Supreme Court ; డాక్యుమెంటరీపై నిషేధం చట్టవిరుద్ధం
ABN, First Publish Date - 2023-01-31T01:16:53+05:30
గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లకు సంబంధించి బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారంపై కేంద్రం విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాల (పిల్స్)ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
సుప్రీంకు న్యాయవాదుల అభ్యర్థన
వచ్చే వారం విచారిస్తామన్న ధర్మాసనం
న్యూఢిల్లీ, జనవరి 30: గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లకు సంబంధించి బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం(BBC documentary broadcast)పై కేంద్రం విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాల (పిల్స్)ను విచారించేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) అంగీకరించింది. వచ్చే సోమవారం వీటిపై విచారణ జరుపుతామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ (CJI Justice DY Chandrachud) నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ,(Justice PS Narasimha) జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది ఎం.ఎల్ శర్మ ఒక వ్యాజ్యం, ప్రముఖ జర్నలిస్టు ఎన్. రామ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్లు మరో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రామ్, ప్రశాంత్ భూషణ్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ సీయూ సింగ్, తాను వేసిన పిల్పై న్యాయవాది శర్మ ధర్మాసనం ముందు హాజరై.. వ్యాజ్యాలను అత్యవసరంగా విచారించాలని కోరారు. డాక్యుమెంటరీ ప్రసారాలపై నిషేధం విధించడం చట్టవిరుద్ధం, దుర్మార్గం, ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుని.. వ్యాజ్యాన్ని సోమవారం నాటి కేసుల్లో చేర్చుతామని పేర్కొంది.
సుప్రీం విలువైన సమయం ఇలా వృథా: రిజిజు
బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసినవారిపై న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు మండిపడ్డారు. అత్యున్నత న్యాయస్థానం యొక్క విలువైన సమయాన్ని ఇలా వృథా చేస్తున్నారని విమర్శించారు. ‘వేలాదిమంది సామాన్య పౌరులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. గౌరవనీయ సుప్రీంకోర్టు విలువైన సమయాన్ని వీరు ఇలా వృథా చేస్తున్నారు’ అని రిజిజు ట్వీట్ చేశారు. కాగా, స్వతంత్ర విధానాన్ని అనుసరించే దేశాలపై బీబీసీ సమాచారం యుద్ధం చేస్తోందని, జర్నలిజం విలువలకు పాతరేస్తోందని రష్యా నిప్పులు చెరిగింది. మోదీపై డాక్యుమెంటరీనే ఇందుకు ఉదాహరణ అని పేర్కొంది.
Updated Date - 2023-01-31T09:38:58+05:30 IST