జీనోమ్ వ్యాలీని 250 ఎకరాల్లో విస్తరిస్తాం
ABN, First Publish Date - 2023-09-22T02:34:12+05:30
జీనోమ్ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
యూరోఫిన్స్ ఫార్మా క్యాంపస్ ప్రారంభం
మేడ్చల్ సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జీనోమ్ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పరిశ్రమలకు టెస్టింగ్ సేవలను అందించడంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న యూరోఫిన్స్ బయోఫార్మా సర్వీసెస్ క్యాంప్సను మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం తుర్కపల్లిలోని జీనోమ్ వ్యాలీలో గురువారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జీనోమ్ వ్యాలీలోని శక్తిమంతమైన ఆర్ అండ్ డీ వ్యవస్థకు మరో సంస్థ తోడవడం హర్షణీయమని అన్నారు. యూరోఫిన్స్ కంపెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడి పెడుతోందని, దీని ద్వారా భవిష్యత్తులో సుమారు 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేయడం తమ విజన్లో భాగమని కేటీఆర్ అన్నారు.
భారత్ సిరమ్స్ యూనిట్కు శంకుస్థాపన..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): వ్యాక్సిన్ క్యాపిటల్గా అభివృద్ధి చెందిన హైదరాబాద్లో బీఎ్సవీ ప్రపంచ స్థాయి తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడం హర్షణీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. జీనోమ్ వ్యాలీలో భారత్ సిరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ (బీఎ్సవీ) బయో-ఫార్మాసూటికల్స్ ఏర్పాటు చేస్తున్న యూనిట్కు గురువారం కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జీనోమ్ వ్యాలీలో 10 ఎకరాల్లో రూ.200 కోట్ల తో బీఎ్సవీ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. మొదటి దశ లో ఇక్కడ ఫిల్-ఫినిష్ ఫార్ములేషన్ ఇంజెక్టబుల్స్ను తయారు చేస్తారు. మహిళల ఆరోగ్యసంబంధిత ఉత్పత్తులు, రాబిస్ వ్యాక్సిన్లు, ఇమ్మునోగ్లోబులిన్స్, హార్మోన్స్ తదితరాలను తయారు చేయనున్నట్లు బీఎ్సవీ ఎండీ, సీఈవో సంజీవ్ నవన్గుల్ తెలిపారు.
Updated Date - 2023-09-22T02:34:12+05:30 IST