వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
ABN, First Publish Date - 2023-06-07T04:33:08+05:30
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే వైద్య, ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు ఉన్నతాధికారుల్ని ఆదేశించారు.
నిమ్స్ విస్తరణకు శ్రీకారం: హరీశ్ రావు
హైదరాబాద్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే వైద్య, ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 14న నిర్వహించే వైద్య, ఆరోగ్య దినోత్సవం రోజున శాఖ సాధించిన విజయాలు, అందిస్తున్న వైద్య సేవలు ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ఆరోగ్య శాఖలో ఆయా విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రతీ ఒక్కర్ని గుర్తించి ప్రశంసాపత్రాలు, మెమొంటోలు అందించాలని సూచించారు. దశాబ్ది ఉత్సవాల్లో వైద్య ఆరోగ్య దినోత్సవంలో భాగంగా సీఎం కేసీఆర్ నిమ్స్ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. రూ.1,571 కోట్లతో నిర్మించనున్న 2 వేల పడకల ఆస్పత్రి భవనానికి ఈ నెల 14న సీఎం శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. శంకుస్థాపన అనంతరం 5 వేల మందితో నిర్వహించే సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, హాజరయ్యే వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు.
Updated Date - 2023-06-07T04:33:08+05:30 IST