భాగ్యరెడ్డివర్మకు తగిన గౌరవం దక్కలేదు
ABN, First Publish Date - 2023-05-23T02:25:37+05:30
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా భాగ్యరెడ్డివర్మకు సరైన గుర్తింపు లభించడం లేదని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షుడు జి.మురళీధరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం దళితులకు చేసిందేమీ లేదు
ఆలిండియా ఎస్సీ, ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షుడు మురళీధరరావు
భాగ్యరెడ్డివర్మకు భారతరత్న ఇవ్వాలి: జూలూరి గౌరీశంకర్
రవీంద్రభారతి, మే 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా భాగ్యరెడ్డివర్మకు సరైన గుర్తింపు లభించడం లేదని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షుడు జి.మురళీధరరావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు చేసిందేమీ లేదని అన్నారు. భాగ్యరెడ్డివర్మ 135వ జయంతి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జీ.మురళీధరరావుకు భాగ్యరెడ్డిరవర్మ స్మారక జీవత సాఫల్య పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా మురళీధరరావు మాట్లాడుతూ.. పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉన్నా ప్రభుత్వం దళితులకు చేసిందేమీ లేదని అసహనం వ్యక్తం చేశారు. దీంతో కార్యక్రమ నిర్వాహకులు ఆయన్ను అడ్డుకున్నారు. భాగ్యరెడ్డివర్మ స్ఫూర్తితోనే ఇలా మాట్లాడుతున్నానని, పురస్కారం అందుకున్నా సరే మనసు రగిలిపోతోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమ కోసం ప్రభుత్వం పనిచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ అంబేడ్కర్కే దారి చూపిన భాగ్యరెడ్డివర్మకు భారతరత్న పురస్కారం అందించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం భాగ్యరెడ్డివర్మ జీవితాన్ని పాఠ్యాంశంగా తీసుకొచ్చిందని తెలిపారు. అయితే, ఈ కార్యక్రమానికి మంత్రులు రానందకు నిరసనగా వివిధ సంఘాల నేతలు జూలూరి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. తెలంగాణ వేర్హౌస్ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మాట్లాడుతూ ప్రభుత్వం దళిత జాతికి చేయాల్సి ఇంకా ఉంది కానీ ఇప్పటిదాకా చేసిన మంచిని గుర్తించాలని కోరారు.
Updated Date - 2023-05-23T02:25:47+05:30 IST