ఎదురొచ్చిన మృత్యువు!
ABN, First Publish Date - 2023-06-26T03:17:07+05:30
దైవదర్శనానికి వెళ్లిన వారి తిరుగు ప్రయాణం అత్యంత విషాదంగా ముగిసింది! మేడారంలో వనదేవతలను దర్శించుకొని.. కొద్దిసేపు ఆటాపాటలతో సంతోషంగా గడిపి.....
కారును ఎదురుగా ఢీకొన్న టిప్పర్..
అక్కడికక్కడే నలుగురి మృతి
ముగ్గురికి తీవ్ర గాయాలు
బాధితులది ఒకే కుటుంబం
మేడారం వెళ్లి వస్తుండగా ములుగు జిల్లాలో ఘటన
ములుగు జిల్లా ఆత్మకూరులో ఘటన
ఆత్మకూరు, జూన్ 25: దైవదర్శనానికి వెళ్లిన వారి తిరుగు ప్రయాణం అత్యంత విషాదంగా ముగిసింది! మేడారంలో వనదేవతలను దర్శించుకొని.. కొద్దిసేపు ఆటాపాటలతో సంతోషంగా గడిపి.. కారులో ఆ తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఇంటికి బయలుదేరిన ఆ కుటుంబం ఘోర ప్రమాదం బారినపడింది! వారు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబసభ్యులు! ఇంటిపెద్ద.. ఆయన కూతురు, అల్లుడు, మనుమరాలు మృతిచెందడంతో ఆ కుటుంబంలో పెను విషాదం నెలకొంది. హైదరాబాద్ - భూపాలపట్నం హైవేపై ఆత్మకూరు వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వరంగల్ జిల్లా కాశిబుగ్గలోని వీవర్స్ కాలనీకి చెందిన అనుముల నర్సింహస్వామి (52) స్టీల్ సామానుల వ్యాపారం చేస్తున్నారు. ఈయనకు భార్య రాజశ్రీ, కుమార్తెలు ఆకాంక్ష (26), హర్షిత, కుమారుడు ఆకాశ్ ఉన్నారు. ఆకాంక్షను వరంగల్కే చెందిన వెల్దండి సాంబరాజు (40)కు ఇచ్చి వివాహం చేశారు. సాంబరాజు-ఆకాంక్ష దంపతులకు కుమార్తె లక్ష్మీప్రసన్న (6), కుమారుడు అక్షయ్ రాజ్ ఉన్నారు. వీరు ములుగు జిల్లా మేడారం వనదేవతలను దర్శించుకొని, సాయంత్రం కారులో వరంగల్కు తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పత్తిపాక క్రాస్రోడ్డు వద్ద ప్రమాదానికి గురైంది. శాయంపేట మండలం పత్తిపాకలోని స్టోన్ క్రషర్కు చెందిన టిప్పర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. కారు పల్టీలు కొట్టి నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో నర్సింహస్వామి, ఆయన కూతురు ఆకాంక్ష, అల్లుడు సాంబరాజు, మనుమరాలు లక్ష్మీ ప్రసన్న అక్కడికక్కడే మృతిచెందారు. నర్సింహస్వామి భార్య రాజశ్రీ, కూతురు హర్షిత, మనుమడు అక్షయ్ రాజ్కు తీవ్ర గాయాలయ్యాయి. కారు మృతదేహాలు, క్షతగాత్రులు ఇరుక్కుపోవడంతో వారిని అతికష్టమ్మీద బయటకు తీసి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కారులో బెలూన్ తెరుచుకోవడంతో వాహనం నడుపుతున్న నర్సింహరాజు కుమారుడు ఆకాశ్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.
Updated Date - 2023-06-26T03:17:07+05:30 IST