Kumaram Bheem Asifabad: కొత్త పోడు రైతులకూ రైతుబంధు
ABN, First Publish Date - 2023-06-26T22:58:39+05:30
ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్) త్వరలో పోడు పట్టాలను అందుకోబోతున్న గిరిజన రైతులకూ రైతుబంధు పెట్టు బడి సాయాన్ని వర్తింపజేయనున్నారు. దీంతో ఈ ఏడాది వానాకాలం సీజన్కు సంబంధించి అదనంగా 15,519 మంది రైతులు ప్రభుత్వ సహాయాన్ని పొందనున్నారు.
- ముఖ్యమంత్రి పర్యటన నాటికి నమోదు పూర్తి
- పనులన్నీ పక్కన పెట్టి నమోదులో బిజీ అయిన వ్యవసాయ అధికారులు
- ఆసిఫాబాద్ జిల్లాలో కొత్తగా 15వేల మంది రైతులకు లబ్ధి
- సోమవారం నుంచి ప్రారంభమైన పెట్టుబడి సాయం
(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్)
త్వరలో పోడు పట్టాలను అందుకోబోతున్న గిరిజన రైతులకూ రైతుబంధు పెట్టు బడి సాయాన్ని వర్తింపజేయనున్నారు. దీంతో ఈ ఏడాది వానాకాలం సీజన్కు సంబంధించి అదనంగా 15,519 మంది రైతులు ప్రభుత్వ సహాయాన్ని పొందనున్నారు. రాష్ట్రంలో ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న పోడుపట్టాల పంపిణీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఓ కొలిక్కి తేవడంతో వారికి కూడా రైతుబంధు వర్తింపజేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈనెల30న ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి రానున్న సీఎం కేసీఆర్ చేతులమీదుగా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న దృష్ట్యా ప్రస్తుతం కొత్తగా పోడు పట్టాలు పొందిన రైతులకు కూడా రైతుబంధు సాయం అందించేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని ఆదేశించిన దరిమిలా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు అన్ని పనులు పక్కనబెట్టి యుద్ధ ప్రాతిపదికపై పోడు రైతుల పేర్ల నమోదు ప్రక్రియను ప్రారంభించారు. పోడు పట్టాలకు సంబంధించి ఇప్పటికే ఓ స్పష్టత రావడంతో ఆ జాబితాలను మండలాల వారీగా మండల పరిషత్ కార్యాలయాలకు పంపించారు. ఈ క్రమంలో సంబంధిత ఎంపీడీవోలు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల వారీగా రైతుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈనెల 30న ముఖ్యమంత్రి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఆలోపే ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వాస్తవానికి ఆసిఫాబాద్ జిల్లాలో ప్రస్తుతం లక్ష మందికి పైగా రైతులు ప్రభుత్వం అందించే పెట్టుబడి సహాయం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారికి అదనంగా మరో 16,400 మంది రైతులు జతకానున్నారు. దీంతో జిల్లాలో ఈ ఏడాది 219కోట్ల 54లక్షల రూపాయల పంట పెట్టుబడి ఆర్థిక సహాయం రైతులకు అందిస్తున్నట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో ఎకరాకు పదివేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం నుంచే రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య ఇదే..
రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పెట్టుబడి సహాయం కింద అందిస్తున్న రైతుబంధు సహాయానికి సంబంధించి ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 1లక్షా 42వేల 596మందికి గాను ప్రతియేటా 203కోట్ల 13లక్షల రూపాయలను రెండు విడతల్లో (వానాకాలం, యాసంగి) ఐదు వేల రూపాయల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈసారి దీనికి అదనంగా 16వేల నాలుగు వందల మంది పోడు పట్టాలు పొందుతున్న గిరిజన రైతులకు కూడా 16కోట్ల40లక్షలు అదనంగా లబ్ధి చేకూరనుంది. మొత్తంగా ఆసిఫాబాద్ జిల్లాలోని లక్ష 42వేల596 మంది రైతులకు ప్రతి సంవత్సరం 219.54కోట్లు పెట్టుబడి సాయం అందనుంది.
Updated Date - 2023-06-26T22:58:39+05:30 IST