ఏఐసీసీలో 47 మంది తెలంగాణ నేతలు
ABN, First Publish Date - 2023-02-21T03:16:28+05:30
ఏఐసీసీ సభ్యుల జాబితాలో తెలంగాణకు చెందిన 47 మంది నాయకులకు చోటు దక్కింది. ఇందులో 33 మంది ఎలెక్టెడ్ సభ్యులు కాగా 14 మంది కో ఆప్టెడ్ సభ్యులు.
33 మంది ఎలెక్టెడ్, 14 మంది కోఆప్టెడ్ సభ్యులు..
సీడబ్ల్యూసీ సభ్యులంతా నామినేట్
కమిటీలో సుబ్బిరామిరెడ్డి కొనసాగింపు?
24 నుంచి 26 వరకు ఏఐసీసీ ప్లీనరీ
హైదరాబాద్/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ సభ్యుల జాబితాలో తెలంగాణకు చెందిన 47 మంది నాయకులకు చోటు దక్కింది. ఇందులో 33 మంది ఎలెక్టెడ్ సభ్యులు కాగా 14 మంది కో ఆప్టెడ్ సభ్యులు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, పార్టీ ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, పోదెం వీరయ్య, సీతక్క ఈ జాబితాలో ఉన్నారు. పార్టీలోని ముఖ్య నాయకులందరి పేర్లూ ఈ జాబితాలో ఉన్నాయి. పార్టీ విద్యార్థి, యువజన, మహిళా విభాగాల రాష్ట్ర అధ్యక్షులు ముగ్గురికీ చోటు కల్పించారు. కో ఆప్టెడ్ సభ్యుల్లో టీపీసీసీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమ్కుమార్, సీనియర్ ఉపాధ్యక్షులు ఆర్ దామోదర్ రెడ్డి, జీ నిరంజన్, ఉపాధ్యక్షులు హార్కార వేణుగోపాల్, వేం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, ఈ నెల 24 నుంచి 26 వరకు నవ రాయ్పూర్లో ఏఐసీసీ ప్లీనరీ జరగనుంది. ప్లీనరీలో పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులంతా నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటులో పార్టీ నేతతో పాటు మిగతా 23 మందిలో 12 మందిని ఏఐసీసీ ఎన్నుకుంటే మిగతా వారిని పార్టీ అధ్యక్షుడు నామినేట్ చేస్తారని ఏఐసీసీ నిబంధనావళి పేర్కొంటోంది. అయితే గత పాతికేళ్లుగా సభ్యులందర్నీ అధ్యక్ష పదవిలో ఉన్న వారే నామినేట్ చేస్తున్నారు. 1997లో పార్టీ అధ్యక్షుడు సీతారాం కేసరి అధ్యక్షతన కోల్కతాలో జరిగిన ప్లీనరీ సదస్సులో చివరిసారిగా సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరిగాయి.
అంతకుముందు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలో 1992లో తిరుపతిలో జరిగిన ప్లీనరీలో సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరిగినప్పటికీ దళితులు, ఆదివాసీలు, మహిళలకు ప్రాతినిధ్యం లభించలేదన్న కారణంతో ఎన్నికైన వారితో రాజీనామా చేయించి, అందర్నీ నామినేట్ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హయాంలో సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరగలేదు. ఈసారి ఎన్నికలు జరగాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నా నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించబోతున్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత పార్టీ అంతా సంఘటితంగా కనిపిస్తున్న సమయంలో ఎన్నికల పేరుతో సభ్యుల మధ్య విభేదాలు లేవనెత్తడం సరైంది కాదని భావిస్తున్నారు. దీంతో స్టీరింగ్ కమిటీ సభ్యుల్లో అత్యధికులు కొత్త సీడబ్ల్యూసీలో సభ్యులయ్యే అవకాశాలు ఉన్నాయి. స్టీరింగ్ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి టి.సుబ్బిరామిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనే కొత్త సీడబ్ల్యూసీ సభ్యుడిగా కొనసాగుతారు. కాగా, సీడబ్ల్యుసీకి ఎన్నికలు జరిగిన పక్షంలో తాను పోటీ చేస్తానని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యుడు మల్లు రవి చెప్పారు. ఎంపీ ఉత్తమ్ కూడా పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరగకపోయినా పలు సంస్థాగత సంస్కరణలకు ప్లీనరీ ఆమోద ముద్ర వేసే అవకాశాలు ఉన్నాయి. సీడబ్ల్యూసీ సభ్యుల సంఖ్యను 23 నుంచి 27కు పెంచడం, మాజీ ప్రధానులు, పార్టీ మాజీ అధ్యక్షులకు స్థానం కల్పించడం, సీడబ్ల్యూసీ సహా అన్ని విభాగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలు, 50 ఏళ్లలోపు ఉన్న యువతకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం వంటి కీలక సంస్థాగత సంస్కరణలు అమలు చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
Updated Date - 2023-02-21T03:16:29+05:30 IST