హెచ్సీఏ అధ్యక్షుడిగా మళ్లీ పోటీ చేస్తా
ABN, First Publish Date - 2023-08-02T04:47:43+05:30
మరోసారి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్టు భారత జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ ప్రకటించాడు.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): మరోసారి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్టు భారత జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ ప్రకటించాడు. 2019లో హెచ్సీఏ అధ్యక్షుడిగా భారీ మెజారిటీతో గెలిచిన అజర్, ఆ తర్వాత పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారి విమర్శల పాలయ్యాడు. తాజాగా హెచ్సీఏ అడ్మినిస్ట్రేటర్, రిటైర్డ్ జస్టిస్ లావు నాగేశ్వరరావు 57 క్లబ్లపై కొరడా ఝుళిపించిన మరుసటి రోజే తాను రెండోసారి ఎన్నికల బరిలో దిగుతున్నానని అజరుద్దీన్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మరోసారి హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైతే అవినీతిని పూర్తిగా రూపు మాపుతానని అజర్ చెప్పాడు. ‘హెచ్సీఏ అడ్మినిస్ట్రేటర్ క్లబ్లపై తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నా. గత నాలుగేళ్లలో కొన్ని దుష్ట శక్తులు నన్ను పని చేయనివ్వలేదు. ఇప్పుడు అసోసియేషన్లో ప్రక్షాళన జరిగింది. అంతర్జాతీయ మాజీ క్రికెటర్ హోదాలో మరోసారి పోటీ చేస్తా. నా గత నాలుగేళ్ల పదవీకాలంలో రెండేళ్లు కోర్టు కేసులతోనే వృధా అయింది. ఈసారి గెలిస్తే పూర్తిగా క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తా’ అని అజరుద్దీన్ తెలిపాడు.
Updated Date - 2023-08-02T04:47:43+05:30 IST