Kumaram Bheem Asifabad: స్వచ్ఛత దిశగా అడుగులు
ABN, First Publish Date - 2023-09-22T23:01:16+05:30
కాగజ్నగర్, సెప్టెంబరు 22: గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్యాన్ని మెరుగు పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా స్వచ్ఛత కార్యక్రమాలను చేపడుతోంది. స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
-ప్లాస్టిక్ రహిత సమాజం కోసం చర్యలు
-వార్డుల్లో పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తున్న అధికారులు
-కాగజ్నగర్ మున్సిపాలిటీలో స్వచ్ఛతహీ సేవా కార్యక్రమాలు
కాగజ్నగర్, సెప్టెంబరు 22: గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్యాన్ని మెరుగు పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా స్వచ్ఛత కార్యక్రమాలను చేపడుతోంది. స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. గాంధీ జయంతీ సందర్భంగా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాలకు ప్రధాని మోదీ 2021 అక్టోబరు 2న శ్రీకారం చుట్టారు. సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 2వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ప్రధాన కూడళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాలు, పాఠశాలలు, తదితర ప్రదేశాల్లో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. వీటితో పాటు కాల్వల్లో పూడిక తీయటం, కవర్లు తొలగించటం, తడి, పొడి చెత్త వేరు చేసే కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వార్డుల్లో, ఇంటి పరిసరాల్లో పారిశుధ్య పనులు చేపట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం చర్యలు..
మున్సిపాలిటీలో ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్ ఆధ్వర్యంలో కమిషనర్ అంజయ్య, ఆయావార్డుల కౌన్సిలర్లు ముమ్మరంగా అవగాహణ కార్యక్రమాలు చేపడుతున్నారు. నాలుగు రోజుల నుంచి ప్లాస్టిక్ కవర్లు అమ్మకాలు చేయవద్దని వ్యాపారస్తులతో పేర్కొంటున్నారు. ప్లాస్టిక్తో కలిగే నష్టాలపై అందరికీ అవగాహన పరుస్తున్నారు. అలాగే ప్లాస్టిక్ సంచులకు బదులు కాగితం, వస్త్రం, జూట్ సంచులు వినియోగించేలా ప్రజలకు వివరిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో కాగజ్నగర్ మున్సిపాలిటీ మూడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాలను పచ్చదనం, పరిశుభ్రత, పారిశుధ్యంలో ముందడుగు వేసేట్టు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం పూటనే వార్డుల్లో చెత్తను తీసుకెళ్లేందుకు చెత్త బళ్లను ఏర్పాటు చేశారు. వర్షాలు కురుస్తుంటంతో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపడుతున్నారు.
అందరికీ అవగాహన కల్పిస్తున్నాం..
-సద్దాం హుస్సేన్, మున్సిపల్ చైర్మన్, కాగజ్నగర్
కాగజ్నగర్ మున్సిపాలిటీలో స్వచ్ఛత కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. చెత్త ఎత్తివేసేందుకు చెత్తబళ్లను పంపిస్తున్నాం. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కూడా చర్యలు తీసుకుంటున్నాం.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి..
-అంజయ్య, కమిషనర్, కాగజ్నగర్
మున్సిపాలిటీలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాం. వార్డుల్లో నిత్యం పారిశుధ్య పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని అందరికీ అవగాహన కల్పిస్తున్నాం.
Updated Date - 2023-09-22T23:01:16+05:30 IST