టార్చర్ భరించలేకపోతున్నా..
ABN, First Publish Date - 2023-03-02T02:29:14+05:30
పదో తరగతి 96 శాతం మార్కులతో ఉత్తీర్ణుడైన తమ కుమారుడ్ని ఇంకా బాగా చదివించాలని భావించిన తల్లిదండ్రులు.. ఓ ప్రముఖ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్లో చేర్పించారు. అదే వారి పాలిట శాపమైంది
లెక్చరర్ల వేధింపులతో కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం
అమ్మా నాన్నా.. అన్నయ్యా క్షమించండి
సూసైడ్ నోట్ రాసి తరగతి గదిలోనే ఉరేసుకున్న సాత్విక్
వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
నార్సింగ్లోని కాలేజీ వద్ద ఉద్రిక్తత
కుటుంబం, విద్యార్థి సంఘాల ధర్నా
నార్సింగ్/షాద్నగర్/అఫ్జల్గంజ్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి 96 శాతం మార్కులతో ఉత్తీర్ణుడైన తమ కుమారుడ్ని ఇంకా బాగా చదివించాలని భావించిన తల్లిదండ్రులు.. ఓ ప్రముఖ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్లో చేర్పించారు. అదే వారి పాలిట శాపమైంది. అధ్యాపకుల వేధింపులు తాళలేక ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘కాలేజీలో లెక్చరర్లు పెట్టే టార్చర్ భరించలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని సూసైడ్ నోట్లో రాశాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన నాగుళ్ల రాజు, అలివేలు దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు షాద్నగర్లో ఉంటున్నారు. పెద్ద కుమారుడు మిఽథున్ హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ చేస్తుండగా, చిన్న కుమారుడు సాత్విక్ నార్సింగ్లోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం (ఎంపీసీ) చదువుతున్నాడు. మంగళవారం రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక తరగతులకు హాజరైన తర్వాత విద్యార్థులంతా హాస్టల్కు వెళ్లిపోగా సాత్విక్ గదిలోనే ఉండిపోయాడు. దుస్తులు ఆరేసే తాడుతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. కొద్దిసేపటికే విద్యార్థులు సాత్విక్ రాలేదని, తరగతి గదికి వెళ్లి చూడగా అప్పటికే ఫ్యాన్కు వేలాడుతున్నాడు. కళాశాల సిబ్బంది విద్యార్థులను అక్కడి నుంచి తరిమేసి తరగతి గదిని మూసివేశారు. సాత్విక్ బతికున్నాడని, ఆస్పత్రికి తీసుకెళ్లాలని విద్యార్థులు ఆందోళన చేయడంతో భయపడిన సిబ్బంది తలుపు తెరిచారు. విద్యార్థులంతా సాత్విక్ను మోసుకొని రోడ్డుపైకి వచ్చారు. అక్కడ వేరే వాహనంలో లిఫ్ట్ అడిగి స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే సాత్విక్ మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నార్సింగ్ పోలీసులకు సమాచారం అందించగా సాత్విక్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కళాశాలలో ప్రిన్సిపాల్, ఇతర అధ్యాపకులు, వార్డెన్ తరచూ కొట్టేవారని, దాన్ని తట్టుకోలేకే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు వాపోయారు. తమను నిత్యం కళాశాలలో విపరీతంగా కొడుతున్నారని విద్యార్థులు రోదిస్తూ చెప్పారు. సాత్విక్ తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. సాత్విక్ మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో చివరిసారిగా తండ్రి రాజుతో ఫోన్లో మాట్లాడాడు. తరచు వేధిస్తున్నారని, కొడుతున్నారని ఏడ్చాడని, తాను వచ్చి తీసుకెళతానని ఓదార్చానని ఆయన చెప్పారు. ప్రిన్సిపాల్ ఆచార్య, కృష్ణారెడ్డి, వార్డెన్ నరేశ్పై కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు.
వాళ్లను వదలొద్దు..
సూసైడ్ నోట్లో సాత్విక్ తాను అనుభవించిన వేదనను కళ్లకు కట్టాడు. ‘నన్ను వేధించిన కళాశాల అధ్యాపకులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. మాకు నరకం చూపిస్తున్నారు. వాళ్లను తట్టుకోవడం నా వల్ల కాలేదు. నేను పడే టార్చర్ వేరే వాళ్లకి రాకూడదని కోరుకుంటున్నా. అన్నయ్యా.. అమ్మానాన్నలను బాగా చూసుకో. ఫ్రెండ్స్ నేను మీ అందర్నీ వదిలి వెళ్లిపోతున్నానని బాధపడకండ’ని రాశాడు. సాత్విక్ ఇంటర్ మొదటి సంవత్సరం సెమిస్టర్స్లో 90 శాతానికి పైగా మార్కులు సాధించాడు. అయినా అధ్యాపకులు తనను వేధిస్తున్నారంటూ బాధపడేవాడని స్నేహితులు తెలిపారు. ఎస్ఎ్ఫఐ ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయం, కాలేజీ ఎదుట ధర్నా చేశారు. ర్యాగింగ్పై ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి ట్విటర్లో కోరారు. గురువారం విద్యా సంస్థల బంద్ నిర్వహించాలని ఎన్ఎ్సయూఐ పిలుపునిచ్చింది.
Updated Date - 2023-03-02T02:29:14+05:30 IST