HYD Tragedy Love: అత్యంత కిరాతకంగా స్నేహితుడి హత్య
ABN, First Publish Date - 2023-02-26T03:28:31+05:30
‘‘ఈ గుండెల్లోనే కదరా.. ఆ అమ్మాయిని పెట్టుకున్నావ్’’ అంటూ గుండెను చీల్చాడు. మీద పడి పెదవులు కోసేశాడు. చేతి వేళ్లను నరికేశాడు..
ఒకే అమ్మాయిని ప్రేమించిన యువకులు
ఆమె విషయంలో ఇద్దరి మధ్య వివాదం
ఓ షాపింగ్ మాల్లో కత్తి కొనుగోలు
పార్టీ చేసుకుందామని పిలిచి దారుణం
ఆ దృశ్యాలు యువతి, స్నేహితులకు వాట్సాప్
వైద్యులే నివ్వెరపోయేలా..
ఫోరెన్సిక్కు పంపే శరీర భాగాలే ధ్వంసం
పోలీసులకు చిక్కకుండా పక్కా ప్రణాళిక
యూట్యూబ్లో వీడియోలు చూసి ప్లాన్
నార్కట్పల్లిలో మిస్సింగ్.. నగరంలో హత్య
అబ్దుల్లాపూర్మెట్/హైదరాబాద్ సిటీ/మంగళ్హాట్, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ‘‘ఈ గుండెల్లోనే కదరా.. ఆ అమ్మాయిని పెట్టుకున్నావ్’’ అంటూ గుండెను చీల్చాడు. మీద పడి పెదవులు కోసేశాడు. చేతి వేళ్లను నరికేశాడు.. మర్మాంగమూ కోసేశాడు. కడుపులోని పేగులను సైతం బయటకు గుంజాడు. యువతితో ప్రేమ విషయంలో కిరాతకుడిగా మారి.. కలిసి తిరిగిన స్నేహితుడే అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా చారుకొండ మండలం శిరిసనగండ్లకు చెందిన నేనావత్ నవీన్ (22)కు దిల్సుఖ్నగర్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా ప్రేరాల హరిహర కృష్ణతో పరిచయమైంది. మంచి స్నేహితులయ్యారు. తొలుత నవీన్కు సమీప కళాశాలలో చదివే యువతితో పరిచయమై.. అది ప్రేమగా మారింది. ఈ విషయం హరిహర కృష్ణకూ తెలుసు. నవీన్ బీటెక్ కోసం నల్లగొండలోని ఎంజీఎం కళాశాలలో, హరి పీర్జాదిగూడలోని కళాశాలలో చేరారు. నవీన్ నల్లగొండకు వెళ్లాక యువతితో దూరం పెరిగింది. ఇదే అదునుగా యువతితో హరి స్నేహం పెంచుకుని, ప్రేమించాడు. ఇది తెలిశాక నవీన్ కూడా ఆమెకు టచ్లోకి వచ్చాడు. దీన్ని తట్టుకోలేని హరి యువతిని దక్కించుకోవాలని, నవీన్ను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. నవీన్ హత్యకు 3 నెలలుగా హత్యకు పథకం వేస్తున్నాడు. షాపింగ్ మాల్లో కత్తిని కొన్నాడు.
పార్టీ చేసుకుందామని పిలిచి..
నార్కట్పల్లిలో ఉంటున్న నవీన్ను పార్టీ చేసుకుందామని హరి హైదరాబాద్కు పిలిచాడు. ఈ నెల 17న ఇద్దరూ పెద్ద అంబర్పేట్ వద్ద మద్యం తాగారు. బైక్పై అబ్దుల్లాపూర్మెట్ వైపు వచ్చి.. మధ్యలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో యువతితో ప్రేమ వ్యవహారమై గొడవపడ్డారు. కిందపడిన నవీన్ను గొంతు పిసికి.. పదునైన కత్తితో హరి విచక్షణా రహితంగా దాడి చేశాడు. మర్మాంగాన్ని కోసేశాడు. చేతి వేళ్లను నరికేశాడు. మొండెంను వేరు చేశాడు. కడుపులో పేగులను బయటకు తీశాడు. ఉన్మాదిగా మారిన హరి.. నవీన్ దుస్తులు తొలగించి, చేతులకు గ్లోవ్స్ ధరించి శరీర భాగాలను కోసేశాడు. అతడి సెల్ఫోన్ను పగులకొట్టాడు. హత్య దృశ్యాలను, అతడి గుండె, మర్మాంగాలను ఫొటో తీసి యువతికి, కొందరు స్నేహితులకు హరి వాట్సాప్ చేశాడు. గుండెను బయటకు తీసిన తీరు వైద్యులను సైతం నివ్వెరపరిచింది. ఏ అవయవాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతారో వాటినే ధ్వంసం చేసినట్లు వారు పేర్కొనడం గమనార్హం. క్రైమ్ సిరీ్సలు, యూ ట్యూబ్ చూసి హత్యకు పక్కా ప్లాన్ వేశాడని, పూర్తి అవగాహనతోనే హరి దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు, వైద్యులు అనుమానిస్తున్నారు.
అన్నం తీసి పెట్టు: నవీన్ ఆఖరి ఫోన్
ఈ నెల 17న హైదరాబాద్కు వచ్చిన నవీన్ రాత్రి 8 గంటలకు హాస్టల్ స్నేహితుడు ప్రదీ్పకు ఫోన్ చేశాడు. ‘రావడానికి ఆలస్యం అవుతుంది. అన్నం తీసి పెట్టు’ అని చెప్పాడు. ఎంతకూ రాకపోవడంతో 9.30కు ప్రదీప్ ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. తర్వాతి రోజు నవీన్ స్నేహితులు హరికి ఫోన్ చేయగా నిన్ననే అబ్దుల్లాపూర్మెట్లో వదిలేసి వెళ్లినట్లు తెలిపాడు. కాగా, ఈ విషయాన్ని స్నేహితులు నవీన్ తండ్రి శంకరయ్యకు చెప్పి హరిహరకృష్ణ ఫోన్ నంబర్ ఇచ్చారు. శంకరయ్య మాట్లాడినా హరి అదే సమాధానం చెప్పాడు. నవీన్ కనిపించడం లేదని ఫిర్యాదు చేసేందుకు తాను కూడా పోలీస్ స్టేషన్కు వస్తానని సలహా కూడా ఇవ్వడం గమనార్హం. మరోవైపు గత మంగళవారం హరికి శంకరయ్య ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. దీంతో వెంటనే నార్కట్పల్లికి వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వెదుకుతున్నారని తెలిసి లొంగుబాటు
నవీన్ కుటుంబ సభ్యులు కేసులు పెట్టడం, పోలీసులు విచారణ వేగిరం చేయడంతో పట్టుబడతానని భావించిన హరి శుక్రవారం సాయంత్రం అబ్దుల్లాపూర్మెట్ స్టేషన్లో లొంగిపోయాడు. నవీన్ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిని సంఘటన స్థలానికి తీసుకుని వెళ్లి.. కుళ్లిన స్థితిలో ఉన్న నవీన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హరి వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఇంతటి దారుణ హత్య అతడు ఒక్కడే చేశాడా..? ఇంకెవరి సాయమైనా తీసుకున్నాడా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా, ఇంత దారుణానికి ఒడిగట్టిన హరిలో ఏ మాత్రం పశ్చాతాపం లేదని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. అడిగిన ప్రశ్నలకు మాత్రమే జవాబు చెప్తూ మౌనంగా ఉంటున్నట్లు సమాచారం. అతడిని పోలీసులు హయత్నగర్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. హరి హత్య చేసిన విధానం, ప్రవర్తనను బట్టి ఉన్మాది లక్షణాలు ఉన్నట్లు భావించిన జైలు అధికారులు అతడిని ప్రత్యేక బ్యారక్లో ఉంచినట్లు తెలిసింది. కరోనాకు గురైన హరికి తన కుమారుడు గంజి కాసి ఇచ్చాడని, ఎవరినీ మాట అనని వాడిని పొట్టన పెట్టుకున్నాడని నవీన్ తల్లి వాపోయింది. తండ్రి శంకరయ్య మాట్లాడుతూ.. యువతి సహా ముగ్గురూ ఒకే కాలేజీలో చదివారని, ఆమె విషయం తమ వద్ద ప్రస్తావన తేలేదని చెప్పారు. నవీన్ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంజారా సంఘం నేతలు పెద్దఎతున శనివారం అబ్దుల్లాపూర్మెట్ స్టేషన్కు వచ్చి ఆందోళన చేశారు. జాయింట్ సీపీ సత్యనారాయణ, డీసీపీ సాయిశ్రీ వారితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, నవీన్ మృతదేహానికి ఉస్మానియాలో వైద్యులు శవ పరీక్షలు నిర్వహించారు. శనివారం ఆస్పత్రికి వచ్చిన తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పోస్ట్మార్టం సమయంలో నవీన్ మృతదేహాన్ని చూసి.. వైద్యుల బృందం నివ్వెరపోయినట్లు తెలిసింది.
హరిపై 17న మలక్పేటలో మిస్సింగ్ కేసు
హరిహరకృష్ణ ఈ నెల 17 (హత్య చేసిన రోజు) నుంచి ముసారాంబాగ్లో ఉంటున్న సోదరి ఇంటికి వెళ్లలేదు. ఈ నెల 21న వెళ్లాడు. ఆ కొద్దిసేపటికే నవీన్ తండ్రి ఫోన్ చేయడంతో.. స్టేషన్లో ఫిర్యాదు చేద్దాం రమ్మని చెప్పి బయటకు వచ్చాడు. ఇంట్లోంచి వెళ్లిపోయి ఫోన్ స్విచాఫ్ చేశాడు. ఇక ఈ నెల 20 నుంచి హరి కళాశాలకు వెళ్లడం లేదు. కాలేజీ వారు ఫోన్ చేయగా.. ఏదో జరుగుతోందని అతడి బావ బలుసు లక్ష్మీవెంకటనారాయణ అనుమానించాడు. మలక్పేట స్టేషన్లో గురువారం మిస్సింగ్ కేసు పెట్టారు. మరోవైపు హరి తల్లిదండ్రులు మనస్ఫర్థలతో విడిపోయినట్లు తెలిసింది. తండ్రి సంరక్షణలో.. అక్క వద్ద ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. డబ్బు అవసరమైనప్పుడల్లా డెలివరీ బాయ్గా పనిచేసేవాడు.
Updated Date - 2023-02-26T07:40:00+05:30 IST