Uddhav Thackeray: ఎన్నికల కమిషన్ను రద్దుచేయాలి
ABN, First Publish Date - 2023-02-21T03:50:13+05:30
శివసేన ఉద్ధవ్-బాలాసాహెబ్ ఠాక్రే (యూబీటీ) వర్గం అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ)పైన, బీజేపీపైన విరుచుకుపడ్డారు.
మా పార్టీ పేరు, చిహ్నాన్ని తస్కరించారు.. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసింది
ఇలాగైతే 2024 తర్వాత దేశంలో ఎన్నికలే ఉండవు: ఉద్ధవ్
ఈసీ నిర్ణయంపై సుప్రీం కోర్టులో పిటిషన్
అత్యవసర విచారణకు కోర్టు నిరాకరణ
ముంబై/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: శివసేన ఉద్ధవ్-బాలాసాహెబ్ ఠాక్రే (యూబీటీ) వర్గం అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ)పైన, బీజేపీపైన విరుచుకుపడ్డారు. శివసేన పేరును, ఎన్నికల చిహ్నమైన ధనస్సు,-బాణాన్ని సీఎం ఏక్నాథ్ శిందే వర్గానికి కేటాయిస్తూ గత శుక్రవారం నిర్ణయం వెలువరించడాన్ని తప్పుబట్టారు. తక్షణమే ఈసీని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఈసీ నిర్ణయంపై అత్యవసర విచారణకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించిన తర్వాత ఆయన ముంబై శివసేన భవన్లో తన సన్నిహితులు సంజయ్ రౌత్, అనిల్ దేశాయ్, సుభాష్ దేశాయ్, అనిల్ పరబ్, జిల్లా నేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. భావి కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఉద్ధవ్ మీడియాతో మాట్లాడారు. ‘శిందే వర్గానిదే అసలైన శివసేన అంటూ హడావుడిగా ఈసీ నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది? గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఓ వర్గానికి నేరుగా పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ఇచ్చిన సందర్భం మునుపెన్నడూ లేదు. ఈసీ నిర్ణయం తప్పు. ఈ అంశంలో మా చివరి ఆశలన్నీ సుప్రీంకోర్టుపైనే. మా పార్టీ పేరు, చిహ్నాన్ని తస్కరించగలరేమో.. కానీ ఠాక్రే పేరును దొంగిలించలేరు’ అని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామిక సంస్థల సాయంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నాశనం చేస్తోందని ఆరోపించారు. ఇవాళ తమకు చేసిందే.. రేపు ఎవరికైనా చేయొచ్చన్నారు. ఇదే కొనసాగితే 2024 తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం గానీ, ఎన్నికలు గానీ ఉండవని చెప్పారు. తన వర్గం శివసేన అధికారిక బ్యాంకు ఖాతాల నుంచి నిధులు బదిలీచేస్తోందన్న వార్తలను ప్రస్తావించగా.. పార్టీ నిధుల గురించి మాట్లాడే హక్కు ఈసీకి లేదన్నారు. అది సుల్తాన్లా వ్యవహరించరాదని.. పార్టీ నిధుల పంపిణీ ఊసెత్తితే క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించారు. సుపారీ ఇచ్చి శివసేనను అంతమొందించాలని శిందే వర్గం యత్నిస్తోందని ఆరోపించారు. ఏ పరిస్థితుల్లోనూ బీజేపీ కాళ్లు నాకబోమన్నారు. శివసేనకు ఇది సంక్లిష్ట సమయమని.. కోర్టుల్లోనే గాక వీధుల్లోనూ పోరాడతామని చెప్పారు.
ఉత్తర్వులివ్వడానికి సుప్రీం నో
శిందే వర్గమే అసలైన అధికారిక శివసేన అని ఈసీ నిర్ణయించడాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సోమవారం ఈ అంశాన్ని దాని తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించగా.. అత్యవసర విచారణకు, తక్షణ ఉత్తర్వులివ్వడానికి సీజేఐ నిరాకరించారు. ఈ పిటిషన్ ఇవాళ్టి కేసుల జాబితాలో లేదని తెలిపారు. ‘నిబంధనలు అందరికీ సమానమే. మంగళవారం సముచిత పద్ధతిలో మా ముందు ప్రస్తావించండి’ అని సూచించారు.
మిస్టర్ ఇండియాలా ఉద్ధవ్ మాయం
శిందే వర్గాన్ని అధికారిక శివసేన గుర్తించడంతో ‘ముగాంబో ఖుష్ హువా’ అని కేంద్ర హోం మంత్రి అమిత్షాను ‘మిస్టర్ ఇండియా’ సినిమాలోని విలన్గా పేర్కొంటూ ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆ సినిమాలో హీరో మిస్టర్ ఇండియాలా మహారాష్ట్ర రాజకీయాల నుంచి ఉద్ధవ్ అదృశ్యమైపోయారని ఎద్దేవా చేసింది. కాగా, సీఎం శిందేనుద్దేశించి యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాసిక్ పోలీసులు ఐపీసీ 500వ సెక్షన్ కింద కేసు నమోదుచేశారు. సీఎం ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని శిందే వర్గం నేత యోగేశ్ బేల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Updated Date - 2023-02-21T03:50:14+05:30 IST