Self realization : ఆత్మ సాక్షాత్కారం
ABN, First Publish Date - 2023-04-20T23:56:22+05:30
ఆత్మ సాక్షాత్కారం అనేది మూఢనమ్మకమో, అంధవిశ్వాసమో కాదు. అదొక స్వీయ అనుభూతి. స్థిరమైన అనుభవం. పరమ చైతన్య శక్తితో మనలోని కుండలినీ శక్తి అనుసంధానం కావడం వల్ల...
ఆత్మ సాక్షాత్కారం అనేది మూఢనమ్మకమో, అంధవిశ్వాసమో కాదు. అదొక స్వీయ అనుభూతి. స్థిరమైన అనుభవం. పరమ చైతన్య శక్తితో మనలోని కుండలినీ శక్తి అనుసంధానం కావడం వల్ల... అనంతమైన దైవశక్తులు అనుభవంలోకి వస్తాయి. తద్వారా మన అజ్ఞానం తొలగిపోతుంది. మానవుడు ఆత్మ జ్ఞానిగా, బ్రహ్మ జ్ఞానిగా మారుతాడు. ఇదే ఆత్మ సాక్షాత్కారం పరమార్థం. ‘ఆత్మ సాక్షాత్కారం మానవుని జన్మహక్కు’ అంటారు శ్రీ మాతాజీ నిర్మలాదేవి. పూర్వకాలంలో చేసినట్టు... హిమాలయాలకో, అడవులకో వెళ్ళనవసరం లేకుండా, తమతమ సాంసారిక బాధ్యతలు, సాంఘికమైన విధులు నిర్వర్తిస్తూనే ఆత్మ సాక్షాత్కారం పొందే ప్రక్రియను ఆమె కనుగొన్నారు. ప్రశాంతమైన చోట కూర్చొని... నిస్సంకోచంగా, హృదయపూర్వకంగా శుద్ధ ఇచ్ఛాశక్తితో ధ్యానం చేసినా చాలు... ఆ అనుభూతి మీ సహస్రార చక్రంలో ప్రవేశిస్తున్నప్పుడు... అప్రయత్నంగా మీ ఆలోచనలు నిలిచిపోతాయి. దీన్ని ‘నిర్విచార స్థితి’ అంటారు. ఈ స్థితిలో... సాధకుడి అరచేతులలో కానీ, తల మాడుపైన కానీ చల్లని వాయుతరంగాల అనుభూతి కలుగుతుంది. అది మనలోనే సంభవించే ఆత్మ సాక్షాత్కార అనుభవం. కొందరిలో అరచేతులు, వేళ్ళ కొనలు బరువెక్కినట్టు, తిమ్మిరెక్కినట్టు అనుభూతి ఉంటుంది. అది కూడా మనలోని కుండలినీ శక్తి జాగృతమైనట్టు నిర్ధారించే అంశమే. ఇది సత్యం. ఇదే ఆత్మజ్ఞానం. మనలోని కుండలినీ శక్తే మన తల్లి. అన్ని జన్మలలోనూ ఆమె మనతోనే ఉంటూ. జాగృతమయ్యే సదవకాశం కోసం ఎదురుచూస్తోంది.
స్త్రీలు, పురుషులు, పిల్లలు, అన్ని వర్ణాలు, జాతులవారు... ఎవరైనా సహజయోగ సాధన చేయవచ్చు. ఆత్మ సాక్షాత్కార అనుభూతి పొందవచ్చు. దీనికి కావలసిందల్లా దాన్ని పొందాలనే శుద్ధమైన కోరిక మాత్రమే. అన్ని మతాలకు చెందిన జ్ఞానమూర్తులు, అవతార పురుషులు... ఆత్మ సాక్షాత్కారం ద్వారా పొందే ఆధ్యాత్మిక జీవనమే గొప్పదని అని చెప్పారు. ‘యోగ క్షేమం వహామ్యహం’ అని భగవద్గీతలో అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎల్లప్పుడూ భగవంతుని ధ్యానంలో నిమగ్నమయినవారి యోగ క్షేమాలు ఆయనే వహిస్తాడనీ, యోగం ద్వారా భగవంతుణ్ణి చేరినప్పుడే ఈ క్షేమం కలుగుతుందనీ దీని అంతరార్థం. సర్వవ్యాప్తుడైన భగవంతుడి శక్తితో కలయిక అనేది సహజయోగం ద్వారానే సిద్ధిస్తుంది. లలితా సహస్ర నామావళిలో పొందుపరచిన మంత్రాల సారాంశం... కుండలినీ జాగృతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందడమే. శ్రీ ఆదిశంకరులు రచించిన ‘సౌందర్య లహరి’లో, ‘ఆత్మాష్టకం’లో కూడా ఈ విషయం వివరంగా వెల్లడించారు. సాధారణంగా మనం ఎల్లప్పుడూ గతానికి సంబంధించిన విషయాలనూ, భవిష్యత్ ప్రణాళికలనూ ఆలోచిస్తూ ఉంటాం. శారీరకంగా, మానసికంగా సమతుల్యత లోపించడం వల్ల ఎల్లప్పుడూ ఒత్తిడికీ, శ్రమకూ గురి అవుతూ ఉంటాం. సహజ యోగంలో కుండలినీ జాగృతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందితే... అది మనల్ని ఎల్లప్పుడూ వర్తమానంలో ఉంచుతుంది. మనం సమతుల్యతతో ఉండడం జరుగుతుంది. ఆ స్థితిని పొందడాన్ని ‘ఆధ్యాత్మిక పరివర్తన’ అని చెప్పుకోవచ్చు.
Updated Date - 2023-04-20T23:56:22+05:30 IST