ALCHOLE : ఆబ్కారీ మందుచూపు
ABN, First Publish Date - 2023-08-26T03:37:01+05:30
మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం పెంచుకోవాలన్న గట్టి నిర్ణయంతో ఉన్న ప్రభుత్వ తీరుకు అనుగుణంగానే ఎక్సైజ్ శాఖ నిర్ణయాలు తీసుకుంటోంది.
సాధ్యమైనంత ఎక్కువగా మద్యాన్ని కొనిపించండి!
సెప్టెంబరు 15-18 మధ్య అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
అప్పుడు సరఫరాపై రకరకాల నిబంధనలుంటాయి
దుకాణాల వారు ఇప్పుడే ఎక్కువ కొనేలా చూడండి
ఎస్హెచ్వోలు, ఎస్సైలకు ఉన్నతాధికారుల సందేశం
పాత షాపుల ద్వారా ఎక్కువ ఆదాయం రాబట్టే ప్లాన్
‘‘ఎన్నికలొస్తున్నాయ్..! మద్యం స్టాక్ కావాలేమో మీరే నేరుగా అడగండి.. ఇప్పుడే సాధ్యమైనంత ఎక్కువగా సరుకు కొనేలా చూడండి.. ఎన్నికల షెడ్యూల్ వెలువడితే సరఫరాలో కొన్ని నిబంధనలు అడ్డొస్తాయి. అందుకే వైన్ షాపుల యజమానులకు అవగాహన కల్పించండి’’
- ఆబ్కారీ సిబ్బందికి ఉన్నతాధికారుల సందేశం
హైదరాబాద్, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం పెంచుకోవాలన్న గట్టి నిర్ణయంతో ఉన్న ప్రభుత్వ తీరుకు అనుగుణంగానే ఎక్సైజ్ శాఖ నిర్ణయాలు తీసుకుంటోంది. మరో 20 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని.. అదే జరిగితే లేనిపోని నిబంధనలు విధించాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడే సాధ్యమైనంత ఎక్కువ కొనిపించాలనేది వారి ఉద్దేశం. ఈ మేరకు కింది అధికారులకు శుక్రవారం ఫోన్ మెసేజ్లు పంపడం గమనార్హం. వాస్తవానికి ఎన్నికల సమయంలో ఎలాగూ మద్యం విక్రయాలు జోరుగా ఉంటాయి. అయితే, అప్పటి ఆదాయం అప్పటిదే. ఎన్నికలకు ముందే సాధ్యమైనంత ఎక్కువ రాబడి సాధించాలన్నది ఎక్సైజ్ శాఖ ఉద్దేశంగా స్పష్టమవుతోంది. అందుకే మెసేజ్లు పెట్టి ఎక్కువ మద్యం కొనేలా ప్రేరేపిస్తోంది.
సెప్టెంబరు 15-18 మధ్య ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూలు వెలువడే అవకాశముందని స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు (ఎస్హెచ్వో), సబ్ ఇన్స్పెక్టర్లకు ఉన్నతాధికారులు మెసేజ్లు పెట్టారు. షెడ్యూల్ వెలువడి, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మద్యం సరఫరాకు సంబంధించి రకరకాల నిబంధనలు అమల్లోకి వస్తాయని అందులో తెలిపారు. డిపోల నుంచి వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, క్లబ్బులకు సరఫరా చేయడంలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయని, కోరినంత సరఫరా చేసే అవకాశాలు ఉండకపోవచ్చని వివరించారు. ఇటీవల కొత్త మద్యం దుకాణాలకు టెండర్లు పిలిచి.. ఒక్కో దరఖాస్తును రూ.2 లక్షలకు విక్రయించారు. ఆ సమయంలోనూ ఎక్కువ రాబడి ఉద్దేశంతో అధిక సంఖ్యలో దరఖాస్తులు అమ్మేలా క్షేత్రస్థాయి అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. 20 దరఖాస్తుల కంటే తక్కువ వస్తే సంబంధిత దుకాణానికి లక్కీ డ్రా తీసేది లేదంటూ సరికొత్త నిబంధన పెట్టి హెచ్చరికలు కూడా పంపారు. గత్యంతరం లేక ఎక్సైజ్ అధికారులు.. బాబ్బాబు దరఖాస్తు చేయండి అంటూ కిరాణం, పాన్ డబ్బాలు, బెల్ట్ షాపుల వారితో సమావేశాలు నిర్వహించారు. అలా రాష్ట్రవ్యాప్తంగా 1,31,490 దరఖాస్తులు అమ్ముడయి ప్రభుత్వానికి ఏకంగా రూ.2,629 కోట్లు సమకూరాయి.
ముందే పిండుకుందాం..
దరఖాస్తు తంతు ముగియడంతో ఎక్సైజ్ శాఖ తాజాగా మరో కొత్త ట్రిక్కును ముందుకు తెచ్చింది. ‘‘షెడ్యూల్ రాకముందే సాధ్యమైనంత ఎక్కువ మద్యం కొనిపించి, నిల్వ చేసుకునేలా చూడండి’’ అంటూ అధికారులను ఆదేశించింది. అంటే ఈ రకంగానూ ఎక్కువ మొత్తంలో మద్యం అమ్మి, ఆదాయం గుంజాలన్నది వ్యూహమని తెలుస్తోంది. కాగా, నవంబరు 30తో ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్సు గడువు ముగుస్తుంది. డిసెంబరు 1 నుంచి కొత్త దుకాణాలు వస్తాయి. ఆలోగానే పాత షాపుల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ ఆదాయం పిండుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Updated Date - 2023-08-26T03:37:01+05:30 IST