బావిలోంచి భరించలేనంత దుర్వాసన.. కుక్కో ఎలుకో చచ్చి ఉంటుందనుకున్నారు.. కానీ బావిలోంచి పోలీసులు ఏం తీశారో చూసి..
ABN, First Publish Date - 2023-02-21T16:46:13+05:30
బావిలోంచి ఎప్పుడూ లేనంత దుర్వాసన. పోలీసులు బావిలోంచి బయటకు ఏం తీశారో చూసీ గ్రామస్థులందరూ షాక్..
ఎన్నారై డెస్క్: రహదారి పక్కనే ఓ పాడుబడ్డ బావి. ఎప్పుడూ లేనిది అందులోంచి భరించలేనంత దుర్వాసన. తొలుత అది ఏ కుక్కో ఎలుకో చచ్చి ఉంటుందని గ్రామస్థులు అనుకున్నారు. కానీ.. రాను రాను అదోరకమైన వాసన వెలువడుతుండటంతో గ్రామస్థులకు అనుమానమొచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు బావిలోంచి ఓ వ్యక్తి శవాన్ని వెలికి తీయడంతో వారంతా ఒక్కసారిగా షాకైపోయారు. రాజస్థాన్లో(Rajasthan) వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలానికి దారి తీసింది.
జయ్పూర్లోని(Jaipur) దయానంద్ నగర్కు చెందిన రాకేశ్ బైర్వా(37) ఓ బిల్డింగ్ కాంట్రాక్టర్. రామ్నగరియా ప్రాంతంలో ఆయన ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 8న ఆయన పనులు పర్యవేక్షించేందుకు అక్కడికి వెళ్లారు. రాత్రి 7 ఏడు గంటలకు పని ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. అయితే.. రాత్రి పొద్దుపోయినా ఆయన తిరిగి రాకపోవడంతో(Missing) కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. తమకు తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులకు రాకేశ్.. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతానికి పలు మార్లు వచ్చి వెళ్లినట్టు గుర్తించారు. ఈ ఫుజేజీ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా వారికి శిష్యవాస్ గ్రామస్థుల నుంచి ఫిర్యాదు అందింది.
బావిలోంచి ఎన్నడూ లేనంత దుర్వాసన వస్తోందన్న ఫిర్యాదుపై పరిశీలన చేపట్టేందుకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు రాకేశ్ మృతదేహం కనిపించింది. హెల్మెట్ అతడి తలకు పెట్టే ఉంది. అతడి బైక్ కూడా బావిలోనే లభించింది. ఇక పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం నివేదిక అనంతరం..రాకేశ్ భౌతికకాయాన్ని బంధువులకు అప్పగించారు. అతడు ప్రమాదవశాత్తూ బావిలో పడి మరణించి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే.. హత్య జరిగుండొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Updated Date - 2023-02-21T17:22:17+05:30 IST