ని తల్లి వద్ద ఉంచిన అనూరాధ.. మకాంను నానక్రామ్గూడకు మార్చింది. బాయ్ఫ్రెండ్తో కలిసి తరచుగా పబ్లకు వెళ్లేది. ఆమెకు అక్కడ అతని స్నేహితులైన ప్రభాకర్రెడ్డి, వెంకట శివసాయి కుమార్తో పరిచయం ఏర్పడింది. ఇదేక్రమంలో.. నైజీరియాకు చెందిన జేమ్స్తో కూడా ప్రభాకర్రెడ్డికి స్నేహం ఏర్పడింది.
రాజధాని హైదరాబాద్లో మరో డ్రగ్స్ దందా బయటపడిం ది. ఈసారి దొరికిపోయింది.. పేరొందిన ‘వరలక్ష్మి టిఫిన్స్’ యజమాని సనికొమ్ము ప్రభాకర్ రెడ్డి, అతడి కోసం గోవా నుంచి డ్రగ్స్ను ఇక్కడికి తీసుకొచ్చే అనూరాధ అనే మహిళ, ప్రభాకర్రెడ్డి స్నేహితుడు, ‘పల్లెటూరి పుల్లట్లు టిఫిన్ సెంటర్’ యజమాని వెంకట శివసాయి కుమార్.
Updated Date - 2023-09-13T03:43:41+05:30 IST