మా అమ్మ అస్సలు నిద్ర లేవడం లేదు.. ఆకలేస్తోందంటూ ఏడుస్తూ చెప్పిన ఆరేళ్ల బాలుడు.. ఏమైందా అని పక్కింటి వాళ్లు వెళ్లి చూస్తే..
ABN, First Publish Date - 2023-03-06T20:54:44+05:30
కీలకంగా మారిన బాలుడి సాక్ష్యం.. తండ్రికి యావజ్జీవ కారాగార శిక్ష.. అసలేం జరిగిందంటే..
ఇంటర్నెట్ డెస్క్: ఆ బాలుడు ఎప్పటిలాగే నిద్ర లేచాడు. పక్కనే ఉన్న తల్లిని నిద్రలేపే ప్రయత్నం చేశాడు. ఆమెను ఎంత కదిపినా లేవలేదు. అలాగే అచేతనంగా పడి ఉంది. బాలుడు చివరకు పక్కింటికి వెళ్లాడు. తల్లిని ఎంత లేపినా లేవట్లేదని చెప్పాడు. తనకు ఆకలేస్తోందని ఏమైనా పెట్టమని అడిగాడు. దీంతో.. ఏం జరిగిందోనని పక్కింటి వాళ్లు బాలుడి ఇంట్లోకి వేళ్లి చూడగా ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలుడి తల్లి హత్యకు గురయిందని తెలిసి వారు షాకైపోయారు.
మధ్యప్రదేశ్లోని(Madhya pradesh) గునా జిల్లాలో(Guna) జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. శైతన్ సింగ్కు 10 ఏళ్ల క్రితం ప్రీతీ లోధా అనే మహిళతో వివాహం జరిగింది. వారికి ఆరేళ్ల వయసున్న ఓ బాబు ఉన్నాడు. అయితే.. ఇటీవల కాలంలో శైతన్కు తన భార్య ప్రవర్తన పట్ల అనుమానం పెరిగింది. ఈ క్రమంలోనే దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. చివరకు అతడు గతేడాది అక్టోబర్లో ఆమెను దారుణంగా హత్య చేశాడు. అతడు భార్యను చంపుతుండగా(Husband kills wife over suspicion) వారి కొడుకు కళ్లారా చూశాడు. కానీ.. ఆ చిన్నారికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. తండ్రి తల్లిని చంపివెళ్లిపోయాక బాలుడు ఆమె పక్కనే నిద్రపోయాడు. తెల్లారి తల్లి ఎంతకీ లేవకపోవడంతో ఆహారం కోసం పక్కింటివారి వద్దకు వెళ్లాడు.
ఇదిలా ఉంటే.. భార్యను చంపిన శైతన్ సింగ్ కంగారుగా గ్రామాన్ని వదిలి వెళ్లిపోతూ పరిచయస్తుల కంటపడ్డాడు. దీంతో..కీడును శంకించిన వారు అతడి ఇంటికి వెళ్లి చూస్తే జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. చివరకు విషయం కోర్టుకు చేరింది. ఇక తండ్రికి శిక్ష పడటంలో బాలుడి సాక్ష్యం కీలకంగా మారింది. ఆ రాత్రి ఏం జరిగిందో అతడు కోర్టులో కళ్లకు కట్టినట్టు వివరించాడు. తండ్రి తరపు లాయర్లు ఎన్ని ప్రశ్నలు అడిగినా తడుముకోకుండా సమాధానం చెప్పాడు. తాను చూసింది చూసినట్టు వివరించడం మినహా ఆ బాలుడు తడబడలేదు, మాటమార్చలేదు. దీంతో.. కోర్టు అతడి వాంగ్మూలాన్ని అనుసరించి శైతన్ సింగ్కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మర్చి 1న తీర్పు వెలువరించింది.
Updated Date - 2023-03-06T20:59:12+05:30 IST