ఓం నమః శివాయ
ABN, First Publish Date - 2023-02-17T23:18:26+05:30
మహాశివరాత్రి పండుగకు శివాలయాలు ముస్తాబయ్యాయి. జిల్లాలోని పలు ఆలయాల్లో శివరాత్రి జాతర మూడు రోజులపాటు జరగనుంది. శనివారం ఉదయం నుంచే భక్తులు గోదావరి స్నానం ఆచరిస్తారు. అందుకు అనుగుణంగా ఘాట్ల వద్ద అధికారులు, ఆలయ కమిటీల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
నస్పూర్, ఫిబ్రవరి 17: మహాశివరాత్రి పండుగకు శివాలయాలు ముస్తాబయ్యాయి. జిల్లాలోని పలు ఆలయాల్లో శివరాత్రి జాతర మూడు రోజులపాటు జరగనుంది. శనివారం ఉదయం నుంచే భక్తులు గోదావరి స్నానం ఆచరిస్తారు. అందుకు అనుగుణంగా ఘాట్ల వద్ద అధికారులు, ఆలయ కమిటీల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. శివపార్వతుల కల్యాణం రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవంగా నిర్వహిస్తారు. మహా శివరాత్రి మాఘమాస బహుళ చతుర్థశి నాడు చంద్రుడు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు శివుడు లింగాకారంగా ఆవిర్భవిం చాడని శివ పురాణం పేర్కొంటుంది. శివ భక్తులు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి పూజలను చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా ఆలయాలల్లో అభిషేకాలు, అర్చనలు, శివలీలాలు, శివ పూజలు, కథపారాయాలు, ఓం నమఃశివాయ అంటూ భక్తులు శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతాయి. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్య ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. లింగాష్టకం, శివ పంచాక్షరి మంత్రాలను జపిస్తారు. దీపారాదన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం నిర్వహించి శివపార్వతుల కల్యాణం జరిపిస్తారు. జిల్లాలోని ఆలయాల్లో శివపార్వతుల కల్యాణం, మహా శివ రాత్రి వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
జిల్లాలో శివరాత్రి ఏర్పాట్లు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని జైపూర్ మండలం వేలాల మల్లికార్జునస్వామి, చెన్నూరు మండలం కత్తెరశాల మల్లన్న స్వామి, బెల్లంపల్లి మండలం బుగ్గ దేవాలయాలు వేడుకలకు సిద్ధమయ్యాయి. మంచిర్యాల పట్టణంలోని విశ్వనాఽథ ఆలయంలో శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. వేలాల, బుగ్గ రాజేశ్వర స్వామి, మంచిర్యాలలోని శివాలయాలను వేలాది మంది భక్తులు దర్శిస్తారు. అలాగే అన్ని మండలాల్లోని ఆలయాలు మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబయ్యాయి.
శివుడు అభిషేక ప్రియుడు
అత్యంత వైభవోపేతంగా నిర్వహించే విశేష పూజలు ఉత్సవాల కంటే అభిషేకం, బిల్వార్చనతోనే ఆది దేవుడు భక్తులకు ప్రసన్నమవుతాడు. మహా శివరాత్రి రోజున ఉపవాసం ఉండి లింగోద్భవ సమయంలో శివలింగానికి భక్తులు జలాభిషేకం బిల్వార్చన నిర్వహిస్తారు. భక్తుల నుంచి విశేష అలంకరణ పూజలను కాకుండా కేవలం జలాభిషేకం, బిల్వదళార్చనను శివుడు ఇష్టపడతాడని పండితులు చెబుతున్నారు. పాలు, పెరుగు, నెయ్యి, చెరుకు రసం, తేనే, నారికేళ జలంతో అభిషేకాలను నిర్వహిస్తారు.
మార్కెట్లో సందడి
మహా శివరాత్రి సందర్భంగా భక్తులు వివిధ రకాల పూజా సామగ్రి కొనుగోళ్ళతో మార్కెట్ కళకళలాడుతుంది. పూజలకు అవసరమైన కొబ్బరి కాయలు, శెనగ, కందగడ్డలు, మోదుగు పూలు, మారేడు ఆకులు, బంతి పూలు, వివిధ రకాల పండ్లు, మొక్కజొన్న, జోన్న కంకులు, మామిడి ఆకులు, తేనే, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, జాగరణ అవసరమైన చిప్ప లు, కుండలు, కొనుగోళ్ళు చేస్తున్నారు.
శివక్షేత్రాలకు 30 బస్సులు
మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ అధికారులు కాళేశ్వరం, వేలాల, కత్తెరశాలకు బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. మంచిర్యాల డిపో నుంచి 30 సర్వీసులను భక్తులను గమ్యస్థానాలకు చేర్చనున్నాయి. మంచిర్యాల, శ్రీరాంపూర్, చెన్నూర్లో కాళేశ్వరం, వేలాల, కత్తెరశాల బస్సుల రాకపోకలకు తాత్కాలిక బస్స్టేషన్లను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సర్వీసులను నడిపిస్తారు. భక్తులు ప్రైవేట్ వాహ నాల్లో వేలాల జాతరకు తరలివస్తారు. ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షిత మని, భక్తుల సౌకర్యార్థం బస్సులను నడిపిస్తున్నట్లు అధికారులు చెప్పా రు. శ్రీరాంపూర్ నుంచి జైపూర్, వేలాలకు పెద్దలకు రూ. 60, పిల్లలకు రూ.35, మంచిర్యాల నుంచి జైపూర్ వేలాలకు రూ. పెద్దలకు 70, పిల్లలకు రూ.40, చెన్నూరు నుంచి క త్తెరశాల-వేలాలకు పెద్దలకు రూ. 70, పిల్లలకు రూ.40, మంచిర్యాల నుంచి చెన్నూరు-కాళేశ్వరానికి పెద్దలకు రూ.120, పిల్లలకు రూ.60, శ్రీరాంపూర్ నుంచి చెన్నూరు-కాళేశ్వరానికి పెద్దలకు రూ.110, పిల్లలకు రూ.60, చెన్నూరు నుంచి సిరొంచ- కాళేశ్వ రానికి పెద్దలకు రూ.70, పిల్లలకు రూ.40 చార్జీలను వసూలు చేస్తారు.
బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయం సందర్శించిన సీపీ
బెల్లంపల్లి రూరల్, ఫిబ్రవరి 17 : మహాశివరాత్రి సందర్బంగా కన్నాల గ్రామ పంచాయతీలోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి సందర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మాసాడి శ్రీదేవి, సర్పంచ్ స్వరూపలు సీపీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శనివారం జరిగే జాతరకు సంబంధించిన ఏర్పాట్ల గురించి డీసీపీ కేకన్ సుధీర్ రాంనాఽథ్, ఏసీపీ పి.సదయ్య, ఎస్ఐ రాజ్ కుమార్ గౌడ్లతో చర్చించారు. సీపీ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా, జాతర సమయంలో ట్రాఫిక్ సమస్య రాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం కమిటీ సభ్యులు ఆమెను సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తాళ్ళగురిజాల ఎస్ఐ రాజశేఖర్, బెల్లంపల్లి 2 టౌన్ ఎస్ఐ ఆంజనేయులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా
జైపూర్, ఫిబ్రవరి 17 : మహాశివరాత్రి సందర్భంగా వేలాల జాతరకు వచ్చే భక్తులు ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా సహకరించాలని, భక్తుల భద్రత దృష్ట్యా 50 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని ఏసీపీ నరేందర్ పేర్కొన్నారు. శుక్రవారం వేలాల జాతరలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏసీపీ, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. జాతర మొత్తం డ్రోన్ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. మహిళల భద్రత కోసం మహిళ పోలీసు సిబ్బందిని, షీటీంలను ఏర్పాటు చేశామన్నారు. రోడ్డుపై వాహనాలను నిలిపితే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. వీఐపీ పార్కింగ్ గుట్ట సమీపంలో ఏర్పాటు చేశామన్నారు. గోదావరితీరం వద్ద ఏర్పాటు చేసిన ఘాట్ల వద్దనే స్నానాలు చేయాలన్నారు. భక్తులు పోలీసులకు సహకరించాలన్నారు. సీఐ రాజు, ఎస్ఐ రామకృష్ణ, మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్, ట్రాఫిక్ సీఐ నరేష్కుమార్, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-02-17T23:18:29+05:30 IST