స్థానికులను కాదని పాతబస్తీ వాళ్లకి ఇళ్లా?
ABN, First Publish Date - 2023-09-22T03:01:08+05:30
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వం ఓ వర్గానికి కొమ్ముకాస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు.
హత్తిగూడ, తుక్కుగూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై బీజేపీ ధర్నా
హయత్నగర్, మహేశ్వరం సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వం ఓ వర్గానికి కొమ్ముకాస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. హత్తిగూడ, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్మించిన డబుల్ ఇళ్ల కేటాయింపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ముస్లింలు, ఇతర ప్రజలను కాదని పాతబస్తీ ప్రాంతానికి చెందిన వారికి ఇళ్లు కేటాయించడం ఏంటని ప్రశ్నిస్తూ ఎక్కడికక్కడ గురువారం ధర్నాలు చేశారు. హత్తిగూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించడానికి వచ్చిన మంత్రి మహేందర్రెడ్డిని ప్రశ్నించేందుకు మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొప్పుల నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ముస్లింలకే ఇళ్లు ఇవ్వాలనుకుంటే స్థానికంగా ఎల్బీనగర్, హయత్నగర్, మన్సూరాబాద్లో ముస్లింలు లేరా అని ప్రశ్నించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 49 వేల మంది లబ్ధిదారులు ఉండగా యాకుత్పుర, చార్మినార్, బార్కాస్, సైదాబాద్ ప్రాంతాల వారికి ఎందుకు కేటాయించారో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనర్హులకు లబ్ధిదారుల కార్డులు ఇచ్చారని, కొందరు దళారులు వాటిని రూ.20 వేలకు అమ్ముతున్నారని ఆరోపించారు. హత్తిగూడలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయం దగ్గరకు వచ్చేందుకు యత్నించిన సీపీఐ రాష్ట్ర నాయకుడు ఆందోజు రవీంద్రాచారి ఇతర నేతలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. మరోపక్క, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలోని మంఖాల్, సర్ధార్నగర్ గ్రామాల్లో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు టి.యాదీష్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. స్థానికులను కాదని పాత బస్తీ వాసులకు ఇళ్లు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. కాగా, దరఖాస్తు చేసుకున్నా తమకు ఇళ్లు ఇవ్వలేదని జవహర్నగర్ వాసులు ఆందోళనకు దిగారు. మంత్రి మల్లారెడ్డి పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - 2023-09-22T03:01:08+05:30 IST