మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ సక్సెస్
ABN, First Publish Date - 2023-05-24T04:04:37+05:30
కాళేశ్వరం ప్యాకేజీ–9లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట వద్ద మూడు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది.
3 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్ట్ నిర్మాణం
సిరిసిల్ల/హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్యాకేజీ–9లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట వద్ద మూడు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్ట్ వరకు మిడ్ మానేరు ద్వారా నీటిని మళ్లించడానికి తొమ్మిదేళ్ల క్రితం పనులకు శంకుస్థాపన చేశారు. రూ.504 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. ఇందులో భాగంగా సిరిసిల్ల మిడ్మానేరు నుంచి 12 కిలోమీటర్ల వరకు టన్నెల్ నిర్మించారు. జూన్లో ప్రాజెక్టును ప్రారంభించే విధంగా మంగళవారం మల్కపేట రిజర్వాయర్లోకి రెండు మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసి ట్రయల్ రన్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ఇంజనీరింగ్ బృందం సభ్యులు పూజలు చేశారు. కాళేశ్వరం జలాలను ఒక మోటార్ ద్వారా ఎత్తి పోశారు. ఎలాంటి ఆటంకం కలగకపోవడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. రెండు పంపుల ద్వారా 120 రోజుల్లో 11.635 టీఎంసీలను ఎత్తిపోయనున్నట్లు రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి తెలిపారు. 2 పంపులతో తొలుత మల్కపేట రిజర్వాయర్లో నీటిని ఎత్తిపోసి.. ఆ తర్వాత సింగసముద్రం ద్వారా ఎగువ మానేరుకు గోదావరి జలాలను తరలించనున్నట్లు పేర్కొన్నారు. ఈ లింక్తో 150 చెరువులను నింపనున్నట్లు వెల్లడించారు.
Updated Date - 2023-05-24T04:04:37+05:30 IST