నీళ్లు లేకుంటే..డయల్ 155313
ABN, First Publish Date - 2023-03-09T01:27:59+05:30
గోదావరి మెయిన్ పైపులైన్ మరమ్మతు పనుల నేపథ్యంలో నేటి (గురువారం) ఉదయం 6 గంటల నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు 48 గంటలపాటు నీటి సరఫరా నిలిపేయనున్నారు.
ట్యాంకర్ పంపుతామంటున్న వాటర్ బోర్డు
48 గంటలు గోదావరి జలాలు బంద్
హైదరాబాద్ సిటీ, మార్చి8 (ఆంధ్రజ్యోతి): గోదావరి మెయిన్ పైపులైన్ మరమ్మతు పనుల నేపథ్యంలో నేటి (గురువారం) ఉదయం 6 గంటల నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు 48 గంటలపాటు నీటి సరఫరా నిలిపేయనున్నారు. రైల్వే లైన్ నిర్మాణం నేపథ్యంలో పైపులైన్ బైపాసింగ్, ఇంటర్ కనెక్షన్ వంటి పనులు చేయాల్సి ఉన్నందున గోదావరి నీరు నగరానికి తరలించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు.
మంజీరా సరఫరా చేసినా..
షాపూర్, చింతల్, జీడిమెట్ల, వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజులరామారం, సూరారం, డిఫెన్స్కాలనీ, నాగారం, దమ్మాయిగూడ, కీసర, రింగ్ మెయిన్-3 ఆన్లైన్ సప్లయ్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కాప్రా, కంటోన్మెంట్ తదితర ప్రాంతాలకు 48 గంటలపాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. నిజాంపేట్/బాచుపల్లి, ప్రగతినగర్ ప్రాంతాలకు పాక్షిక అంతరాయం తలెత్తనుంది. మంజీరా, సింగూరు జలాలను సరఫరా చేసినా సరిపడా వచ్చే పరిస్థితి ఉండదు. వేసవి నేపథ్యంలో నీటి డిమాండ్ అధికంగా ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లల్లో బోర్లు ఎండిపోయాయి. వాటర్బోర్డు నీరే ఆధారమైంది. ఈ పరిస్థితుల్లో గోదావరి జలాలు నిలిచిపోవడంతో వాటర్బోర్డు అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు చేపట్టింది. మురికివాడలు, బస్తీల్లో నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో ఉచితంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. నీళ్లు లేకపోతే 155313కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తే ట్యాంకర్ పంపేలా అధికారులు చర్యలు చేపట్టారు. 24 గంటలూ ట్యాంకర్లు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Updated Date - 2023-03-09T01:28:49+05:30 IST