గోవర్ధన గిరిధారిగా లక్ష్మీనారసింహుడు
ABN, First Publish Date - 2023-02-27T03:42:24+05:30
భక్తజనభాంధవుడు.. ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడు.. ప్రకృతి బీభత్సం నుంచి ఆర్తులను కాపాడేందుకు తన చిటికెన వేలుపై గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తిపట్టిన ఘట్టం యాదగిరికొండపై సాక్షాత్కారమైంది.
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి26: భక్తజనభాంధవుడు.. ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడు.. ప్రకృతి బీభత్సం నుంచి ఆర్తులను కాపాడేందుకు తన చిటికెన వేలుపై గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తిపట్టిన ఘట్టం యాదగిరికొండపై సాక్షాత్కారమైంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పరమాత్ముడు శ్రీకృష్ణభగవాన్ తన మహిమాన్విత లీలలను ప్రతిబింబించే దివ్య మనోహరమైన గోవర్ధన గిరిధారి అలంకారంలో లక్ష్మీనరసింహుడు ఆదివారం భక్తజనులను కనువిందు చేశారు. వేదపండితుల చతుర్వేద పారాయణాలు, రుత్వికుల మూలమంత్ర జపాలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య గోవర్ధనగిరిధారిగా శ్రీకృష్ణుడి అలంకారంలో నారసింహుడిని ఆలయ తిరువీధుల్లో ఊరేగించి, వేంచేపు మండపంలో అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాత్రివేళ లక్ష్మీనృసింహుడు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కొండపై ఆదివారం యాత్రాజనుల కోలాహలం నెలకొంది. ధర్మదర్శనాలకు 3 గంటలు, ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. 35వేలుకు పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. కాగా, స్వామికి నిజాం వారసులు సుమారు రూ.4లక్షల వ్యయంతో తయారు చేయించిన బంగారు ఆభరణాన్ని కనుకగా అందజేశారు. నిజాం వారసురాలు ప్రిన్సెస్ ఎస్రా 67 గ్రాముల బరువుగల బంగారు హారాన్ని తయారు చేయించగా, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు ఆదివారం ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత ఈవో గీతారెడ్డికి అందజేశారు.
Updated Date - 2023-02-27T03:42:25+05:30 IST