సింగరేణి ఉద్యోగులకు పెరిగిన జీతాలు
ABN, First Publish Date - 2023-07-03T02:40:00+05:30
జాతీయ స్థాయిలో ఇటీవల కుదిరిన 11వ వేతన ఒప్పందం ప్రకారం నూతన వేతనాలను కార్మికులకు అమలు చేయాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది.
● జూన్ నెలకు కొత్త జీతాలు నేడు చెల్లింపు
హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో ఇటీవల కుదిరిన 11వ వేతన ఒప్పందం ప్రకారం నూతన వేతనాలను కార్మికులకు అమలు చేయాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు జూన్ నెలకు సింగరేణి ఉద్యోగులకు నూతన వేతనాల ప్రకారమే జీతాలను చెల్లించేందుకు కసరత్తు పూర్తి చేసింది. దీంతో 41వేల మంది కార్మికులు, ఉద్యోగులు, సూపర్వైజర్లకు ప్రయోజనం కలగనుంది. జూన్ నెల జీతాలను సోమవారం కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. కోల్ ఇండియాకన్నా ముందే సింగరేణి కార్మికులకు కొత్త వేజ్ బోర్డు జీతాలు అందిస్తుండటం విశేషం. కొత్త జీతాల అమలుతో ఏడాదికి సుమారు రూ.1,000 కోట్ల అదనపు భారాన్ని సింగరేణి భరించాల్సి ఉంటుంది. తక్షణమే కొత్త జీతాలను అమలు చేయాలని నిర్ణయించామని, సింగరేణి చైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు జీతాల చెల్లింపునకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేశామని డైరెక్టర్ (ఫైనాన్స్, పర్సనల్) ఎన్ బలరాం తెలిపారు. కాగా రోజువారీ లెక్కన కేటగిరీ 1 బేసిక్ ఇంతకుముందు రోజుకు రూ.1,011.27 ఉండగా ఇప్పుడు రోజుకు రూ.1,502.66 అయింది. మంత్లీ రేటెడ్ ఏ1 గ్రేడ్ ఉద్యోగి బేసిక్ ఇంతకుముందు నెలకు రూ.98,485.79 పొందేవారికి ఇప్పుడు నెలకు రూ.1,46,341.67 అయింది. మారిన కొత్త బేసిక్ ప్రకారం డైలీ రేటెడ్ కేటగిరీ1 ఉద్యోగి స్థూలంగా నెలకు రూ.59,386.57 జీతంగా పొందనున్నారు. మంత్లీ రేటెడ్ అండర్ గ్రౌండ్ ఏ1 గ్రేడ్లోని గరిష్ఠ బేసిక్ రూ.1,46,341.67 ఉన్న ఉద్యోగులు స్థూలంగా నెలకు రూ.2,16,618.74 జీతంగా అందుకోనున్నారు.
Updated Date - 2023-07-03T02:40:00+05:30 IST