‘ధరణి’ ప్రపంచంలోనే పెద్ద కుంభకోణం
ABN, First Publish Date - 2023-06-26T03:59:39+05:30
‘ధరణి’ పోర్టల్ పేరిట ప్రపంచంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అతి పెద్ద కుంభకోణానికి పాల్పడిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు....
సూత్రధారి సోమేశ్.. పాత్రధారి కేసీఆర్
100కు పైగా సీట్లు గెల్చుకుంటాం: భట్టి
సూర్యాపేట, ఖమ్మం, జూన్ 25 (ఆంధజ్యోతి): ‘ధరణి’ పోర్టల్ పేరిట ప్రపంచంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అతి పెద్ద కుంభకోణానికి పాల్పడిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా 102వ రోజు ఆదివారం సూర్యాపేటలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘ధరణి’ కుంభకోణంలో మాజీ సీఎస్ సోమేశ్కుమార్ సూత్రధారి కాగా, సీఎం కేసీఆర్ పాత్రధారి అని ఆరోపించారు. రాజకీయ అవసరాలు, ఆర్థిక లావాదేవీల కోసమే ఢిల్లీలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పరస్పరం సహకరించుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు ధనదాహంతోనే కాంగ్రెస్ నాయకులు వలసలు పోతున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని, ఆయన ఓ ఉన్మాది అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకుల జీవితాలను మాత్రమే మార్చారని, ప్రజల ఆకాంక్షలను అపహాస్యం చేశారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 100సీట్లకు పైగా గెలుస్తుందని, కాంగ్రెస్ సునామీ సృష్టించడం ఖాయమన్నారు. ఇటీవల కర్ణాటకలో వచ్చిన ఫలితాలతో కాంగ్రెస్ తుపాన్ మొదలైందని, అది తెలంగాణ నుంచి గెలుచుకుంటూ వెళ్లి ఢిల్లీలో జెండా ఎగురవేస్తుందని నటుడు, నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. సూర్యాపేటలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్కు ఆయన సంఘీభావం తెలిపారు. కాగా, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా భట్టి పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
Updated Date - 2023-06-26T03:59:39+05:30 IST