NRI: కరోనాతో బాధపడుతూ తోటి ఉద్యోగుల వద్ద దగ్గిన ఎన్నారైకి జైలు శిక్ష
ABN, First Publish Date - 2023-09-19T22:23:00+05:30
కరోనాతో బాధపడుతూ కూడా సహచర ఉద్యోగుల వద్ద మాస్కు తీసి మరీ దగ్గిన నేరానికి గాను సింగపూర్లోని ఓ ఎన్నారైకి జైలు శిక్ష పడింది.
ఎన్నారై డెస్క్: కరోనాతో బాధపడుతూ కూడా సహచర ఉద్యోగుల వద్ద మాస్కు తీసి మరీ దగ్గిన నేరానికి గాను సింగపూర్లోని ఓ ఎన్నారైకి జైలు శిక్ష పడింది. 2021 నాటి కేసులో కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. నిందితుడు తమిళసెల్వం రామయ తనకు కరోనా ఉందని తెలిసీ కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ న్యాయస్థానం రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది(NRI jailed for coughing on collegues after testing covid positive).
స్థానిక మీడియా కథనాల ప్రకారం, తమిళసెల్వం స్థానిక లియాంగ్ హుప్ సంస్థలో క్లీనర్గా చేసేవాడు. 2021లో ఓ రోజు తనకు ఒంట్లో బాలేదని తన మేనేజర్కు చెప్పాడు. వెంటనే సహోద్యోగులు అతడికి ర్యాపిడ్ కోవిడ్ పరీక్ష జరపగా పాజిటివ్ అని తేలింది. దీంతో, ఇంట్లో ఉండాలంటూ మేనేజర్ తమిళసెల్వంకు సూచించారు. ఈ విషయాన్ని మరో ఉన్నతాధికారికి కూడా తెలియజేయాలని సూచించాడు.
ఈ క్రమంలో సదరు ఉన్నతాధికారి ఉండే కార్యాలయానికి తమిళసెల్వం వెళ్లగా వారు అతడిని కార్యాలయం బయటే ఉండాలంటూ హడావుడి చేశారు. దీంతో, తమిళసెల్వం వారిపై మాస్కు తీసి దగ్గాడు, ఆ తరువాత పక్కనే మరో క్యాబిన్లోని మహిళ ఉద్యోగిపై కూడా దగ్గాడు. దీంతో, వారు పోలీసులకు ఫిర్యాుదు చేశారు. అదృష్టవశాత్తూ వారెవరూ కరోనా బారిన పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
కాగా, తమిళసెల్వం చివరకు తను చేసిన తప్పును అంగీకరించాడు. ర్యాపిడ్ టెస్టును తాను పెద్దగా పట్టించుకోలేదని, ఆ తరువాత మరో చోటకు వెళ్లి టెస్టు చేయించుకున్న విషయాన్ని చెప్పాడు. అయితే, కరోనా నిబంధనలపై పరిహాసాలాడటం పద్ధతి కాదని చెప్పిన న్యాయస్థానం నిందితుడికి రెండు వారాలా కారాగార శిక్ష విధించింది.
Updated Date - 2023-09-19T22:27:41+05:30 IST