Banjara Hills: ముగ్గురమ్మల మూలపుటమ్మ..పెద్దమ్మతల్లి
ABN, First Publish Date - 2023-01-25T13:10:16+05:30
ముగ్గురమ్మల మూలపుటమ్మ.. కొలిచే వారికి కొంగు బంగారమై వరాలిచ్చే తల్లి జూబ్లీహిల్స్
హైదరాబాద్/బంజారాహిల్స్: ముగ్గురమ్మల మూలపుటమ్మ.. కొలిచే వారికి కొంగు బంగారమై వరాలిచ్చే తల్లి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి. నగరంలో అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయంగా చరిత్రపుటల్లోకి ఎక్కిన పెద్దమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు నిత్యం వేల సంఖ్యలో వస్తుంటారు. మంగళవారం, శుక్రవారం, ఆదివారాల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా పెళ్లి కాని వారు, సంతాన లేమి, ఆర్ధిక సమస్యలతో బాధపడుతున్న వారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే చాలు ఎంతటి కోరికలైనా తీరుతాయనే నమ్మకం పెరుగుతుండటంతో ఆలయం దినాదినాభివృద్ధి చెందుతోంది. దివంగత నేత పి.జనార్ధన్రెడ్డి కృషితో చిన్నగా ఉన్న ఆలయం ఇప్పుడు అతి పెద్ద ఆలయంగా అవతరించింది. 29వ వార్షికోత్సవాలు, రథోత్సవం కోసం ఆలయం ముస్తాబవుతోంది.
ఆలయ చరిత్ర
పౌరాణిక చరిత్ర ఆధారంగా ప్రజలను పీడిస్తున్న రాక్షసులను సంహరించేందుకు వచ్చిన శక్తి స్వరూపిణి పెద్దమ్మతల్లి జూబ్లీహిల్స్లోని (గతంలో కొండలు గుట్టలు ఉన్న) బావివద్ద సేద తీరేందుకు వచ్చి అక్కడే కొలువు ఉన్నట్లు పండితులు పేర్కొంటున్నారు. అప్పుడే ఆమె చిన్న విగ్రహం ఇక్కడ కొలువుదీరినట్టు చరిత్ర చెబుతుంది. ఇక్కడ విగ్రహం ఉండటం గమనించిన కొందరు గిరిజనులు చిన్నగా గుడిసె వేసి పూజలు చేయడం ప్రారంభించారు. అనంతరం అది చిన్న ఆలయంగా మారింది. ఆలయం చుట్టుపక్కల కొండలు, గుట్టలతో పాటు చెట్లు విపరీతంగా ఉండటంతో ఇది చిట్టడివిగా కనిపించడంతో చాలా మంది అటు వైపు వెళ్లేందుకు భయపడే వారు. ఆదివారం, మంగళవారం మాత్రం కొంతమంది ఉదయమే వచ్చి ఇక్కడ వనభోజనాలు చేసేవారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకునే వారు. తరువాత భక్తుల సంఖ్య పెరగడంతో 1994లో హంపి శంకరాచార్యుల ఆధ్వర్యంలో బిజ్జుమల్ల సిద్ధాంతి సహకారంతో అప్పటి ఎమ్మెల్యే పీజేఆర్ ఆలయాన్ని పునర్నిర్మించారు.
పీజేఆర్ ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఇక్కడి నుంచే ప్రారంభించడం అనవాయితీగా పెట్టుకునే వారు. జూబ్లీహిల్స్తోపాటు మాదాపూర్ ధనవంతుల కాలనీగా మారడంతో జన సంచారం కూడా పెరిగింది. క్రమంగా అమ్మవారి ఆలయాన్ని కూడా విస్తరించారు. ఆలయంలోని కట్టడాలు చూపరులను కనువిందు చేస్తాయి. ప్రారంభంలో ఆర్చీ మొదలుకొని అన్నిచోట్లా దేవతామూర్తులు ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తారు. ఆలయ ప్రధాన గోపురంపై శిల్పకళ ఉట్టిపడుతోంది. ప్రధాన ఆలయం ముందు మధురై నుంచి ప్రత్యేకంగా తెప్పించిన దీపాంతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రధాన మండపంలో చెక్కిన దేవతామూర్తులకు అందమైన రంగులు వేయడంతో విశేషంగా ఆకట్టుకుంటోంది.
వార్షికోత్సవం పూజలు ఇలా...
ఈ నెల 26న ఉదయం 3 గంటలకు పెద్దమ్మతల్లి అభిషేకం, మంత్రపుష్పం, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, యాగశాల ప్రవేశం, ధ్వ జారోహణం, అఖండదీపారాధన, వేద పారాయణం, నవగ్రహజపాలు, రుద్రాభిషేకం, సాయంత్రం అమ్మవారి ఉత్పవమూర్తి పల్లకి సేవ నిర్వహిస్తారు.
27న మండపపూజలు, వేదపారాయణం, అరుణ, పంచోపనిషత్, దేవీభాగవత, మహావిద్య, చండీపారాయణాదులు, సామూహిక లలితా సహస్రనామ కుంకుమార్చనలు జరుగుతాయి.
28న దిక్పాలక బైరవ బలిహరణం, చండీహోమం, పూర్ణాహుతి నిర్వహించనున్నారు.
రథసప్తమి రోజు రథోస్థవం
పెద్దమ్మ తల్లి ఆలయంలో నిత్య పూజలతో పాటు విశేష పూజలు నిత్యం జరుగుతుంటాయి. మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజు అమ్మవారి రథోస్తవ వేడుకలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. పెద్దమ్మ తల్లి విగ్రహం రథోసప్తమి రోజున ప్రతిష్ఠాపన జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి యేటా అమ్మవారి ఉత్పవ విగ్రహాన్ని రథంపై ఉంచి పలు వీధుల్లో ఊరేగిస్తారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడతారు. ఈ నెల 28న రథోత్సవం జరపనున్నారు. ఈ నెల 29న పెద్దమ్మవారి ఉత్సవమూర్తికి పుష్కరిణి యందు అవభృథ స్నానంతో వార్షికోత్సవాలు ముగుస్తాయి.
Updated Date - 2023-01-25T13:10:18+05:30 IST