రోడ్డు నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు
ABN, First Publish Date - 2023-03-04T22:31:29+05:30
జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టరు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రూ.14 కోట్ల పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చినట్లు స్పష్టంగా తెలు స్తోంది. లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుంచి మేదరివాడ జాతీయ రహదారి వరకు 2.2 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది
మంచిర్యాల, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టరు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రూ.14 కోట్ల పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చినట్లు స్పష్టంగా తెలు స్తోంది. లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుంచి మేదరివాడ జాతీయ రహదారి వరకు 2.2 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. పనులు ఏడాదిగా కొనసాగుతుండగా కాంట్రాక్టరు వ్యవహార శైలిపై ప్రజలు ఆగ్ర హం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. గతంలో తారు రోడ్డు ఉండగా, దాన్ని సీసీ రోడ్డుగా మార్చి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పనులు చేపడుతున్నారు. రెండు కిలోమీటర్ల పొడవుగల బైపాస్ రోడ్డు నిర్మాణానికి తారును ఉప యోగించాల్సి ఉండగా సీసీతో నిర్మించడం విస్మయానికి గురి చేస్తోంది. సీసీ రోడ్డు నిర్మాణం వల్ల అధిక నిధులు, సమయం పడుతోంది. కేవలం కాంట్రాక్టరుకు లాభం చేకూర్చేందుకే డీపీఆర్ సిద్ధం చేశారనే ఆరోపణలున్నాయి.
పనుల్లో నాణ్యత లోపం
సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించడం లేదనే ఆరోపణలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. 2.2 కిలోమీటర్లలో తెలంగాణ తల్లి విగ్రహం వరకు ఇరువైపులా 1.1 కిలోమీటర్ల మేర విభజించి వేర్వేరుగా పనులు చేపడుతున్నారు. బేస్ నుంచి ఒక ఫీటు మందంతో రోడ్డు నిర్మాణం జరు గుతుండగా మూడు పొరల్లో పనులు జరుగుతున్నాయి. తొలుత మట్టిపై 40 ఎంఎం కంకరతో మొదట నిర్మిస్తున్నారు. రహదారి పటిష్టతకు ఇదే ఆధారం. అయితే ఈ పనుల్లోనే నాణ్యతను గాలికి వదిలివేశారు. 40 ఎంఎం కంకరతోపాటు నిర్ణీత కొలతల ప్రకారం సిమెంట్ కలపాల్సి ఉం డగా డస్ట్ను ఉపయోగిస్తున్నారు. అదికూడా పలుచగా వేస్తుండటంతో ఇప్పుడే రోడ్డంతా పగుళ్లు తేలి కంకర కనిపిస్తోంది. కంకర తేలినచోట గులకరాళ్ల లాంటి సన్నటి కంకరతో పూడుస్తున్నారు. ఇది ఎంత మాత్రం నాణ్యతకాదని భవిష్యత్తులో రోడ్డు నిలవదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం అధికారుల దృష్టికి రాకపోగా, క్వాలిటీ కంట్రోల్ సెల్ కూడా పట్టించుకోకపోవడం అనుమానాలకు దారితీస్తోంది.
పాత రోడ్డు తొలగించకుండానే పనులు
తెలంగాణ తల్లి విగ్రహం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు గతంలో సిమెంట్ కాంక్రీట్తో రోడ్డు ఉండేది. రహదారి మంచిగా ఉండ గానే కొన్నేళ్ళ తరువాత దానిపై తారు రోడ్డు నిర్మాణం చేపట్టారు. అనం తరం మొత్తం 2.2 కిలోమీటర్లు తారు రోడ్డుగా మార్చారు. రోడ్డు నాణ్య తతో ఉండగానే తిరిగి సిమెంట్ రోడ్డు నిర్మించాలనే ఆలోచన పాలకులు, అధికారులకు వచ్చింది. మున్సిపాలిటీలో నిధులు ఉండటంతో ఒక ఫీటు మందంతో సీసీ రోడ్డు నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ లభించింది. 2.2 కిలోమీటర్ల మేర ఉన్న తారును తొలగించి, దాని స్థానంలో సీసీ రోడ్డును నిర్మిస్తు న్నారు. ఇందులో భాగంగా రూ.7 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహం నుంచి జడ్పీ కార్యాలయం వరకు దాదాపు 1.1 కిలోమీటర్ల మేర తారును తొల గించి, దాని స్థానంలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టవలసి ఉంది. ప్రస్తుతం ఈ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రాంతంలో తారును తొలగిస్తున్న కొద్దీ దాని కింద గతంలో నిర్మించిన సీసీ రోడ్డు బయట పడింది. బేస్ కోసం ప్రాథమిక స్థాయిలో 40 ఎంఎం కంకర వేయకుం డానే పాత రోడ్డుపైనే మరో వరుస వేసేందుకు రంగం సిద్ధమైంది. ఇలా పాత రోడ్డును కలుపుకొని మొత్తం ఒక ఫీటు మందం చూపించేందుకు కాంట్రాక్టరు వ్యూహరచన చేశారు. పాత సీసీ రోడ్డు ఉన్నందున కాం ట్రాక్టరుకు దాదాపు రూ.3 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. అగ్రిమెంటు సమయంలో పాత సీసీ రోడ్డు ఉందన్న విషయం అధికారుల దృష్టికి రాకుండా ఉంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తూతూ మం త్రంగా పనులు చేపట్టి బిల్లులు లేపేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా, అధికారులు వంతపాడటంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
డివైడర్ల మధ్య బురద మట్టి
బైపాస్ రోడ్డు మధ్యలో నిర్మిస్తున్న డివైడర్ల మధ్య మొక్కలు పెంచాలని నిర్ణయించారు. డివైడర్ల కింద గతంలో నిర్మించిన తారు రోడ్డును తొలగిం చలేదు. కింద తారు రోడ్డు, దానికింద కంకర ఉండటంతో అక్కడ మొక్క లు ఎలా పెరుగుతాయనే సందేహాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ముందుగా తారు తొలగించాల్సిన కాంట్రాక్టరు దానిపైనే మట్టిపోస్తున్నాడు. పైగా మొక్కలు ఏపుగా పెరగాలంటే ఎర్రమట్టిని ఉపయోగించాల్సి ఉం డగా, రోడ్డు నిర్మాణం కోసం తవ్విన మట్టినే డివైడర్ల మధ్యలో పోయడం విమర్శలకు దారితీస్తోంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న మట్టితో చినుకు పడితే రోడ్డంతా బురదమయంగా మారుతుంది. అయినా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా దుబ్బతో కూడిన మట్టిని డివైడర్ల మధ్య నింపుతుండటంతో అది రోడ్డుపైకి చేరి వాహనాల రాకపోకల సమయంలో విపరీతమైన దుమ్ము లేస్తోంది. ఈ విషయమై పలుమార్లు స్థానిక ప్రజలు రాస్తారోకోలు చేపట్టారు. అయినా స్పందించని అధికారులు కాంట్రాక్టరుకే వంతపాడటం గమనార్హం.
Updated Date - 2023-03-04T22:31:29+05:30 IST