ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆశల మోసులు!
ABN, First Publish Date - 2023-05-02T04:13:28+05:30
ఆర్టీసీ ఉద్యోగుల్లో వేతనాల పెంపుపై ఆశలు మోసులెత్తాయి. ఏళ్లుగా వేతనాల పెంపు లేక నిరాశలో మునిగిన వారు సీఎం కేసీఆర్ చేసిన తాజా ప్రకటనతో ఈసారైనా తమ వేతనాలు పెరుగుతాయని ఎదురుచూస్తున్నారు.
వేతనాలు పెంచాలని సీఎం ఆదేశం
2017 నుంచి ఉద్యోగుల ఎదురుచూపు
హైదరాబాద్, మే 1 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగుల్లో వేతనాల పెంపుపై ఆశలు మోసులెత్తాయి. ఏళ్లుగా వేతనాల పెంపు లేక నిరాశలో మునిగిన వారు సీఎం కేసీఆర్ చేసిన తాజా ప్రకటనతో ఈసారైనా తమ వేతనాలు పెరుగుతాయని ఎదురుచూస్తున్నారు. 2017 నుంచి వేతనాలు పెరుగుతాయని భావించినా... నిరాశే మిగిలిందని, కనీసం ఇప్పుడైనా పెరిగితే అదే పదివేలు అని అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పటికే రెండు పే రివిజన్ కమిషన్(పీఆర్సీ) వేతనాలు అమలు కావాలి. కానీ ప్రభుత్వం స్పందించకపోవడం, ఆర్టీసీ యాజమాన్యం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిపోవడంతో వారికి వేతనాలు పెరగలేదు. 2021లో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెరిగినా... వారితో సమానంగా ఆర్టీసీలో మాత్రం పెరగకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశ నిస్పృహలకు గురి చేసింది. సంస్థలో ఉద్యోగ సంఘాలను నిషేధించడంతో ప్రశ్నించే గొంతులు లేకుండాపోయాయి. ఉద్యోగుల తరపున వారి డిమాండ్లను వినిపించేవారే లేకుండాపోయారు. ఇలాంటి దశలో సీఎం కేసీఆర్ సోమవారం టీఎ్సఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను పెంచాలంటూ అధికారులను ఆదేశించారు. నూతన సచివాలయంలో చేపట్టిన మొదటి సమీక్షలో భాగంగా ఈ వేతనాలను పెంచాలని చెప్పారు. నిజానికి ఆర్టీసీ ఉద్యోగులకు 2017 ఏప్రిల్ 1 నుంచే వేతనాలు పెంచాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఐదేళ్లకోసారి పీఆర్సీ ద్వారా కొత్త ఫిట్మెంట్ను ప్రకటిస్తారు.
దాంతో వారి వేతనాలు ఐదేళ్లకోసారి పెరుగుతుంటాయి. అదే... ఆర్టీసీవంటి ప్రభుత్వ రంగ సంస్థల్లోనైతే ప్రతి నాలుగేళ్లకోసారి పీఆర్సీని వేసి, వేతనాలను పెంచాల్సి ఉంటుంది. 2013 పీఆర్సీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం... 2015లో ఆర్టీసీ కార్మికులకు 44శాతం ఫిట్మెంట్ను ప్రకటించింది. ఆ తర్వాత 2017 ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఆర్సీ ఫిట్మెంట్ అమల్లోకి రావాల్సి ఉంది. అప్పుడు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం, ఫిట్మెంట్ను ప్రకటిస్తే... ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాల్సి రావడంతో సర్కారు పెద్దగా స్పందించలేదు. దాంతో ఆర్టీసీ సంఘాలు ఉద్యమిస్తామంటూ హెచ్చరించాయి. దిగివచ్చిన ప్రభుత్వం వేతనాల పెంపుపై అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత.. 16 శాతం మధ్యంతర భృతి(ఐఆర్)ని అమలు చేస్తామని ఆ సంఘం ప్రకటించింది. ఆమేరకు 2018 జులై నుంచి ఇప్పటి వరకు ఇదే 16 శాతం ఐఆర్ అమలవుతోంది. 2019లో వేతనాలు పెంచాలంటూ ఆర్టీసీ సంఘాలు పెద్ద ఎత్తున సమ్మెకు దిగాయి. 52 రోజుల పాటు సమ్మె చేసినా... ప్రభుత్వం దిగిరాలేదు. ఇంతలో నాలుగేళ్ల కాలం గడిచిపోయి 2021 ఏప్రిల్ 1 నుంచి మరో పీఆర్సీ కాలం అమల్లోకి వచ్చింది. ఈ 2021కు సంబంధించిన పే రివిజన్ కమిషన్ను కూడా ప్రభుత్వం నియమించలేదు. ఇలా రెండు పీఆర్సీల వేతనాలను ఉద్యోగులు నష్టపోయి కేవలం 16శాతం మధ్యంతర భృతితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 2015లో 43శాతం ఫిట్మెంట్, 2021లో 30 శాతం ఫిట్మెంట్తో వేతనాలు పెరిగాయి.
భారీగా పెంచాలి : ఎన్ఎంయూ నేతలు
ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను పెంచుతామంటూ సీఎం ప్రకటించడం హర్షణీయమని నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ) నేతలు కమాల్రెడ్డి, మర్రి నరేందర్ పేర్కొన్నారు. కనీసం ఈసారైనా వేతనాలను పెంచాలని వారు కోరారు. ఇప్పటికే రెండు ఫిట్మెంట్లను నష్టపోయామని, ఈసారి వేతనాల పెంపు భారీగా ఉండాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Updated Date - 2023-05-02T04:13:28+05:30 IST