Hyderabad: హనీమూన్కు వెళ్లి.. ఇండోనేషియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
ABN, First Publish Date - 2023-01-25T09:00:10+05:30
నాగోల్ బండ్లగూడకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి వంశీకృష్ణ హనీమూన్ యాత్ర
హైదరాబాద్/మన్సూరాబాద్: నాగోల్ బండ్లగూడకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి వంశీకృష్ణ హనీమూన్ యాత్ర విషాదాంతమైంది. ఇండోనేషియా బాలి సమీపంలోని ఐలాండ్లో రైడింగ్కు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. నాగోలు డివిజన్ అజయ్నగర్ కాలనీలో నివాసం ఉంటున్న రాముని రవీందర్, విజయలక్ష్మి దంపతులకు రెండో కుమారుడైన వంశీకృష్ణ (27) సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇతనికి గత ఏడాది జూన్లో శ్రావణితో వివాహమైంది. సివిల్స్ రాసిన వంశీకృష్ణ ఇటీవల గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసి అర్హత సాధించి, మెయిన్స్ రాసేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈనెల 13న భార్యతో కలిసి హనీమూన్కు మొదట మలేషియా వెళ్లాడు. అక్కడి నుంచి ఈనెల 19న ఇండోనేషియాలోని బాలికి చేరుకున్నారు. 21న బాలికి కొంత దూరంలోని పెన్నిడా ఐలాండ్ వెళ్లారు. అక్కడ బస చేశారు. 22న ఉదయం పెన్నిడా ఐలాండ్లో సముద్ర భూభాగంలో అక్వేరియం చేపలు చూసేందుకు 20మంది పర్యాటకులు, ముగ్గురు గైడ్లు ఒకేసారి దిగారు. అందులో వంశీకృష్ణ కూడా ఉన్నారు. ఆక్సిజన్ మాస్క్, డ్రైవింగ్ షూతో వంశీకృష్ణ దిగాడు. ఈ క్రమంలో అతను సముద్రంలోనే గల్లంతై ప్రాణాలు కోల్పోయాడు. అదేరోజు సాయంత్రం అతని మృతదేహాన్ని గుర్తించారు.
గైడ్ పలుమార్లు సూచించటంతో..
పెన్నిడా ఐలాండ్ నుంచి ఆదివారమే తిరిగి బాలికి వచ్చేయాల్సి ఉండగా.. అక్కడ ఉన్న గైడ్ సముద్రభూభాగంలో చేపలు చూసేందుకు వెళితే మంచి అనుభూతి ఉంటుందని పలుమార్లు సూచించినట్లు తెలిసింది. మళ్లీ ఇక్కడికి రాలేమన్న భావనతో వంశీకృష్ణ అంగీకరించి.. సముద్రంలోకి దిగి ప్రాణాలు కోల్పోయాడని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సముద్ర భూభాగంలోకి వెళ్లే క్రమంలో భయపడి, హార్ట్స్ట్రోక్కు గురైనట్లు డెత్రిపోర్ట్లో అక్కడి పోలీసులు రాశారని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అయితే, మృతదేహాన్ని తీసుకురావటానికి బంధువులు ఇండోనేషియా వెళ్లారు. మృతదేహం గురువారం నగరానికి రావొచ్చని కుటుంబసభ్యులు చెబుతున్నారు. వంశీకృష్ణ తండ్రి అల్కాపురి చౌరస్తాలోని రాఘవేంద్ర హోటల్ యజమాని. లండన్లో ఉంటున్న వంశీకృష్ణ అన్న నవ్యకృష్ణ సోమవారమే ఇంటికి చేరుకున్నాడు.
Updated Date - 2023-01-25T09:00:22+05:30 IST