మొదలైన సందడి
ABN, First Publish Date - 2023-02-02T01:28:31+05:30
పొలిటికల్ అడ్డాగా పేరున్న జిల్లాపై ప్రస్తుతం అంద రి దృష్టి కేంద్రీకృతమవుతోంది.
నియోజకవర్గాల్లో నేతల పోటాపోటీ కార్యక్రమాలు
ఇప్పటి నుంచే మొదలైన టికెట్ల వేట
బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లలో మొదలైన సందడి
అధికార పార్టీ లక్ష్యంగా ప్రతిపక్షాల ఫైర్
ఎదురుదాడితో దూకుడుగా బీఆర్ఎస్
నిర్మల్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : పొలిటికల్ అడ్డాగా పేరున్న జిల్లాపై ప్రస్తుతం అంద రి దృష్టి కేంద్రీకృతమవుతోంది. ఇక్కడి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ కార్యకలాపాలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చన్న సంకేతాలు కనిపిస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ తమ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలుకొని టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల్లో జిల్లా నాయకులు కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్ హయాంలో పి. నర్సారెడ్డి, గంగారెడ్డిలు మంత్రి పదవులు నిర్వహించారు. అలాగే టీడీపీ హయాంలో వేణుగోపాలచారి రాష్ట్ర మంత్రిగా, అలాగే ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అల్లోల ఇంద్రకరణ్రెడ్డి రెండుసార్లు మంత్రిగా పదవి చేపట్టారు. ఉమ్మడి జిల్లాగా కొనసాగిన సమయంలో కూడా ఇక్కడి నాయకులే ఎక్కువగా ఎంపీ పదవులు, జడ్పీ చైర్మన్ పదవులను చేపట్టారు. ఇలా మొదటి నుంచి నిర్మల్ ప్రాంతం ఉమ్మడి జిల్లా రాజకీయాలను పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని కొనసాగించింది. కాగా ప్రస్తుతం జిల్లాలో మూడు పార్టీలు తమ భవిష్యత్ను తేల్చుకునేందు కోసం ఇప్పటి నుంచే పోటీకి సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా అఽధికారిక రాజకీయాలతో కార్యక్రమాలతో బీఆర్ఎస్ పార్టీ దూకుడు కొనసాగిస్తుండగా, కొంతకాలం నుంచి బీజేపీ బీఆర్ఎస్ పార్టీని బలంగా ఢీకొంటూ పోటీ కార్యకలాపాలను సాగిస్తోంది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్ పాదయాత్ర జిల్లాలో పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచే బీజేపీ మరింత దూసుకుపోయేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం అధికార బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య నువ్వానేనా అన్న రీతిలో హోరాహోరీగా పోటాపోటీ కార్యక్రమాలతో ముందుకు కొనసాగుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ మూడు నియోజకవర్గాల్లో ఆశించినంతగా ముందుకు సాగడం లేదు. ఆడపాదడపా చిన్నా,చితక కార్యక్రమాలు చేపట్టడానికే ఆ పార్టీ పరిమితమైందంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడి పేరును సైతం అధిష్టానం అధికారికంగా వెల్లడించలేకపోయిందన్న వాదనలున్నాయి. అయితే ఒక్క నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటీ మహేశ్వర్రెడ్డి తనదైన శైలిలో కార్యకలాపాలు చేపడుతూ కేడర్కు కొంత భరోసా కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్, బీజేపీలకు ప్రధానప్రత్యర్థిగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మరే ఇతర నాయకులు టికెట్ను ఆశించే అవకాశం గాని అలాంటి పరిస్థితి గాని లేకపోవడంతో ఒకవేళ మహేశ్వర్రెడ్డి అదే పార్టీలో కొనసాగితే టికెట్ ఆయనకే ఖాయమంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ప్రస్తుత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పోటీ చేయడం ఖాయమంటున్నారు. అయితే నిర్మల్ నియోజకవర్గంలో మాత్రం బీజేపీ నుంచి ముగ్గురు నలుగురు నాయకులు టికెట్ను ఆశిస్తున్నారు.
ఫ నియోజకవర్గాల్లో పటిష్టం దిశగా బీజేపీ..
నిర్మల్తో పాటు ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఈ సారి ఎలాగైనా గెలవాలని బీజేపీ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పర్యటనను ఈ మూడు నియోజకవర్గ కేంద్రాల్లో కొనసాగించారు. అప్పటి నుంచి ఊపు మీదున్న ఆ పార్టీ కేడర్ ఇక ఎన్నికల వైపు దృష్టి కేంద్రీకరించింది. బూత్స్థాయి నుంచి ఆపార్టీని మరింత పటిష్టం చేసే దిశగా కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ పార్టీ నుంచి ఈ సారి మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, డాక్టర్ సెల్బాధ్యులు డాక్టర్ మల్లికార్జున్రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, అయ్యన్న గారి భూమయ్యలు టికెట్ను ఆశించే వారిలో ఉన్నారు. దీంతో పాటు ఓ ప్రధాన పార్టీకి చెందిన అగ్ర నాయకులు ఒకరు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడమే కాకుండా ఆ పార్టీ తరపున పోటీ కూడా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు గత కొద్దిరోజుల నుంచి ప్రచారం సాగుతోంది. అలాగే ముథోల్ నియోజకవర్గంలో మాత్రం బీజేపీ పార్టీ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొనబోతోంది. ఇటీవల డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రామారావుపటేల్, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్రావు పటేల్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవిలు ఈ సారి టికెట్ కోసం ఆశిస్తున్నారు. వీరంతా ఇప్పటి నుంచే పోటాపోటీ కార్యక్రమాలు కొనసాగిస్తూ తమ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, పెంబీ జడ్పీటీసీ సభ్యురాలు జానకీబాయితో పాటు హరినాయక్, సట్ల అశోక్లు ఈసారి పార్టీ టికెట్ను సీరియస్గా ఆశిస్తున్నారు.
బీఆర్ఎస్లో అసంతృప్తి సెగలు
ఒక్క నిర్మల్ నియోజకవర్గంలో మినహా ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన అసంతృప్తిని ఎదుర్కొంటోంది. ముథోల్ నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే విఠల్రెడ్డిపై మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారి వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. వేణుగోపాల చారికి ఇటీవల ఐడీసీ కార్పోరేషన్ చైర్మన్ పదవి దక్కడంతో ఆయన మళ్లీ ఈ నియోజకవర్గంలో తన కార్యకలాపాలను ముమ్మరం చేసే అవకాశాలున్నాయి. దీంతో పాటు రాబోయే ఎన్నికల్లో ఆయన పార్టీ టికెట్ను ఆశించే అవకాశాలున్నాయంటున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ఈ సారి చాలా మంది పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం మొదలైంది. ప్రస్తుత ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్తో పాటు అవకాశం వస్తే ఆమె భర్త శ్యాం నాయక్ అలాగే హైదరాబాద్కు చెందిన ఓ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ఎంపీ సంతోష్కుమార్కు సమీప అనుచరునిగా కొనసాగుతున్న ఇక్కడి నేత ఒకరు కూడా ఈ సారి బీఆర్ఎస్ టికెట్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు ప్రచారం మొదలైంది. మొత్తానికి ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఈ సారి బీఆర్ఎస్ పార్టీకి ఆసమ్మతి తప్పకపోవచ్చంటున్నారు.
నిస్తేజంలో కాంగ్రెస్
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ సారి ఎలాగైనా ఎదురీత తప్పదంటున్నారు. నిర్మల్లో మా త్రం ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటీ మహేశ్వర్రెడ్డి వన్మ్యాన్ షో తో పార్టీని ముందుకు తీసుకువెళుతూ కేడర్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయ న బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ధీటుగా కార్యక్రమాలు కొనసాగిస్తున్నప్పటికీ నియోజకవర్గంలోని చాలా మండలాల్లో కాంగ్రెస్ కేడర్ చేజారిపోయిన కారణంగా పార్టీని పునర్ నిర్మాణం చేయడం ఆయనకు సవాల్గా మారనుంది. ప్రస్తుతం ఆయన ఒక్కరే అంతా తానై వ్యవహరిస్తున్నారు. ముథోల్ నియోజకవర్గంలో మాత్రం ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో నాయకత్వం లేకపోవడం పెద్ద లోటుగా చెబుతున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు కూడా నాయకు లు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో మాత్రం ఒకరిద్దరు నాయకులు ఈ సారి కాంగ్రెస్ టికెట్ను ఆశిస్తున్నప్పటికీ వారు ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ పార్టీలకు ధీటుగా నిలబౄడలేకపోవచ్చంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ రాబో యే ఎన్నికల్లో పోటీ చేయనున్నప్పటికి బీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా నిలిచేందుకు మరింతగా శ్రమించాల్సి వస్తుందంటున్నారు.
Updated Date - 2023-02-02T01:28:33+05:30 IST