Hetero Chairman: హెటిరో చైర్మన్కుఎదురు దెబ్బ
ABN, First Publish Date - 2023-06-06T02:53:06+05:30
అక్రమంగా భూకేటాయింపు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి.. హెటిరో గ్రూప్ చైర్మన్, బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
ఆయన మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న ట్రస్టుకు భూమిని కేటాయిస్తూ ఇచ్చిన జీవో 59ని కొట్టేసిన హైకోర్టు
బుర్ర ఉపయోగించకుండా ఆ జీవో ఇచ్చారు
ప్రభుత్వ నిర్ణయాన్ని తూర్పారబట్టిన న్యాయస్థానం
పాలసీకి విరుద్ధంగా కేటాయింపు చెల్లదని స్పష్టీకరణ
పాలసీ ప్రకారం మళ్లీ నిర్ణయం తీసుకోవాలని ఆదేశం
అక్కడ నిర్మాణాలు మొదలుపెట్టేసినంత మాత్రాన అక్రమ కేటాయింపులు చట్టబద్ధం అయిపోవు
1989 నాటి లీజు రేట్లకే 2018లో ఎలా ఇస్తారు?
ప్రజా ఆస్తులకు సర్కారు ట్రస్టీ మాత్రమే: హైకోర్టు
హైదరాబాద్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా భూకేటాయింపు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి.. హెటిరో గ్రూప్ చైర్మన్, బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్థసారథి రెడ్డి మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న సాయిసింధు ఫౌండేషన్కు 15 ఎకరాల భూమిని లీజుకు ఇస్తూ ప్రభుత్వం 2018లో జారీచేసిన జీవో 59ని హైకోర్టు కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వ భూకేటాయింపుల పాలసీ (జీవో నంబర్ 571, జీవో నంబర్ 218) ప్రకారం దీనిపై తాజాగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టంచేసింది. ప్రజల ఆస్తులకు, వనరులకు ప్రభుత్వం ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాలని.. ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టేటప్పుడు ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని కఠిన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయనే కారణంతో అక్రమ కేటాయింపులు చట్టబద్ధమైపోవని.. నిర్మాణాలు జరుగుతున్నాయనేది అసలు గ్రౌండ్ కానేకాదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ భూకేటాయింపుల పాలసీ ప్రకారం ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
ఇదీ నేపథ్యం..
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలోని సర్వే నెంబర్ 41లో.. హైటెక్ సిటీ సమీపంలో అత్యంత విలువైన 15 ఎకరాల భూమిని హెటిరో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథిరెడ్డికి చెందిన సాయిసింధు ట్రస్టుకు 60 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ ప్రభుత్వం 2018లో జీవో నంబర్ 59 జారీచేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ డాక్టర్ ఊర్మిళ పింగ్లే, కె.సురేశ్కుమార్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం మార్చి 31న తీర్పు రిజర్వు చేసింది. సోమవారం ఆ తీర్పును వెలువరించింది. పార్థసారథిరెడ్డి, సాయిసింధు ట్రస్ట్ తరఫున సీనియర్ న్యాయవాది, వైసీపీ ఎంపీ ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. చనిపోయిన తన కుమార్తె పేరుపై ట్రస్ట్ ఏర్పాటు చేసి సమాజానికి ఎంతోకొంత తిరిగి చెల్లించే ఉద్దేశంతో సేవచేయాలని పార్థసారథిరెడ్డి ముందుకు వచ్చారని ఆయన కోర్టుకు తెలిపారు. 500 పడకలతో ప్రపంచస్థాయి వసతులతో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించాలని తలపెట్టారని వెల్లడించారు.
భూమి కొనుగోలు చేయడానికేఎక్కువ ఖర్చు పెడితే హాస్పిటల్ నిర్మాణం కష్టమవుతుందనే ఉద్దేశంతోనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తరహాలో భూమి లీజుకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారని పేర్కొన్నారు. ఆ ఆస్పత్రిలో 25 శాతం పడకలు పేదలకు ఉచితంగా ఇవ్వడంతోపాటు, 40 శాతం ఓపీ సర్వీసులు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బండా శివానంద ప్రసాద్ వాదనలు వినిపించారు. సాయి సింధు ట్రస్ట్ లాభాపేక్ష లేని సంస్థ అయినందున.. సదరు భూమిని కేవలం లీజుకు మాత్రమే ఇచ్చామని, విక్రయించలేదని తెలిపారు. క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో రాయితీ ధరకు హాస్పిటల్ నిర్మాణానికి భూమిని లీజుకు ఇచ్చినట్లు తెలిపారు. క్యాన్సర్ చికిత్స పేద ప్రజలకు మోయలేని భారంగా మారుతోందని గుర్తుచేశారు.
అలా ఎలా ఇస్తారు?
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపించారు. రూ.500 కోట్ల కంటే ఎక్కువ విలువైన భూమిని అంత్యంత తక్కువ ధరకు లీజుకు ఇవ్వడం సమంజసం కాదని.. కనీసం 10 శాతం అంటే రూ.50 కోట్లు లీజు మొత్తం తీసుకోవాల్సి ఉంటుందని.. ప్రతి ఐదేళ్లకోసారి మార్కెట్ రేటు ప్రకారం ధరలు సవరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కానీ విలువైన భూమిని ఏడాదికి రూ.1.47 లక్షల చొప్పున మాత్రమే లీజుకు ఇస్తూ జీవో జారీచేశారని పేర్కొన్నారు. సదరు ట్రస్టు చైర్మన్కు గతంలో ఆస్పత్రి నడిపిన అనుభవం లేదని.. ఆయన డాక్టర్ కూడా కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సాయి సింధు ట్రస్ట్ 2014లో నమోదు కాగా 2015, 2016ల్లో ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చారని.. 2018లో జీవో ఇచ్చారని తెలిపారు. సేవ చేయాలంటే గ్రామీణ ప్రాంతాల్లో హాస్పిటల్ పెట్టాలని.. విలువైన భూముల్లో ఎందుకని ప్రశ్నించారు. సాయి సింధు ఫౌండేషన్కు భూమి కేటాయిస్తూ జారీచేసిన జీవో 59 ప్రభుత్వ భూకేటాయింపుల పాలసీకి విరుద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. ౖ2012, 2015ల్లో జారీచేసిన జీవో 571, జీవో218లో.. ప్రభుత్వ భూకేటాయింపుల పాలసీకి సంబంధించిన నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని గుర్తుచేశారు. ఆ పాలసీ అమల్లో ఉండగా.. తన విధాన నిర్ణయాన్ని తానే ఉల్లంఘిస్తూ ప్రభుత్వం జీవో 59 ఇవ్వడం చెల్లదని పేర్కొన్నారు.
అడిగినంత ఇచ్చేశారు!
అందరి వాదనలూ నమోదు చేసుకున్న ధర్మాసనం.. భూకేటాయింపు పాలసీ ప్రకారం ప్రభుత్వ భూమిని లీజుకు ఇవ్వాలంటే సదరు భూమి మార్కెట్ విలువలో 10 శాతం విలువను ఏటా లీజుగా వసూలు చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. ఈ లీజు మొత్తాన్ని ప్రతి ఐదేళ్లకోసారి పునఃసమీక్షించి.. పెరిగిన మార్కెట్ విలువ ప్రకారం 10 శాతం లీజు ఎంతో నిర్ణయుంచి వసూలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ‘‘సాయి సింధు ఫౌండేషన్కు 10 ఎకరాలు ఇవ్వాలని కలెక్టర్ సిఫారసు చేస్తే రాష్ట్రప్రభుత్వం దానికి ఐదెకరాలు కలిపి 15 ఎకరాలు కేటాయించింది. ప్రభుత్వం తన విచక్షణ ప్రకారం భూమి కేటాయించకుండా.. ప్రతివాది అడిగినంత భూమిని కేటాయించింది. అంతేకాకుండా ప్రతివాది అడిగినట్లు అలైన్మెంట్ను సైతం మార్చింది. ప్రభుత్వ భూకేటాయింపు పాలసీకి సంబంధించిన జీవోలు 571, 218ల్లోని 3 (హెచ్), (డీ) ప్రకారం లీజు నిర్ణయించాలని కలెక్టర్, తెలంగాణ స్టేట్ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ (కాంపిటెంట్ అథారిటీ) ప్రతిపాదించనప్పటికీ వాటిని ప్రభుత్వం పట్టించుకోలేదు. చదరపు గజానికి రూ.75 వేలు మార్కెట్ విలువ అని కాంపిటెంట్ అథారిటీ నిర్ణయించింది. ప్రభుత్వం ఈ ధరను పట్టించుకోకుండా.. బసవతారకం ఆసుపత్రికి 1989తో ఇచ్చిన లీజు ధరకే ప్రస్తుత లీజును కేటాయించింది.
భూకేటాయింపుల పాలసీకి విరుద్ధంగా, కలెక్టర్, కాంపిటెంట్ అథారిటీ లీజు ప్రతిపాదనలకు విరుద్ధంగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అనే అంశంపై ప్రభుత్వం ఎటువంటి వివరణా ఇవ్వలేదు. ఈ రెండు విషయాలనూ పట్టించుకోకుండా, అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేకుండా జీవో 59 ఉన్నది. అలాగే 1989లో బసవతారకం ఆసుపత్రికి స్థలం కేటాయించేటప్పుడు ఎలాంటి భూకేటాయింపు పాలసీ అమలు లేదు. 1989లో నిర్ధారించిన లీజు రేట్లనే 2018లో అమలు చేస్తామనడం సమంజసం కాదు. హైదరాబాద్ నగరంలో 1989 నాటి భూముల ధరలకు.. 2018 నాటి భూముల ధరలకు అసలు పోలికే లేదు. భూముల ధరలు అనేక రెట్లు పెరిగాయు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా 30 ఏళ్ల కిందటి రేట్లకే లీజులు కేటాయించారు. కాంపిటెంట్ అథారిటీ ఒక్క చదరపు గజానికి రూ.75 వేలు లెక్కన ధర నిర్ణయించి.. దానిపై 10 శాతం లీజు వసూలు చేయాలని నిర్ణయించింది. అలాగే 10 ఎకరాలు ఇవ్వాలని సిఫారసు చేస్తే ప్రభుత్వం 15 ఎకరాలు ఇచ్చింది. అది కూడా పాలసీకి విరుద్ధంగా.. మొత్తం 15 ఎకరాలకు ఏటా అతి తక్కువగా రూ.1.47 లక్షలు లీజుగా నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వ భూమిని కారుచవకగా ప్రతివాది సాయి సింధు ఫౌండేషన్కు ఇచ్చింది. రాష్ట్రానికి, ప్రజల ఆస్తులకు, వనరులకు ప్రభుత్వం ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాలి. ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టేటప్పుడు ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి. ప్రజాప్రయోజనాలే పరమావధిగా భావించాలి. ఈ మేరకు జీవో నంబర్ 59ని కొట్టేస్తున్నాం.’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Updated Date - 2023-06-06T02:57:37+05:30 IST